Hydra Demolitions: అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు.. పవర్ పోగానే మర్చిపోయారు. అప్పట్లో భారీ వర్షాలు హైదరాబాద్ను ముంచెత్తిన సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేతపై సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.. ఇప్పుడదే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా శరవేగంగా చేస్తుంది. వారువీరు అన్న తేడా లేకుండా అన్ని అక్రమ కట్టడాలను బుల్డోజర్లు నేల మట్టం చేస్తున్నాయి. అప్పుడు తండ్రి చెప్పిన మాటలు మర్చిపోయినట్లు కేటీఆర్ సీన్లోకి వచ్చి బుల్డోజర్లకు అడ్డం పడతానంటున్నారు. దాంతో ఇప్పుడు గులాబీబాస్ చెప్పిన మాటలు వైరల్ అవుతూ.. చిన్న బాస్ స్టేట్మెంట్లు విమర్శలు మూటగట్టుకుంటున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎంత పెద్ద మాటల మాంత్రికుడో వేరే చెప్పనవసరం లేదు. టీఆర్ఎస్ స్థాపన దగ్గర నుంచి ఉద్యమ సమయంలో, పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు ఆ మాటల గారడీతోనే ఆయన చెలాయించారు. అయితే మాటలే కాని చేతలు ఉండవని తేలడంతో పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు ఆయన్ని ఫాంహౌస్కి పరిమితం చేసేశారు.
అప్పట్లో భారీ వర్షాలు హైదరాబాద్ను ముంచెత్తినప్పుడు.. ముఖ్యమంత్రిగా కేసీఆర్కు అక్రమ కట్టడాలు గుర్తుకొచ్చాయి. నాలాలపై అక్రమ కట్టడాలు కూల్చివేస్తామని ప్రకటించారు. కొత్తగా అక్రమ కట్టడాలు నిర్మించి ఆస్తులు పాడు చేసుకోవద్దని ప్రజలకు సూచనలు కూడా చేశారు. ఆ కూల్చివేతలను పాజిటివ్గా ఫోకస్ చేయాలని మీడియాను రిక్వెస్ట్ చేశారు.
హైదరాబాద్లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని.. వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకుని వాటిని నిర్దాక్షణ్యంగా నేలమట్టం చేస్తామన్నారు. ప్రతి సర్కిల్కు ఫ్లైయింగ్ స్వాడ్ ఏర్పాటు చేసి కొత్తగా అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టుదిట్ట చర్యలు చేపడుతామని ప్రకటించారు. అయితే అక్రమ కట్టడాలు కూల్చివేయలేదు సరికదా.. మరిన్ని అక్రమాలకు పచ్చజెండా ఊపారన్న ఆరోపణలున్నాయి. మాటలు తప్ప చేతల్లో ఏమీ చూపించలేకపోయిన కేసీఆర్ను ప్రజలకు మాజీని చేశారు.
Also Read: ఏమైనా కానీ నేను ఏం మాట్లాడను.. భయంలో చెవిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైన హైడ్రా సంస్థ ఆక్రమణలపై కొరఢా ఝుల్లిపిస్తోంది. చెరువులు, నాలాలను కబ్జా చేసిన ప్రతిచోట వాలిపోయి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. అక్రమ కట్టడం గురించి ఫిర్యాదు అందగానే బుల్డోజర్లు అక్కడ ప్రత్యక్షమై వాటి పని అవి చేసుకుని పోతున్నాయి. ఆ కూల్చివేతలను ప్రజలు, పర్యావరణవేత్తలు కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చైర్మన్గా, రంగనాధ్ కమిషనర్గా ఏర్పాటైన హైడ్రా స్పీడ్ రోజురోజుకి పెరుగుతోంది.
నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు వచ్చే నెలలో ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తీసుకురానుంది. మంత్రివర్గ ఆమోదంతో విశేష ఆధికారాలతో హైడ్రా ఉండబోతుంది. జీవో 99 ద్వారా జులై 19న ఏర్పాటైన హైడ్రా చట్టబద్దతను ప్రశ్నిస్తూ కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తరహాలోనే ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్తో హైడ్రా ఏర్పాటైంది. టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందన్న ప్రశంసలు వస్తున్నాయి.
ఆ క్రమంలో నాడు అవే అక్రమాలను కూల్చేస్తామని.. చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడు చెప్పిన మాటలు ఆచరణలో ఏమయ్యాయి పెద్ద సారూ.. అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు హైడ్రా పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కేటీఆర్ ప్రకటనలు ఉండటంపై సెటైర్లు విసురుతున్నారు.
గ్రేటర్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదన్న అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పగబట్టిందని.. కేటీఆర్ విచిత్రంగా వాదిస్తున్నారు. అప్పుడు తండ్రి కేసీఆర్ చెప్పిన మాటలు మర్చిపోయిన కేటీఆర్కు.. ఇప్పుడు కంటోన్మెంట్ బైపోల్స్లో తమ పార్టీ ఓడిపోయిందన్న విషయం కూడా గుర్తున్నట్లు లేదంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ బాసులు అలా కానిచ్చేస్తున్నారు.