Atique Ahmed: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు హంతకులు. హత్యపై సిట్ ఏర్పాటు చేసింది యోగి సర్కారు. అటు, అతీక్ ఆస్తులపై ఈడీ ఆరా తీస్తోంది. వెయ్యి కోట్లకు పైగా అక్రమ సంపాదన ఉంటుందని అంచనా. ఇక బినామీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో.. ఎక్కడెక్కడ ఉన్నాయో అంతుచిక్కడం లేదు. ఈ క్రమంలో అతీక్ అహ్మద్ భూకబ్జాలపై రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే, ఓ ఉదంతం అత్యంత ఆసక్తి రేపుతోంది. అతీక్ ఆక్రమించుకున్నాడంటే ఇక ఆ స్థలంపై ఆశలు వదులుకోవాల్సిందే. లేదంటే ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. కానీ, మంచంపై ఉన్న ఓ వృద్ధురాలు మాత్రం అతీక్కు చుక్కలు చూపించింది. అతీక్ కబ్జా నుంచి తన ఆస్తిని తిరిగి రాబట్టుకుంది. ఆ వృద్ధురాలి బ్యాక్గ్రౌండ్ అలాంటిది మరి. అసలేం జరిగిందంటే…
అది యూపీలోని ప్రయాగ్రాజ్లో ఖరీదైన ప్రాంతం. సిటీలైన్స్ ఏరియాలో ‘ప్యాలెస్ టాకీస్ భవనం’. ఆ పక్కనే ఉన్న స్థలాన్ని ఓ వ్యాపారవేత్త నుంచి బలవంతంగా లాక్కున్నాడు అప్పటి ఎంపీ అతీక్ అహ్మద్. అందులో బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడొప్పుడూ వచ్చి ఆ నిర్మాణ పనులు చూసేవాడు. అయితే, అతీక్కు ఆ పక్కనే ఉన్న ప్యాలెస్ టాకీస్ భవనంపై కన్ను పడింది. ఆ భవనం ఎవరిదో కనుక్కున్నాడు. కాస్త స్మూత్గా కొట్టేయాలని డిసైడ్ అయ్యాడు.
తాను బిల్డింగ్ పనులు చూసేందుకు వచ్చినప్పుడల్లా ఎండలో ఉండాల్సి వస్తోందని.. మీ స్థలంలో కాస్త చోటిస్తే అక్కడి నుంచి బిల్డింగ్ వర్క్ చూసుకుంటానంటూ ప్రపోజల్ పంపాడు అతీక్. ప్యాలెస్ టాకీస్ మేనేజర్ అందుకు నో అన్నాడు. విషయం ఓనర్కి చెప్పాడు. అసలే వాడు గ్యాంగ్స్టర్.. వాడితో మనకెందుకు గొడవ అనుకున్న ఆ ఓనర్.. సరేనంటూ ఉండేందుకు పర్మిషన్ ఇవ్వడంతో అతీక్ పంట పండింది. మొదట ఓ చిన్న గది కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్యాలెస్ టాకీస్ మొత్తం తనదేనంటూ కబ్జా చేశాడు. భవనంకు తాళాలు వేశాడు. ఇలా చాలా స్మూత్గా, ఈజీగా ఆ విలువైన భవనాన్ని కొట్టేశాడు అతీక్ అహ్మద్.
మామూలుగా అయితే ఆ ఓనర్ ఇక తన ఆస్తిని వదులుకోవాల్సిందే. అందులోనూ. ఆ ఓనర్ ఓ వృద్ధురాలు. అప్పటికే ఓ ఆపరేషన్ జరిగి మంచంపై ఉన్నారు. అయినా, ఆమె ఈ విషయాన్ని లైట్ తీసుకోలేదు. అతీక్ సంగతి తేల్చేయాలని డిసైడ్ అయ్యారు. ఆమె ధైర్యానికి కారణం.. ఆమె ఇంటిపేరే. ఇంతకీ ఆ ఓనర్ పేరు ఏంటంటే.. ‘వెర గాంధీ’.
ఇంటిపేరులో గాంధీ ఉందంటే.. ఆమె మామూలు వ్యక్తా?. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్గాంధీకి దగ్గరి బంధువు. అదే ఆమె ధైర్యం. అందులోనూ ఆ సమయంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంకేం.. నేరుగా ఆనాటి యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్కు, లోక్సభ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీకి, యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్కు లేఖలు రాసింది. తన ఆస్తిని ఎంపీ అతీక్ అహ్మద్ కబ్జా చేశాడంటూ.. తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసింది.
కట్ చేస్తే, అత్తగారి తరఫు చుట్టం కావడంతో సోనియా గాంధీ రంగంలోకి దిగారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యతను యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణకు అప్పగించారు. అటు, పీఎంవో కూడా అతీక్పై ప్రెజర్ తీసుకొచ్చింది. ఇక చేసేది లేక.. అతీక్ అహ్మద్ దిగొచ్చాడు. స్వయంగా ‘వెర గాంధీ’ దగ్గరికి వెళ్లి భవనం తాళాలు అప్పగించాడు. అతీక్ వేల సంఖ్యలో కబ్జాలు చేయగా.. అతను ఆక్రమించిన తర్వాత తిరిగి ఇచ్చేసిన ఏకైక ఆస్తి ‘వెర గాంధీ’కి చెందిన ‘ప్యాలెస్ టాకీస్’. వెళ్తూవెళ్తూ ఓ డైలాగ్ కూడా వదిలాడు. “నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి తాళాలు అప్పగించేవాడిని కదా”.