IAF C-130J Night Landing | కార్గిల్.. ఇక్కడే ఇండియన్ ఆర్మీ ఎందుకు ఫోకస్ చేస్తుంది? అత్యంత ప్రమాదకరమని తెలిసినా ఇంతటీ డేరింగ్ మిషన్ను కార్గిల్లో ఎందుకు చేపట్టింది ఆర్మీ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కార్గిల్ గురించి మనం మరోసారి గుర్తు చేసుకోవాలి? చరిత్రలోకి వెళ్లాలి..
IAF C-130J Night Landing | కార్గిల్.. ఇక్కడే ఇండియన్ ఆర్మీ ఎందుకు ఫోకస్ చేస్తుంది? అత్యంత ప్రమాదకరమని తెలిసినా ఇంతటీ డేరింగ్ మిషన్ను కార్గిల్లో ఎందుకు చేపట్టింది ఆర్మీ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కార్గిల్ గురించి మనం మరోసారి గుర్తు చేసుకోవాలి? చరిత్రలోకి వెళ్లాలి..
కార్గిల్.. 1999లో ఇక్కడ జరిగిన యుద్ధం భారత దేశ చరిత్ర ఉన్నంతవరకు గుర్తుండిపోయే ఘటన. 1999 జూలై 26న పాకిస్తాన్ మూకలను తరిమికొట్టి విజయం సాధించి సగర్వంగా త్రివర్ణ పతకాన్ని ఎగురవేసింది ఇండియన్ ఆర్మీ. అసలు కార్గిల్ యుద్ధం ఎలా ప్రారంభమైందనేది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ముందుగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న పర్వత ప్రాంతాలను క్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించింది.
అయితే 1999 మేలోనే ఈ చర్యకు పాల్పడినట్లు భారత ఆర్మీ గుర్తించింది. అయితే వారు మిలిటెంట్లో లేదా ఉగ్రవాదులో అయి ఉంటారని భావించింది. పాక్ సైన్యం అని ఊహించలేదు. ఇక ఆ తర్వాత కొన్ని వారాలకు పర్వతప్రాంతాన్ని ఆక్రమించింది పాక్ సైన్యమే అని తెలుసుకున్న భారత ఆర్మీ…. వెంటనే వారిని తరిమికొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ సైన్యంను తిరిగి పంపేందుకు ఓ వైపు మిలటరీ చర్యలు మరోవైపు దౌత్యపరమైన చర్యలు ప్రారంభించింది భారత్. పాక్ పాల్పడుతున్న చొరబాటును ప్రపంచ దేశాల దృష్టికి భారత్ తీసుకెళ్లింది. పాకిస్తాన్ను ఒంటరిని చేసి విజయం సాధించింది. జూలై 26,1999లో పాక్ ఆక్రమించిన భారత భూభాగం అంతటిని మన సైన్యం తిరిగి పొందింది.ఇందుకోసం కొన్ని రోజుల పాటు యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో దాదాపు 500 మంది భారత జవాన్లు అమరులయ్యారు.
కానీ కాలం మారింది. ఇప్పుడు కేవలం ఒక్క పాకిస్థాన్ మాత్రమే కాదు.. మనకు పక్కలో బల్లెంలా మారింది చైనా. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. 2017లో సిక్కింలోని డొక్లాం వద్ద మొదట కిరికిరి పెట్టింది. ఆ తర్వాత 2020లో గల్వాన్లో మరో అడుగు ముందుకేసి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. లడఖ్ లోని గల్వాన్ లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు కూడా అమరులయ్యారు.
ముఖ్యంగా జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్తో ఘర్షణలు, అలజడులు పెరిగాయి. భారతదేశానికి ఎప్పుడూ పక్కలో బల్లెం లాగా ఉండే చైనా మరింత దూకుడు పెంచింది. గల్వాన్ ఉదంతం తర్వాత కూడా రెండు, మూడు సార్లు సరిహద్దు ప్రాంతంలో చైనా సైనికుల అలజడి కనిపించింది. లడక్, అరుణాచల్ప్రదేశ్ సరిహద్దులో చైనా మిలిటరీ కొన్ని పర్మినెంట్ నిర్మాణాలు చేపట్టింది. కొన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు వీలైనప్పుడల్లా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది.
ఓ వైపు చర్చల పేరుతో కాలయాపన చేస్తూనే చేయాల్సిందంతా చేసేస్తోంది చైనా. తవాంగ్ ఘర్షణ కంటే ముందు గల్వాన్ దాడుల తర్వాత కమాండర్ స్థాయిలో 16 సార్లు చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చల వల్ల తాత్కాలికంగా సమస్య పరిష్కారమైనా.. శాశ్వత ఉపశమనం మాత్రం దక్కలేదు. అందుకే భారత్ అలర్టైంది. మన దేశం కూడా చైనా సరిహద్దుల్లోమౌలిక సదుపాయాలు పెంచడంతోపాటు సైనికులు సులభంగా చేరేలా రహదారులు, టన్నెల్స్ నిర్మిస్తున్నది. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆర్మీ సదుపాయాలను పెంచుతూ వస్తోంది ఇండియన్ ఆర్మీ.
ఇప్పటికే లద్దాఖ్లోని ఎయిర్స్ట్రిప్ను ఎయిర్బేస్గా అప్గ్రేడ్ చేసింది. భూమికి 13వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్బేస్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎయిర్బేస్. దానికి కాస్త తక్కువ ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్స్ట్రిప్ను కూడా ఇప్పటికే వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసింది.
భారత్, చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య సరిహద్దు రేఖ వద్ద భారత నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే రక్షణశాఖ టార్గెట్గా కనిపిస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. వెంటనే సైన్యాన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లోకి చేర్చేందుకు అనేక ప్రణాళికలు రచించింది. కార్గిల్ ఎయిర్స్ట్రిప్ను వ్యూహాత్మక అవసరాల కోసం వాడనుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అత్యాధునిక రాడార్స్, సర్వేలైన్స్ డ్రోన్లు, యుద్ధ విమానాలు ఇప్పటికే కార్గిల్లో ఏర్పాటయ్యాయి. పగటి వేళల్లో సీ-130జే లాంటి భారీ విమానాలు కూడా ఇప్పటికే తమ ట్రైనింగ్ సెషన్స్ను ముగించాయి. కానీ నైట్ ల్యాండింగ్ను చేయడం మాత్రం ఇదే మొదటిసారి. దీనివల్ల రాత్రి సమయాల్లోనూ భారీగా మిలటరీ ఎక్విప్మెంట్ను కార్గిల్కు తరలించే అవకాశం భారత వాయుసేనకు దక్కినట్లయ్యింది.