BJP party news in telugu(Latest political news in India):
ఆగస్టు సంక్షోభం అనగానే ముందుగా గుర్తొచ్చేది తెలుగు దేశం ప్రభుత్వం. నాటి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ ఆగస్టు మాసంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడంతో సెంటిమెంట్ గా ఆగస్టు సంక్షోభం బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆగస్టు సంక్షోభం కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్ కు చుట్టుకునేలా ఉంది.
ఆదిలోనే బీజేపీకి షాక్
నాలుగొందలు టార్గెట్ అంటూ బరిలో దిగిన బీజేపీ సర్కార్ సంకీర్ణంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే మొన్నటి పార్లమెంట్ స్పీకర్ ఎంపిక విషయంలో ఆదిలోనే బీజేపీ సంకీర్ణ సర్కార్ కు షాక్ తగిలింది. బలమైన ప్రతిపక్షం ఉండటంతో గత పదేళ్లుగా సాగించిన హవా ఈ సారి బీజేపీ సర్కార్ కు కష్టంగా మారింది. కేవలం మిత్రపక్షాల బలం మీదే ఆధారపడిన బీజేపీకి ఇక రాబోయే ఐదేళ్లు కొనసాగేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అటువైపు ఇండియా కూటమి తలుచుకుంటే మోదీ సంకీర్ణాన్ని చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లేకపోలేదు. అలాగే మోదీ నమ్ముకున్న మిత్ర పక్షాలు ఎంతకాలం ఆయనకు సపోర్ట్ గా నిలబడతాయో తెలియని పరిస్థితి. బీజేపీకి కీలకంగా మద్దతు ఇస్తున్న అటు జేడీయూ గానీ ఇటు తెలుగుదేశం గానీ ఎంతకాలం మోదీకి బాసటగా నిలుస్తాయో తెలియని స్థితి.ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత లాలూప్రసాద్ యాదవ్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. మోదీ సర్కార్ ఆగష్టులోగా కూలిపోతుందని.
నితీష్ చక్రం తిప్పుతారా?
ట్రాక్ రికార్డు చూస్తే నితీష్ కుమార్ కు పార్టీలు, పొత్తులు మార్చడంలో ఆయనకు మించినవారు లేరంటారు పొలిటికల్ పెద్దలు. ప్రస్తుతానికి ఆయన తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పట్టుపడుతున్నారు. పైకి రాష్ట్రం కోసమే అయినా దాని వెనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉంది అని అంటున్నారంతా. లోపాయికారీగా నితీష్ అటు ఇండియా కూటమి, ఇటు బీజేపీతో డబుల్ గేమ్ ఆడతున్నారని కొందరు రాజకీయ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. లాలూ ప్రసాద్ అంటున్నట్లు ఆగస్టు లోగా సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లితే వెనుక చక్రం తిప్పేది మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమారే అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీహార్ కు చెందిన లాలూ ప్రసాదే చెప్పడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
చంద్రబాబుతో ప్రాబ్లం లేదు
ప్రస్తుతానికి చంద్రబాబుకు మాత్రం ఆ ఆలోచన ఉండివుండక పోవచ్చు. అంత అర్థాంతరంగా మోదీ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం కూడా రాకపోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు వాజ్ పేయి సర్కార్ అప్పట్లో ఎన్నో సంక్షోభాలు ఫేస్ చేసినప్పుడు స్వయంగా చంద్రబాబే అండగా నిలబడి వాజ్ పేయి సర్కార్ ను నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. మోదీ సర్కార్ కు ఏదైనా ముప్పు వాటిల్లిందంటే అది కేవలం నితీష్ కుమార్ నుంచే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.