నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే.. ఈసారి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జేసీ. తాడిపత్రిలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చునన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాను అడ్డుకోనని స్పష్టం చేశారు. ఓ అడుగు ముందుకేసి.. అవసరమైతే తాను కూడా వారి వ్యాపారంలో పెట్టుబడి పెడతానన్నారు. ఇసుక వ్యాపారం, దుకాణాలకు సంబంధించి ప్రతి మండలం నుంచి రూపాయికి.. 15 పైసలు చొప్పున కమిషన్ ఇవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తాను కూడా పెట్టుబడి పెడతానని.. 20 పైసలు ఇవ్వాలని అన్నారు. అయితే తాను ఈ డబ్బుతో తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. ఒక్కసారిగా జేసీ నోట.. ఇలాంటి మాట రావటంతో.. ఆయన వర్గీయులతో పాటు పార్టీ వర్గాలూ కాస్త ఆలోచనలో పడ్డారు. జేసీ మాత్రం తాను ఫుల్ క్లారిటీగా ఉన్నట్టుగానే చెబుతున్నారు.
ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎమ్మెల్యేలంటే గౌరవమని.. వారిని ఎంతో గౌరవిస్తానని అన్నారు. ఇక్కడే ఆయన ట్విస్ట్ పెట్టారు. తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం వేలు పెడితే సహించేది లేదని చెబుతున్నారు. తన నియోజకవర్గంలోకి ఎలా వస్తారని ప్రశ్నించిన జేసీ.. తామేమైనా వారి నియోజకవర్గంలో జోక్యం చేసుకున్నామా అంటూ ప్రశ్నించారు. ఇసుక రీచ్లు, మద్యం దుకాణాలు.. తమకు ముఖ్యం కాదని.. నియోజకవర్గ అభివృద్ధే తమకు ప్రాధాన్యమని అన్నారు. దీనికోసం ఇప్పటికే బ్యాంకులో 3 కోట్లు ఉన్నాయని చెప్పారు. సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. 1952 నుంచి తాడిపత్రి ప్రజలు.. తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారన్న జేసీ.. తాడిపత్రి ప్రజల అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Also Read: టీటీడీ ఛైర్మన్ పదవి రాజుకే అవకాశాలెక్కువా?
మరోవైపు.. ఇసుక అక్రమ రవాణాలో టీడీపీకి చెందిన నాయకులు, తన అనుచరులే ఉన్నారంటూ జేసీ ప్రభాకర్రెడ్డి ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. అక్కడ గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. తన కుమారుడు కావడంతో ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చాయి. గడిచిన ఐదేళ్లుగా తనకు అండగా నిలిచిన నాయకులు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ.. తాను గ్రీన్ ట్రైబ్యునల్, కోర్టులు, అధికారుల చుట్టూ తిరిగి పోరాటం చేస్తే.. ఇప్పుడు తన అనుచరులే ఇసుక దందా చేస్తున్నారని వీడియోలో ఆయన వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది.
తాడిపత్రి నియోజకవర్గంలో సుమారు 2 లక్షల 50 వేలమంది ఉంటే.. కేవలం 25 మంది ఇసుక దందా చేసి దోచుకుంటున్నారని జేసీ ప్రభాకకర్ రెడ్డి ఆరోపించారు. మీ దందా, ఇసుక అక్రమరవాణా మరెక్కడైనా చేసుకోండి కానీ.. నా నియోజకవర్గంలో మాత్రం కనిపిస్తే.. ఆయా టిప్పర్లు, ట్రాక్టర్లు కూడా బయటకు కూడా రావంటూ.. వాహన యజమానులనూ ఇన్డైరెక్ట్గా హెచ్చరించారు. కాబట్టి.. జేసీ ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. ఫ్యూచర్లో తాడిపత్రిలో ఇంకెన్ని సంచలనాలు జరుగుతాయో చూడాలి.