Suicides: వార్తా ప్రసార సాధనాల్లో నిత్యం ఆత్మహత్యలకు సంబంధించిన కథనాలు మనం వింటూనే ఉన్నాం. మన చుట్టు పక్కలా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో కంటే ఈ ఆత్మహత్యలు రానురాను పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఆత్మహత్యల సంఖ్యను చూస్తే ఆందోళనకరస్థాయికి పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏప్రిల్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో మన దేశంలో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ప్రతి లక్ష మందికి 12మందికి పైగా(12.4) ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఆత్మహత్యల రేటు ఇదే. ప్రపంచదేశాలతో పోలిస్తే ఎక్కువ ఆత్మహత్యలు మన దేశంలోనే చోటుచేసుకుంటున్నాయి.
ఈ విషాదానికి కారణాలేమిటీ?
ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణంగా డిప్రెషన్ను ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో ఇది జన్యుపరంగా రావొచ్చని, మరికొందరిలో కొన్ని పనులు, బాధ్యతల వల్ల ఒత్తిడికి గురై ఈ స్థితికి చేరవచ్చని వివరిస్తున్నారు. జీవితంలో స్ట్రెస్కు ప్రధానంగా నాలుగు అంశాలకు సంబంధించి ఉంటాయని తెలిపారు. వర్క్, ఆర్థికం, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం ఈ అంశాల చుట్టు ప్రధానంగా ఒత్తిడికి లోనవుతారని చెప్పారు. ఈ కోణాల్లోనే ఒత్తిడి పెరుగుతుందని, అది తీవ్రరూపం దాల్చి యాంగ్జయిటీగా, ఆ తర్వాత డిప్రెషన్గా మారుతుందని, అంతిమంగా అది ఆత్మహత్యకు దారితీసే ముప్పు ఉన్నదని నిపుణులు విశ్లేషించారు.
ఆత్మహత్య చేసుకుంటున్న సుమారు 50 నుంచి 90 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీ, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నవారే ఉంటున్నారని అధ్యయనాలు తెలిపాయి. నేడు భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రజారోగ్య సంక్షోభం ఆత్మహత్యలేనని సైకియాట్రిస్ట్ శ్యామ్ భట్ తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఆత్మహత్యల ధోరణి ఆందోళనకరంగా ఉన్నదని, వెంటనే వీటిపై దృష్టి పెట్టి పరిష్కారాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని మరో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ శాంభవి జైమాన్ వివరించారు. అందుకే ఎవరైనా మానసిక గందరగోళంలో ఉంటే, డిప్రెషన్లో ఉన్నట్టు గమనిస్తే.. వారికి వీలైనంత మేరకు సహాయం చేయాలని, మానసిక నిపుణులను సంప్రదించేలా ప్రోత్సహించాలని సూచించారు.