YS Jagan vs Kottu Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నాయకత్వాన్ని వైసీపీ శ్రేణులు క్రమేపి తిరస్కరించడంతో పార్టీ అధిష్టానం అక్కడ రెండో పవర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్ పొలిటీషియన్ కొట్టు కాంపౌండ్లో ఇక ఇమడలేమంటూ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి గూడెం వైసీపీ నేతలకు ఎందుకొచ్చింది? గూడెం వైసిపి ఇన్చార్జి ను వైసిపి అధిష్టానం మార్చబోతుందన్న ప్రచారంలో వాస్తవమెంత ?
తాడేపల్లి గూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సీనియర్ రాజకీయనాయకుడు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్పుకోదగ్గ నేతల్లో ఒకరు. 1994లో కాంగ్రెస్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన తాడేపల్లిగూడెంలో ఏడు సార్లు పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్ నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు.. తర్వాత వైసీపీలో చేరి 2019లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలవగలిగారు. అయితే తనకంటూ ప్రత్యేక వర్గం తయారు చేసుకొని గూడెంలో బలమయిన నేతగా పేరు తెచ్చుకున్నారు. జగన్ ఆయన్ని రెండో టర్మ్లో డిప్యూటీ సీఎంని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు.
అలాంటి కొట్టు సత్యనారాయణ 2024 ఎన్నికల్లో జనసేన చేతిలో ఘోర పరాభవం తర్వాత పూర్తిగా ఢీలా పడిపోయారు. గత ప్రభుత్వ హయం లో ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజసం వెలగబెట్టిన కొట్టు సత్యనారాయణ క్యాంపస్ వైపు ఇప్పుడు కనీసం వైసీపీ కార్యకర్తలు చూడకపోతుండటం గూడెం లో చర్చనీయాంశమయింది. అధికారం ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన కొట్టు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు సొంత పార్టీ సొంత కార్యకర్తలే బహిరంగంగా తన పై విమర్శలు చేస్తుండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారంట.
అధికారం ఉన్నప్పుడు వైసీపీలో కష్టపడ్డ కార్యకర్తలను కాదని కొట్టు సత్యనారాయణ తనకు భజన చేసిన వారికి , తన సొంత బంధు వర్గానికి నామినేటెడ్ పదవులు , లాభం వచ్చే టెండర్లు అప్పచెప్పారన్న ఆరోపణలున్నాయి. అప్పట్నుండి అవకాశం కోసం చూస్తున్న వైసీపీ కార్యకర్తలకు అదే నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేత వడ్డీ రఘురాం నాయుడు ఒక చుక్కానిలా దొరికారని అంటున్నారు .. ఇప్పటివరకు కొట్టు కుటుంబ ఏకఛత్రాధిపత్యం లో నలిగిపోయిన సామాన్య వైసిపి కార్యకర్తలు మెల్లిగా వడ్డీ రఘురాంనాయుడు వర్గం వైపు వెళ్లడంతో జిల్లా వైసీపీలో ఇప్పుడు గూడెం రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: అనంతపురం టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. కారణం ఏం
గతం లో ఏపీఎస్ఎస్డీసీ చైర్మెన్ గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు మాజీ సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉండటం రఘురాంనాయుడుకు కలిసి వస్తున్న అంశంగా చెప్పుకుంటున్నారు. గత ఐదేళ్లు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కామ్ అయిపోవడం, కష్టపడిన కార్యకర్తలు వడ్డీ వర్గంలో చేరడంతో కొట్టు ఎం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారట. గూడెంలో ఇక వైసీపీ నియోజకవర్గ ఇన్జార్జ్ బాధ్యతలు వడ్డీ రఘురాంనాయుడు కి ఇస్తారనే ప్రచారంతో కొట్టు అలెర్ట్ అయ్యారంట.
అయిదేళ్ల పాటు పార్టీ కి విధేయుడిగా ఉన్న తనను ఇన్ఛార్జిగా మారిస్తే అవమానంగా ఉంటుందని, 30 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న తన పరువు పోతుందని, అందుకే కొన్నాళ్ళు తననే కొనసాగించాలని వైసిపి అధిష్టానం దగ్గర కొట్టు సత్యనారాయణ ప్రాధేయపడ్డారంట. అందుకే కొంతకాలం కొనసాగుతారులే అని ఆయన్నే ఇన్చార్జ్గా ప్రకటించారంట. కొట్టుపై వ్యతిరేకతో ఉన్న వైసిపి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వడ్డీ రఘురాంనాయుడుకు రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా జగన్ అవకాశం కల్పించారంటున్నారు.
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నిరాశ నిశృహ లోకి వెళ్లిపోయిన వైసిపి కార్యకర్తలకు కనీస భరోసా కొట్టు సత్యనారాయణ ఇవ్వలేకపోతున్నారంట .. మితిమీరిన బంధు ప్రీతి తో పనులన్నీ సొంత వారికే కేటాయించుకున్న ఆయనపై వైసీపీ కేడర్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందంటున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక కొట్టు సత్యనారాయణ తన పుట్టిన రోజు వేడుకల కోసం కార్యకర్తలకు ఫోన్లు చేసి ఫ్లెక్సీ లు కట్టండి అని చెప్పారంట. అసలే ఎన్నికల్లో పందాలు కాసి నష్టాలతో ఉంటే ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి పుట్టిన రోజు సంబరాలకు డబ్బులు ఎక్కడ నుండి తేవాలని కేడర్ రివర్స్ అయిందంట.
ఇక తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఆస్తి పైనే కొట్టు కన్ను వేశారంట. దాంతో ఇదేం అన్యాయం అంటూ బాధితులతో పాటు వైసిపి నేతలు ఏకంగా జగన్ దగ్గరకు వెళ్లారంట. అసలే కష్టాల్లో ఉన్న వైసీపీ లెక్కలు తేల్చలేక సతమతమవుతుంటే ఈ అంతర్గత కుమ్ములాటలు ఏంటని మాజీ సిఎం ఆగ్రహం వ్యక్తం చేయడం తో పాటు విషయం కనుక్కుని సరిచేయాలంటూ కొల్లేరు పరిధిలోని ఓ వైసిపి మాజీ ఎమ్మెల్యేకు ఆ పంచాయతీ అప్పచెప్పారట. ఇలా ఒక్కటేమిటి రకరకాల దందాలు చేస్తూ అసలు కార్యకర్తలను పట్టించుకోని కొట్టు సత్యనారాయణపై గూడెం వైసీపీ కేడర్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుందంట.
అధికారం లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత విమర్శలతో నానా మాటలు అనడంతో ఓ పక్క జనసైనికుల సూటిపోటి మాటలు. మరో పక్క సొంత కార్యకర్తల క్రమేపి దూరం అవుతుండడంతో కొట్టు సత్యనారాయణ పరిస్థితి ఆయనకే అర్థం కాకుండా తయారైందంట. మరి ఆ సీనియర్ పొలిటీషన్ ఆ పరిస్థితిని ఎలా అధిగమిస్తారో చూడాలి.