ఇది అల్వాల్ చెరువు. 1980లో ఎలా ఉండేది. ఇప్పుడు 2024లో ఎలా అయిందో ఈ శాటిలైట్ మ్యాపే సాక్ష్యం. అప్పట్లో 0.480 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే ఇప్పుడు అది కాస్తా 0.104 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. అంటే 78 శాతం కుచించుకుపోయింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇటీవల జరిపిన స్టడీలో తేలిన విషయమిది. ఇలా ఓ 50 చెరువులపై వాళ్లు స్టడీ చేస్తే అన్ని చెరువులదీ ఇదే దుస్థితి. సహజ ఆవాసాలైన ఇలాంటి చెరువులు ఇలా కబ్జాకోరల్లో చిక్కుకుపోతే చివరికి అది మనిషి మనుగడకే ముప్పు. ఇది ఎవరూ గుర్తించట్లేదు. ప్రకృతిలో అన్నీ ఉండాలి. అన్ని వృక్ష, జంతుజాతులను ఉండనివ్వాలి. అప్పుడే మనిషికి మనుగడ. లేకపోతే నగరాలు ఎంత విస్తరించి.. ఎంత ఉపాధి పెరిగితే ఏం లాభం? కాలుష్యం, వ్యాధులు ఇవి పెరిగితే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ హైడ్రా ఇప్పుడు భారీ మాస్టర్ ప్లాన్ ను ముందేసుకుంది. 3 దశల్లో చర్యలకు రెడీ అవుతోంది. ఇప్పుడు పరిధిపై ఫోకస్ పెట్టినా త్వరలోనే రాష్ట్రమంతా విస్తరించే ప్లాన్ నడుస్తోంది. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇలా అన్ని జోన్లలో చెరువులను చెరపట్టిన వారి భరతం పడుతోంది. అక్రమాలు అని తేలితే చాలు బుల్డోజర్ నేరుగా వెళ్తోంది. ఎక్కడికక్కడ కూల్చి పడేస్తున్నారు. డే అండ్ నైట్ ఈ కూల్చివేతలను కొనసాగుతున్నాయి. అడ్డొచ్చిన వారిని పక్కన పెట్టేస్తున్నారు. పొలిటికల్ ప్రెజర్ వచ్చినా పట్టించుకోవడం లేదు. కొందరైతే ఇదో సూపర్ పవర్ గా మారిందని, అధికారాలన్నీ వారికే కట్టబెడితే ఎలా అని ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా ఉంటున్నారు. అయినా సరే డోంట్ కేర్ అంటోంది హైడ్రా.
సమాజంలో తెలివి మీరిన వారు కొందరు ఉంటారు. చెరువులను ఈజీగా కబ్జా చేసేస్తారు. ఏమారుస్తారు. పక్క సర్వేనెంబర్లు వేసి పేపర్లు సృష్టిస్తారు. దీంతో చెరువు భూములు కాదని అనుమతులు తెస్తారు. ఇండ్లు కడుతారు. అమ్మేస్తారు. సైడైపోతారు. అంతే కొనుక్కున్న వారు బుక్కవుతారు. వీటిని చూసీ చూడనట్లు ఉండడం వల్లే ఇప్పుడు చెరువులకు ఈ దుస్థితి వచ్చింది. పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ ఉండడం వల్లే ఇలా జరుగుతోంది. కానీ ఇప్పుడు హైడ్రా ముందు ఎవరి ఆటలు సాగడం లేదు. ఎన్ని ఫోన్లు చేసినా కూల్చివేతలు ఆపడం లేదు. ఫోన్లు పక్కన పెట్టేస్తున్నారు.
Also Read: హైదరాబాద్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. రాజధానిగా మారనుందా?
హైడ్రా ఆధ్వర్యంలో మూడు ఫేజ్ లలో చర్యలు ఉండబోతున్నాయి. ఫేజ్–1లో భాగంగా కొత్తగా ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూడనున్నారు. అంటే కొత్తగా ఏ చెరువు దగ్గర కూడా కబ్జాల ఆనవాళ్లు లేకుండా చేస్తారు. ఫేజ్ 2 లో భాగంగా చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే కట్టిన ఇండ్లు, ఇతర నిర్మాణాల అనుమతులు రద్దు చేసి కూల్చేస్తారు. అంటే ఇందులో రెండు రకాలుగా ఉంటుంది. కేవలం నోటరీ పేపర్ రాసుకుని కట్టుకున్నవి ఉంటాయి. సో వాటికి ముగింపు పలకనున్నారు. ఇక ఫేజ్–3 లో భాగంగా బెంగళూరు తరహాలో చెరువుల్లో పూడికతీసి పూర్వవైభవం తీసుకొస్తారు. అంటే హైదరాబాద్ కు మళ్లీ జలకళ రాబోతుందన్న మాట.
హైడ్రా చేస్తున్న ఈ మహా యజ్ఞంలో ప్రజలు చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు. హైడ్రా చర్యలను సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగా పరోక్షంగా స్వాగతిస్తున్నారు. చెరువులను రక్షించుకోవాల్సిందే అన్న బలమైన అభిప్రాయంతో ఉన్నారు. సో ఇది హైడ్రాకు బూస్టప్ గా మారింది. ఏ పనికైనా ప్రజల మద్దతు తోడైతే అనుకున్నది సాధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అందుకే హైదరాబాద్ కు జలకళ వచ్చేదాకా హైడ్రా చర్యలు ఉండబోతున్నాయి. నిజానికి చెరువులు ఉండడం వల్ల సిటీ వాతావరణం చల్లగా ఉంటుంది. అర్బన్ ఫ్లడింగ్ లేకుండా చెరువులు కాపాడుతాయి. కానీ వర్షం పడితే ఆ నీళ్లు ఎటెళ్లాలో తెలియదు.
సహజ ప్రవాహాలన్నీ కుచించుకుపోయి కాంక్రీట్ అరణ్యంగా మారింది. అవి ఎటూ సరిపోవు. దీంతో రోడ్లు, కాలనీలు, ఇండ్లలోకే వరద నీరు వెళ్తోంది. హైదరాబాద్ లో 2020లో వచ్చిన వరదలే ఇందుకు నిదర్శనం. ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్న తేడా లేకుండా చెరువుల దగ్గరున్న కాలనీలన్నీ మునిగిపోయాయి. ఇకపై అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు వద్దు అన్న గట్టి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. గత పాలకులు కళ్లుమూసుకున్నా.. ఇప్పుడు మాత్రం అలాంటి నిర్లక్ష్యాలకు చోటు లేకుండా హైడ్రా అన్న వ్యవస్థనే సీఎం రేవంత్ తీసుకొచ్చారు. దీనికి నిధులు, వనరులు, సిబ్బందిని సమకూర్చారు. రంగనాథ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో జరగాల్సింది చెరువుల ప్రక్షాళనే.