Lion in Public Meeting : ఒక ప్రధాన మంత్రి ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలో మాట్లాడుతుండగా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే మరో నేత ఆ సభ ఆపేయాలని జనంపై సింహాన్ని తీసుకువచ్చి వదిలాడు. ఇంకేముంది.. సింహాన్ని చూసిన ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. 1974వ సంవత్సరం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. దేశ రాజధని ఢిల్లీ సమీపంలోని దాద్రీ పట్టణం, గౌతం బుద్ధ్ నగర్ ప్రాంతంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రచార సభ జరగాల్సి ఉంది. ఆ ప్రాంతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సరిహద్దులో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ నియోజకవర్గంలో గుర్జర్ నేత రామచంద్ర వికల్కు ఓటు వేయాలని ఇందిర గాంధీ ఆ ప్రచార సభలో మాట్లాడబోతున్నారు.
నిజానికి ఆ నియోజకవర్గంలో రైతు నేత బీహారీ సింగ్ బాగీకు మంచి బలముంది. పైగా ఆయన అదే ప్రాంతానికి చెందినవాడు. బీహారీ సింగ్.. ఇందిరా గాంధీకి సన్నిహితుడిగా పేరు సంపాదించారు. కానీ పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్కు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇందిరా గాంధీ అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ గుర్జర్ నేత రామచంద్ర వికల్ను టికెట్ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో రైతు నేత బీహారీ సింగ్ ఆగ్రహంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనకు ఎన్నికల సంఘం సింహం గుర్తును కేటాయించింది. ఆ తరువాత ఇందిరా గాంధీ స్వయంగా గుర్జర్ నేత రామచంద్ర వికల్ కోసం బహిరంగ సభ పెట్టి ప్రచారం చేయబోతున్నారని బీహారీ సింగ్కు తెలిసింది. దీంతో బీహారీ సింగ్.. ఏకంగా ఇందిరా గాంధీకి ఒక సందేశం పంపాడు. తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ గుర్జర్ నేత వికల్కు అనుకూలంగా సభ పెట్టొద్దని ఆ సందేశంలో ఉంది. అయినా ఇందిరా గాంధీ అతడిని లెక్కచేయలేదు.
ఇందిరా గాంధీ బహిరంగ సభ కోసం ఆ ప్రాంతానికి వచ్చారు. ఇది తెలిసిన బీహారీ సింగ్ ఆ సభను ఆపేందుకు ఒక ప్లాన్ వేశాడు. ఆ సమయంలో దాద్రీ సమీపంలో ఉన్న ఘాజియాబాద్లో ఓ సర్కస్ జరుగుతోంది. బీహారీ సింగ్ వెంటనే ఆ సర్కస్ నిర్వహకులకు రూ.500 ఇచ్చి ఒక సింహాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ సింహాన్ని బోనులో పెట్టుకుని ఇందిరా గాంధీ సభ స్థలానికి వచ్చాడు.
ఇందిరా గాంధీ సభను ప్రారంభించగానే బీహారీ సింగ్ సభలో ఉన్న జనంపైకి ఆ సింహాన్ని వదిలాడు. సింహాన్ని చూసిన ప్రజలు భయంతో వణుకుతో పరుగులు తీశారు. జనం భారీ సంఖ్యలో ఉండడంతో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా ఇందిరా గాంధీ సభను కేవలం 5 నిమిషాల్లో ముగించాల్సి వచ్చింది.
ఆ ఎన్నికల్లో బీహారి సింగ్ ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర వికల్ కూడా గెలవలేకపోయారు. 1992 సంవత్సరంలో బీహారీ సింగ్ ఒక రైతు ర్యాలీలో వెళుతున్నప్పుడు అతనిపై కాల్పులు జరిపారు. ఆ దాడిలో బీహారి సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.
భారతదేశ మరో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కూడా అత్యంత సన్నిహితుడైన బీహారీ సింగ్ బాగీ 2020, నవంబర్ 29న మరణించారు.