Jyothi Reddy : ఎంతో సానపడితే కానీ వజ్రం మెరవదు.. ఎన్నో కన్నీళ్లు, కష్టాలను అధిగమిస్తే కానీ విజయం వరించదు. బిలియన్ డాలర్ల సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో స్థాయికి ఎదిగిన జ్యోతిరెడ్డి కూడా అంతే. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసింది. వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి, అనాథ శరణాలయంలో పెరిగిన ఆమె.. కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సీఈవో ఉన్నత స్థానానికి చేరింది.
ఆ క్రమంలో ఎన్నో ప్రతికూలతలను ఎదురొడ్డి నిలిచింది. ఆ ప్రతికూలతలనే అవకాశాలుగా మలుచుకుంటూ.. విజయపథంలోకి రివ్వున దూసుకుపోయింది. జ్యోతిరెడ్డి స్వస్థలం వరంగల్. తండ్రి వ్యవసాయ కూలీ. చాలీచాలని సంపాదన. ఐదుగురి సంతానంలో ఒకరిగా జ్యోతి కూడా ఆకలితో నకనకలాడిన రోజులున్నాయి. మంచి జీవితం అందుతుందున్న ఆశతో పదేళ్ల వయసులో జ్యోతిని, ఆమె సోదరిని ఓ అనాథాశ్రమంలో చేర్పించాడు తండ్రి.
ఐదేళ్లు అక్కడే పెరిగిందామె. టెన్త్ క్లాస్ ముగియకముందే.. 16 ఏళ్ల వయసులో ఓ రైతుతో పెళ్లి జరిగింది. రెండేళ్లు తిరిగే సరికి ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. కుటుంబపోషణ కోసం పనులు చేయక తప్పలేదు. పస్తులతో ఉన్న తనలాంటి జీవితం పిల్లలకు ఉండరాదన్న తలంపుతో వ్యవసాయ కూలీగా మారింది. తానూ ఎంతో కొంత సంపాదిస్తే.. వారి తిండికి కొదవ ఉండదనేది జ్యోతి భావన. అప్పట్లో లభించిన రోజుకూలీ ఐదు రూపాయలే. ఇద్దరు బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది చాలదు. ఇంకా ఏం చేయాలా? అనే ఆలోచనలు నిత్యం ఆమెను వెంటాడేవి.
అందుకోసం వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ ఆమె చేజార్చుకోలేదు. ఆ పట్టుదలతోనే ఓపెన్ యూనివర్సిటీ నుంచి 1994లో బీఏ డిగ్రీ పూర్తి చేసింది. తోటి రైతులకు చదువు చెప్పింది. ఆపై ప్రభుత్వ టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించగలిగింది. బిడ్డలను ఉన్నత జీవితాన్ని ఇవ్వాలంటే తాను కష్టపడుతున్నది చాలదనిపించింది జ్యోతికి. కజిన్ సాయంతో అమెరికా వెళ్లాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేసింది.
1997లో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేయడంతో పాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంది. అమెరికా చేరిన తర్వాత బేబీసిట్టర్గా జ్యోతి తొలి కొలువు చేసింది. సేల్స్ గర్ల్, గ్యాస్ స్టేషన్ అటెండెంట్, మోటెల్లో.. ఇలా రకరకాల ఉద్యోగాలు చేసిందామె. చివరగా సాఫ్ట్వేర్ రిక్రూటర్గా స్థిరపడింది. సొంత వ్యాపారం చేపట్టేంత సంపాదించగలిగింది జ్యోతి. 2021లో కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థను ప్రారంభించింది. 100 మంది ఉద్యోగులున్న ఆ కంపెనీ టర్నోవర్ 15 మిలియన్ డాలర్లకు పైనే.
జ్యోతిరెడ్డి ఏటా ఇండియాకు వస్తుంటారు. ఆగస్టు 29న తన పుట్టిన రోజు వేడుకలను వివిధ అనాథ శరణాలయాల్లో అనాథల మధ్యే జరుపుకుంటుండటం ఆనవాయితీ. అంతే కాదు.. 220 మంది మానసిక దివ్యాంగుల బాగోగులను చూస్తుండటం విశేషం. ‘పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు.. మీ తలరాతను మీరే రాసుకోండి..’ ఇదీ మహిళలకు జ్యోతిరెడ్డి ఇచ్చే పిలుపు.