Nara Lokesh latest news(AP political news): వైసీపీ నాయకులు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కొందరు ముఖ్యనేతల చుట్టూ కూడా కేసుల ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పటికే అరెస్ట్ల పర్వానికి కూడా తెర లెగిసింది. దాంతో ఎవరికి వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయి వ్యవహరించిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం కూటమి సర్కారు కక్షపూరిత చర్యలకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని గగ్గోలు పెడుతున్నారు. అయినా లోకేష్ మాత్రం రెడ్బుక్లో ఉన్న ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి జరిగింది. అప్పట్లో జగన్ ప్రభుత్వం ఉండటంతో పోలీసులు ఆ కేసును పట్టించుకోలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక.. లోకేష్ రెడ్బుక్ ఎఫెక్ట్తో పోలీసులు పాత కేసుల ఫైళ్ల దుమ్ముదులిపి కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం విధ్వంసానికి సంబంధించి సీసీ ఫుటేజ్లు ఉన్నా పోలీసులు దాన్ని పట్టించుకోలేదు.
వైసీపీ నేతల కనుసన్నల్లోనే వారి అనుచరులు టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఇప్పుడు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ తోపాటు వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం కూడా నిందితులుగా ఉన్నారు. వారు కారులో కూర్చుని పర్యవేక్షిస్తుండగా వారి అనుచరులు టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు సీసీ కెమారాల ఫుటేజీల్లో రికార్డ్ అయిందంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారు. దాంతో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. ఆగస్టు 20 వరకు పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 20న జరిగే విచారణలో కోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి వైసీపీ నేతల వ్యవహారంలో పోలీసులు ముందుకెళ్లే అవకాశం ఉంది. కోర్టు వారి ముందస్తు బెయిల్ను కొట్టేస్తే వారి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తుంది.
Also Read: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుందా..?
ఇక ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు గుడివాడలో టీడీపీ ఆఫీసుపై దాడితో పాటు పలు కేసులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్కి కూడా ముహూర్తం దగ్గరపడిందంటున్నారు. మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఇప్పటికే పోలీసు విచారణలకు హాజరవుతున్నారు.
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ ఇప్పటికే జైలు పాలయ్యారు. ప్రస్తుతం మంగళగిరి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న జోగి రమేశ్కు కూడా అరెస్ట్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై తెగ ప్రేమ ఒలకబోస్తూ.. చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించిన జోగి రమేశ్.. చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడ్డారు. అప్పట్లో అసలు చంద్రబాబుని రాష్ట్రంలో తిరగనివ్వబోమని వార్నింగులు ఇచ్చిన ఆయన ఇప్పుడు వాయిస్ మార్చేశారు.
ఆ క్రమంలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని జగన్ తెగ ఇదై పోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాటకు ముందొకసారి తర్వాత ఒకసారి రెడ్ బుక్ జపం చేస్తున్నారు. మొన్నా మధ్య ఢిల్లీలో ధర్నా సందర్భంగా సైతం నేషనల్ మీడియా ముందు దానిపై ఆందోళన వ్యక్తం చేసి వచ్చారు.
వైసీపీ నేతల భయానికి తగ్గట్లే మంత్రి లోకేష్ రెడ్ బుక్పై క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ విషయంపై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. రెడ్ బుక్ లో ఉన్నవారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పారు. అయితే.. రెడ్ బుక్ అంశాన్ని ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తుందని.. అవినీతికి పాల్పడిన వారి పేర్లు రెడ్ బుక్ రాశానని గతంలోనూ చెప్పానని.. ఇప్పుడూ అదే విషయం చెబున్నానని లోకేష్ స్పష్టం చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ భూములతో మొదలైన రెడ్ బుక్ ఎంక్వైరీలు ఇప్పుడు టీడీపీ ఆఫీసులపై దాడుల కేసులను తిరగతోడుతున్నాయి. మరి లోకేశ్ చెప్తున్నట్లు అన్ని విభాగాలపై విచారణలు మొదలైతే వైసీపీలో ఎంతమందికి కేసుల ఉచ్చు బిగుసుకుంటుందో చూడాలి.