Lok Sabha Elections : ఆపరేషన్ సౌత్.. ఇదీ హస్తం పార్టీ పెట్టుకున్న టార్గెట్. టోటల్ 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. మెజార్టీ సీట్లు గెలవడమే టార్గెట్. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సింది 273 సీట్లు. ఇందులో పార్టీకి అనుకూలంగా ఉన్న దక్షిణ భారతదేశం నుంచి మెజార్టీ స్థానాలు గనక వస్తే కేంద్రంలో సర్కార్ ఏర్పాటుకు రూట్ క్లియర్ అవుతుందన్న ఉద్దేశంతో హైకమాండ్ ఉంది. అందుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.
కేంద్రంలో ఎన్డీఏది రెండు టర్మ్ లు పూర్తికావొచ్చింది. మార్చి తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగడం ఖాయమే. అయితే ఎలాగైనా ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది. ఇందుకు కావాల్సిన అన్ని చర్యలపై ఫోకస్ పెట్టారు. ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు గెలిస్తే అధికారానికి దగ్గరవుతాం అన్న లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్ అధినాయకత్వం. ఈసారి కచ్చితంగా గెలవాల్సిందే అన్న లక్ష్యంతో కనిపిస్తున్నారు.
గతంలో చాలా తక్కువ స్థానాలకు పరిమితమైన పెద్ద రాష్ట్రాలపై ఫోకస్ పెంచడంతో పాటే పట్టు పెరిగిన సౌత్ ఇండియాలో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలిచే లక్ష్యంతో పని చేస్తున్నారు. గ్రౌండ్ వర్క్ పూర్తిస్థాయిలో నడుస్తోంది. ఆ వ్యూహాలను అమలు చేయడమే మిగిలింది. నిజానికి దక్షిణ భారత్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు స్కోప్ పెరుగుతూ వచ్చింది. రోజురోజుకూ ఇది మరింత పెరిగింది. ఆర్నెళ్ల వ్యవధిలో కర్ణాటక, తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. కేరళలో గ్రౌండ్ పెరిగింది. అటు తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పొత్తులో ఉంది. ఒక్క ఏపీలో వెనుకబడి ఉంది. అయితే మిగితా రాష్ట్రాల్లో కవర్ చేసుకోవడం ద్వారా స్టోరీ మార్చాలనుకుంటోంది హస్తం పార్టీ.
కర్ణాటకలో 28 ఎంపీ సీట్లు ఉన్నాయి. అటు ఏపీలో 25 సీట్లు, కేరళలో 20 లోక్ సభ స్థానాలు, తెలంగాణలో 17 సీట్లు, పుదుచ్చేరిలో ఒకటి, తమిళనాడులో 39 ఇలా మొత్తం కలిపి సౌత్ ఇండియాలో 129 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 273 సీట్లు కావాలి. ఈ 129 సీట్లలో ఎన్ని గెలుస్తామన్నది హస్తం పార్టీ వ్యూహాలు వర్కవుట్ అయ్యే దానిపై ఆధారపడి ఉన్నాయి. ఈ 129 సీట్లలో 90కి పైగా సాధించే వ్యూహంతో పని చేస్తోంది హైకమాండ్. సరిగ్గా వ్యూహాలు అమలు చేస్తే ఇది సాధ్యమేనని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. తెలంగాణలో 10కి పైగా సీట్లు, కేరళలో గతంలో మాదిరిగా 15 సీట్లు, తమిళనాడులో పది సొంతంగా, మిగిలినవి డీఎంకేతో కలిసి సాధించడం.. కర్ణాటకలో గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటే దక్కినప్పటికీ ఈసారి 15కు పైగా సీట్లు సాధించాలనుకుంటోంది.
తమిళనాడులో డీఎంకే గతంలో మాదిరి తమకు 10 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయని, వాటిలో కనీసం 8 గెలవాలని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ఇక కీలక రాష్ట్రాలను పార్టీకి చెందిన ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తూనే, ఆయా రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతలను స్థానికంగా ప్రజాబలం ఎక్కువగా ఉన్న నాయకుల భుజస్కంధాలపై పెట్టాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆలోచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన సారథ్యంలో సీనియర్ మంత్రులుగా ఉన్న నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లలో 10కి పైగా గెలిచి సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. అటు కర్ణాటక బాధ్యతలను సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు, కేరళ బాధ్యతలను స్థానిక నేతలు సుధాకరన్, సతీశన్లకు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కేరళ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల ఆ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆయనకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను అధిష్ఠానం అప్పజెప్పింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ గత రెండు టర్మ్ లలో అస్సలు ఎఫెక్ట్ చూపించలేకపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో హస్తం పార్టీ 2 స్థానాలు గెలిస్తే.. 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. 48 ఎంపీ సీట్లున్న కీలకమైన మహారాష్ట్రలో ఒకటి రెండు సీట్లకే పరిమితం కావడం ఏంటన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఇది మార్చాలని అనుకుుంటున్నారు. అందుకే మహారాష్ట్రలోనూ ఫోకస్ పెంచారు.
ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకే బాధ్యతల్ని అప్పజెబుతూ ఢిల్లీ నుంచి నేరుగా పర్యవేక్షించాలని హస్తం హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాదిన ప్రచారం చేసేందుకు రాహుల్గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాంధీ, సచిన్ పైలట్లకు బాధ్యతలు అప్పగించాలని ఖర్గే భావిస్తున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో ప్రియాంకాగాంధీకి ఏ బాధ్యతలు ఇవ్వకపోవటం, సచిన్ పైలట్కు ఛత్తీస్ గఢ్ వంటి చిన్న రాష్ట్రం అప్పజెప్పడం ఇందుకు సంకేతమంటున్నారు. జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారం, పొత్తుల్లో జోక్యం వంటి కీలక బాధ్యతలను కూడా ప్రియాంకకు అప్పగించాలని ఖర్గే యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పొత్తుల కోసం 5 గురు సభ్యులతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా కమిటీ కూడా వేసింది. ఏయే రాష్ట్రంలో భావ సారూప్య పార్టీలతో పొత్తులకు అవకాశం ఉందో లెక్కలు వేస్తున్నారు. ఆయా పార్టీలను సంప్రదించే పనిని పొత్తుల కమిటీ ఇప్పటికే ప్రారంభించి కూడా.
.
.