Budget :- 2023-24 కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ పై సామాన్యుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేంద్రం భారీగా వరాలు కురిపిస్తుందని ఆశగా ఎదురుచూసున్నారు. వేతన జీవుల పన్ను స్లాబులు మారతాయన్న ఆశతో ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం..
బడ్జెట్ ప్రవేశపెట్టింది వీరే..!
స్వతంత్ర భారత తొలి బడ్జెట్ను 1947 నవంబర్ 26న అప్పటి ఆర్థికమంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.
బడ్జెట్ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్. ఆయన 1962-69 మధ్య 10 సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1964, 1968 లీపు సంవత్సరాల్లో ఆయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్ను సమర్పించడం విశేషం. ఆ తర్వాత పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఐదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ప్రధాని పదవిలో ఉండి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా నిలిచారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిలిచారు. బడ్జెట్ బ్రీఫ్ కేస్ స్థానంలో సాంప్రదాయ బహీ-ఖాతాలో బడ్జెట్ను తీసుకొచ్చారు.
సంస్కరణలు..
1999 వరకు బడ్జెట్ను ఫిబ్రవరి చివరి వర్కింగ్ డేన సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఆర్థికశాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా స్వస్తి చెప్పారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రారంభించారు. బడ్జెట్ను 2016 వరకు ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సమర్పించేవారు. 2017 నుంచి అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1కి మార్చారు. బడ్జెట్కు ముందు ఆనవాయితీగా హల్వా వేడుకను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటికే ఈ వేడుక నిర్వహించారు. గతేడాది కొవిడ్ కారణంగా ఈ వేడుకను నిర్వహించలేదు. మిఠాయిలు పంచారు.
విశేషాలెన్నో..
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 1977లో నాటి ఆర్థికమంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ సమర్పించిన బడ్జెట్ అతిచిన్నది. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో 800 పదాలు మాత్రమే ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగం రెండు గంటల 42 నిమిషాలపాటు సాగింది. అత్యధిక సమయం సాగిన బడ్జెట్ ప్రసంగం ఇదే.
ముద్రణ ఎక్కడంటే..
1950లో కేంద్ర బడ్జెట్ లీక్ అయ్యింది. దీంతో అప్పటి వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించే బడ్జెట్ను ఢిల్లీలోని మింట్రోడ్కు మార్చారు. 1980లో నార్త్బ్లాక్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి అక్కడే ముద్రించడం మొదలు పెట్టారు. 1995 వరకు బడ్జెట్ను ఆంగ్ల భాషలో మాత్రమే ప్రచురించేవారు. ఆ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ, ఆంగ్లం భాషల్లో బడ్జెట్ ప్రతులను సిద్ధం చేయించింది. 2021 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి సారిగా పేపర్లెస్ బడ్జెట్ను సమర్పించారు. కరోనా సమయంలో ఈ- బడ్జెట్ను తీసుకొచ్చారు. 2017కు ముందు వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. 2017లో సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ విలీనం చేశారు.