Puri Jagannath Temple: పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భండార్ను 46 ఏళ్ల తర్వాత మళ్లీ తెరవాలని నిర్ణయించారు. గుడి నిర్మాణానికి ఏ సమస్య రాకుండా.. అవసరమైతే రిపేర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ముందుగా వెలుపలి రత్న భండార్ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత లోపలి రత్న భండార్ను ఓపెన్ చేసి నగలను బయటికి తీసుకురావాలి. వాటిని లెక్కించాలి. అదే సమయంలో అవసరమైన రిపేర్లను చేసే పనిని ఏఎస్ఐ చూసుకుంటుంది. రత్న భండార్లోని నిధులకు సర్పాలు కాపలాగా ఉన్నాయని పెద్దలు చెప్పారు. దీంతో పాము ఆటగాళ్లను, వాటి నుంచి కాపాడటానికి ప్రత్యేక బృందాన్ని, వైద్యులను వెంట తీసుకుని టీమ్ ఈ రోజు రత్న భండార్ను తెరిచింది. అయితే, అర్థంతరంగా రత్న భండార్ను మూసేసి వెనుదిరిగింది. దీంతో ఆ టీమ్ ఎందుకు పని పూర్తి చేయకుండా వెనక్కి వచ్చిందనే సందేహాలు వస్తున్నాయి. రత్న భండార్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్రీ పూరీ జగన్నాథ ఆలయ పరిపాలక చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పధీ మీడియాతో మాట్లాడి అన్ని విషయాలను వివరంగా తెలియజేశారు.
ముందుగా అందరు భయపడ్డట్టు రత్న భండార్లో సర్పాలు ఏమీ కనిపించలేవు. ట్రెజరరీ నుంచి మెజిస్ట్రేట్ ద్వారా అందించిన తాళం చెవులతో లోపలి రత్న భండార్ తాళాలు తెరుచుకోలేదు. దీంతో పెద్ద కట్టర్లను తీసుకువచ్చి వాటిని తొలగించారు. ఆ తర్వాత వాటికి కొత్త తాళాలు వేసి కీస్ జిల్లా మెజిస్ట్రేట్కు అందించారు.
‘ఒడిశా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న భండారాన్ని వెలుపలి భాగాన్ని తెరవగలిగాం. అందులోని ఆభరణాలన్నింటిని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లోకి తరలించి భద్రపరిచాం. ఆ తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు వెంటనే సీల్ చేసి మెజిస్ట్రేట్ సహా అందరి సమక్షంలోనే తాళం వేశాం. దీన్నంత కెమెరాల్లో రికార్డ్ చేశాం.’ అని అరబింద పధీ వివరించారు.
‘ఆ తర్వాత లోపలి రత్న భండార్ వైపునకు వెళ్లా. జిల్లా కలెక్టర్ మాకు అందించిన తాళం చెవులతో ఆ మూడు తాళాలను తెరవలేకపోయం. దీంతో మూడు తాళాలను పగులగొట్టి తలుపులు తెరిచాం. ఆ తర్వాత 11 మందితో కూడిన స్పెషల్ కమిటీ లోపలికి వెళ్లింది. ఆభరణాలు వేర్వేరు అల్మారాలు, సిందుకాలలో భద్రపరిచినట్టు గుర్తించారు. అప్పటికే సమయం గడవడం వల్ల వాటిని బయటికి తరలించలేకపోయాం. కాబట్టి, ఇదే రోజు నగలు, ఆభరణాలను తరలించవద్దని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. లోపలి రత్న భండార్ నుంచి ఆభరణాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లోకి ఎప్పుడు తరలించాలన్నది మీటింగ్ పెట్టుకుని నిర్ణయించుకుంటాం. ఈ తరలింపు బహుదా యాత్ర తర్వాతే నిర్వహిస్తాం’ అని పధీ తెలిపారు.
‘అన్ని ఆభరణాలను తాత్కాలిక రత్న భండార్లోకి తరలించిన తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అవసరమైన రిపేర్ రత్న భండార్కు చేపడుతుంది. మరమ్మతు పనులు పూర్తయ్యాక ఆభరణాలను తిరిగి రత్న భండార్లోకి మార్చుతాం. ఆలయ నిర్మాణం సురక్షితంగా ఉంచుకోవడం మా ప్రథమ కర్తవ్యం. రత్న భండార్ మరమ్మతుపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఇదే సమయంలో హైలెవెల్ కమిటీ చైర్మన్ ఈ విలువైన ఆభరణాలు, వస్తువుల లెక్కింపును పర్యవేక్షిస్తారు.’ అని వివరించారు.