EPAPER

Bangladesh Protests: బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌లా.. భారత్‌కు శత్రువుగా మారబోతుందా?

Bangladesh Protests: బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌లా.. భారత్‌కు శత్రువుగా మారబోతుందా?

Is Bangladesh Becomes anothe Pakistan for India: ఉద్యోగ రిజర్వేషన్ల కోసం నిరసనలుగా మొదలై దేశ ప్రధానినే పారిపోయేటట్లు చేసిన పరిస్థితి బంగ్లాదేశ్‌లో నెలకొంది. దేశం ఆర్మీ అండర్‌లోకి వెళ్లినా అల్లర్లు మాత్రం అదుపుకాలేదు. సందడిలో సడేమియా అన్నట్లు కొందరు ఆందోళనకారుల దృష్టి భారతీయులపై పడింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు పెరిగాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. అంటే, భారత్‌‌కు మరో సరిహద్దు దేశం శత్రువుగా మారబోతుందా..? భారత్ పక్కలో బంగ్లాదేశ్‌ బల్లెం అవుతుందా..?


ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల్ని చూస్తుంటే.. భారత్‌ పక్కలో మరో ముప్పు ఉందనే సంకేతాలు బలంగానే కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్య్ర యోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడంపై రేగిన నిరసనలు అదుపు తప్పాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి, ఆర్థిక సంక్షోభానికి మాజీ ప్రధాని షేక్ హసీనా నిరంకుశ పాలనే కారణమనే భావన పీక్స్‌కెళ్లింది. విద్యార్థులతో మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. యువత, విద్యార్థులు కలిసి అల్లకల్లోలం సృష్టించారు. నిప్పుల కొలిమిలా మారిన దేశాన్ని నియంత్రించలేని పరిస్థితికి ప్రధాని హసీనా చేరుకున్నారు. మిలటరీ సైతం ప్రధానిని రాజీనామా చేయమనే స్థాయికి వెళ్లింది. దేశం ప్రధాని చేయిదాటిపోయింది. చేసేది లేక ఆమె పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. తల దాచుకోడానికి భారత్ సహకారం కోరారు హసీనా. సరిగ్గా, ఇక్కడ నుండే బంగ్లాదేశ్‌ అల్లర్లలో మరో కోణం వెలుగు చూసింది.

భారత్‌కు సన్నిహితంగా ఉన్న ప్రధాని హసీనా రాజీనామా చేసి, పారిపోయే వరకూ ఒక విధంగా సాగిన ఆందోళన తర్వాత రూపం మార్చుకుంది. ప్రతి ఆందోళనలో ఉన్నట్లే ఇక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు విరుచుకుపడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఉన్న మైనరిటీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. మైనారిటీ కమ్యూనిటీలే టార్గెట్‌గా దోపిడీలు, అల్లర్లు పెరిగాయి. ప్రధానంగా హిందువులు దాడికి గురౌతున్నారు. నోబుల్ అవార్డు గ్రహీత మొమమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు ఖరారయ్యింది. అయినా, అక్కడ హిందూ దేవాలయాలకు నిప్పుపెట్టడం, హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడులు చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో, బంగ్లాదేశ్‌లోని ముస్లిం మతపెద్దలు కుమిల్లాలోని హిందూ దేవాలయానికి కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా లేకపోలేదు. అలాగే, ఢాకాలోని ఢాకేశ్వరి మందిరాన్ని బంగ్లాదేశ్ విద్యార్థులు కొందరు రక్షిస్తున్నట్లు కూడా సోషల్ మీడియా వీడియోలు చూపిస్తున్నాయి. అయితే, ఇది ఇంతటితో ఆగేటట్లు మాత్రం కనిపించట్లేదు.


Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్, వేటాడి ఊచకోత

బంగ్లాదేశ్‌లోని డైలీ స్టార్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఆగస్ట్ 5న కనీసం 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై అల్లరి గుంపులు దాడి చేశాయి. విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హసీనా ప్రభుత్వాన్ని ద్వేషించిన జమ్మత్-ఏ-ఇస్లామీ కూడా అంగీకరించింది. బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లో ఉన్న మెహెర్‌పూర్‌లోని ఒక ఇస్కాన్ ఆలయం, ఒక కాళీ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి. మెహెర్‌పూర్‌లో అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న ఇస్కాన్ సెంటర్‌‌కు నిప్పుపెట్టగా.. దేవి దేవతల విగ్రహాలు కూడా మంటల్లో దగ్ధమైయ్యాయి. రంగ్‌పూర్ సిటీ కార్పొరేషన్‌కు చెందిన హిందూ కౌన్సిలర్ హరధన్ రాయ్ మరణించినట్లు సమాచారం వచ్చింది. కాజల్ రాయ్ అనే మరో కౌన్సిలర్ కూడా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. బెంగాలీ హిందువుగా, శరణార్థుల వారసుడిగా ఉన్న హరధన్ రాయ్ మరణం ఈ ప్రాంత హిందువుల్లో మరింత భయాన్ని రేకెత్తించింది.

బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం… దేవాలయాలు, ఇళ్లు, హిందూ సమాజ నిర్మాణాలపై 54 దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక, భారత్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్ కూడా మంటల్లో కాలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇలా, బంగ్లాదేశ్‌లో హిందువులపై విస్తృతంగా జరుగుతున్న దాడులు 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత కూడా జరిగాయి. నాడు హింసాకాండలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8 శాతంగా ఉన్నారు. 1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా 22 శాతంగా ఉంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్, నివేదిక ప్రకారం, 1964, 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 11 మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుండి పారిపోయారు. అయితే, హసీనా పాలనలో దాన్ని అదుపు చేయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు. ఇక, ఇప్పుడు హసీనా బహిష్కరణ తర్వాత బంగ్లాదేశ్‌లో భారతీయులు నివశించడానికే వణికిపోతున్న పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి.

హసీనా బహిష్కరణతో ఇప్పుడు.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ-BNP, జమాత్-ఎ-ఇస్లామీ రాజకీయ రంగంలో బలమైన స్థానాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఇది ఆ దేశంలోని హిందువులను శరణార్థులగా మార్చేస్తుందనే అభిప్రాయం ఉంది. అయితే, బంగ్లాదేశ్‌తో దాదాపు 4 వేల 96 కి.మీ పొడవైన భూమి, నదీ సరిహద్దును పంచుకుంటున్న భారత్‌కు ఇది అత్యంత కీలకమైన అంశం. ఇది వరకే, బంగ్లాదేశ్‌లోని కోటి మంది హిందువులకు ఆశ్రయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఇప్పటికే విమర్శించారు.

ఇక, బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి అదుపులోకి రాకపోతే కోటి మంది హిందూ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు మానసికంగా సిద్ధపడాలని.. అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోతే.. బంగ్లాదేశ్, జమాత్, రాడికల్స్ నియంత్రణలోకి వెళుతుందని సువేందు అధికారి చెప్పారు. అయితే, బంగ్లాదేశ్‌లో సమస్య ఎలాంటిదైనా.. అక్కడ, ముస్లింల మనోభావాలు రెచ్చగొట్టబడినప్పుడల్లా, వారు తమ భూమిలో ‘కాఫీర్లను’ మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మధ్య భారత ప్రభుత్వం కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: భారీ భూకంపం.. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిక

ఆగస్ట్ 6న లోక్‌సభను ఉద్దేశించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ పొరుగు దేశంలోని మైనారిటీ వర్గాల స్థితిగతులపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని, బంగ్లాదేశ్ సైన్యంతో తాను టచ్‌లో ఉన్నానని చెప్పారు. బంగ్లాదేశ్‌లో ఉన్న 19 వేల మంది భారతీయులలో దాదాపు 9 వేల మంది తిరిగి వచ్చారని ఇందులో, ఎక్కువగా విద్యార్థులు ఉన్నారని కేంద్ర మంత్రి జై శంకర్ తెలిపారు. బంగ్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకూ అక్కడున్న హిందువుల గురించి ఆరా తీస్తుంటామని మంత్రి వెల్లడించారు. అయితే, ఈ సమస్య సాంఘీకంగానే కాక రాజకీయంగానూ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు బంగ్లాదేశ్‌ను ఆధీనంలోకి తీసుకున్న బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ దీనికి కారణం. ఆయనను ఆర్మీకి చీఫ్‌గా అపాయింట్ చేసుకోవద్దనీ.. జమాన్‌తో జాగ్రత్తగా ఉండమని గతంలో భారత్ హసీనాను హెచ్చరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

జమాన్ చైనాకు అనుకూలంగా ఉండే వ్యక్తి అని కూడా భారత్ హెచ్చరించినట్లు సమాచారం. దాదాపు 280 మంది అల్లర్లలో చనిపోయిన తర్వాత పెరుగుతున్న నిరసనలను నియంత్రించడానికి బదులుగా జనరల్ జమాన్.. హసీనాకు అల్టిమేటం జారీ చేశాడు. హసీనా, ఆమె సోదరి దేశం విడిచి పారిపోవాలని డిమాండ్ చేసింది ఆర్మీ. తర్వాత, తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే అమలులోకి వస్తుందని జమాన్ ప్రకటించాడు. సైన్యంపై విశ్వాసాన్ని ఉంచాలని బంగ్లా పౌరులను కోరాడు. కొన్ని నివేదికల ప్రకారం, భారత్‌కు మిత్రురాలిగా షేక్ హసీనా ఉండటం వల్లనే ఆమెను గద్దె దించడానికి చైనా, పాకిస్తాన్‌లు జమాన్‌ను ఆయుధంగా వినియోగించినట్లు తెలుస్తోంది. ఇక, ఇదే నిజమైతే జమాన్ ఆధీనంలో బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌లా మారి భారత్‌కు పెద్ద ముప్పుగా పరిణమిస్తుదనడంలో సందేహం లేదు.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×