ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ మారింది. కొత్త ఎక్సైజ్ విధానంతో.. ప్రైవేటు మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణంగా.. వైన్ షాపులకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంటుంది. కేవలం.. దరఖాస్తుల ఫీజులతోనే.. వేల కోట్లు అలా వచ్చి సర్కారు ఖాతాలో పడిపోతాయ్. కానీ.. ఏపీలో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఇప్పటికే.. లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వానికి.. వైన్ షాపు టెండర్లతో వచ్చే ఆదాయం.. కొంత ఆసరాగా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. కనీసం.. ఓ నెల ఫించన్లు ఇవ్వడానికైనా.. డబ్బులు ఉపయోగపడతాయని ఆలోచించారు.
కానీ.. కింది స్థాయిలో ఉండే ప్రజా ప్రతినిధులు మాత్రం.. దీనికి చెక్ పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. లీడర్లంతా.. మద్యం షాపులు తమ చేతుల్లోనే ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రతి దుకాణానికి సగటున 30 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ.. ఇప్పటివరకు చాలా వైన్ షాపులకు ఒక్క అప్లికేషన్ కూడా రానట్టుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 396 వైన్ షాపులకు లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. వీటన్నింటికి కలిపి.. ఇప్పటివరకు కేవలం 8 వేల 274 మాత్రమే వచ్చాయి.
961 దుకాణాలకు దరఖాస్తులే లేవు
961 దుకాణాలకు.. ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. దరఖాస్తులు ఆహ్వానించి వారం కావస్తున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మరో 3 రోజుల్లో.. ఆ గడువు కూడా ముగుస్తుంది. ఎక్సైజ్ అధికారులకు ఉన్న అంచనా ప్రకారం.. ఇప్పటికే 30 వేలకు పైగా దరఖాస్తులు రావాలి. కానీ.. కొందరు నాయకుల తీరుతో వ్యవహారం బెడిసికొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఇలాంటి పరిస్థితే ఉంది.
తిరుపతిలో బెదిరింపులు?
రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 మద్యం దుకాణాలున్నాయ్. వీటన్నింటికి కలిపి.. ఇప్పటివరకు 165 దరఖాస్తులు మాత్రమే వచ్చాయ్. తిరుపతిలోని చంద్రగిరికి చెందిన ఓ చోటా నాయకుడు.. మద్యం వ్యాపారులు, టెండర్లు వేసే వారితో కలిసి.. సిండికేట్గా ఏర్పడి చివర్లో అప్లై చేద్దామనే ఒప్పందానికి వచ్చారట. అలా కాదని.. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే.. మద్యం షాపు వచ్చాక ఎలా అమ్ముకుంటావో చూస్తానని బెదిరిస్తున్నారట! దాంతో.. తిరుపతిలో వైన్ షాపు లైసెన్స్ల కోసం అప్లికేషన్లు చాలా వరకు తగ్గిపోయాయ్.
Also Read: కమలాపురంలో వైసీపీ ఖాళీ.. జగన్ మేనమామ రవీంద్రనాథ్కు టీడీపీ ఝలక్
ఇక.. వైసీపీకి చెందిన మరో మద్యం వ్యాపారి టీడీపీ, జనసేన నాయకులతో కలిసి.. ఒక్కటై వైన్ షాపులు నడుపుకుందామనే ఒప్పందానికి వచ్చారట. చిత్తూరు జిల్లాలోని తమిళనాడు బోర్డర్ నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయ్. అనంతపురం జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. లిక్కర్ కింగ్గా పేరుగాంచిన ఓ నాయకుడు.. ఈసారి కూడా తానే సిండికేట్ బాధ్యతలు తీసుకున్నారంట.
వాటాలు ఇవ్వాలంటూ డిమాండ్
సత్యసాయి జిల్లాలోనూ ఇలాంటి వ్యవహారమే నడుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా.. వాటికి ఎక్కువగా దరఖాస్తులు రాకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ వ్యాప్తంగా.. ఇవే పరిస్థితులు నెలకొన్నాయ్. స్పాట్.. కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రతి మద్యం దుకాణంలో వాటా కావాలంటున్నారట. వారు ఎలాంటి పెట్టుబడి పెట్టకపోయినా.. 25 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఇలా.. దరఖాస్తులు వేయకుండా అడ్డుకుంటున్న వారి వివరాలు.. ఇప్పటికే ఇంటలిజెన్స్ విభాగం ద్వారా సీఎం చంద్రబాబుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై.. ఆయనెలా స్పందిస్తారు? బెదిరింపులకు దిగుతున్న ప్రజా ప్రతినిధులకు ఎలాంటి క్లాసులు పీకుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.