Sengol : భారత్కు స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో అధికార మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడంపై చర్చ జరిగింది. ఎలాంటి సాంస్కృతిక విధానాన్ని అనుసరించాలని బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ నెహ్రూతో సమాలోచనలు చేశారు. ఈ క్రమంలో రాజగోపాలాచారికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత అధికార మార్పిడి కోసం రాజదండం అంటే సెంగోల్ తయారీకి తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనాన్ని సంప్రదించారు.
రాజదండం తయారీలో సహకరించేందుకు మఠాధిపతులు అంగీకరించారు. మద్రాస్లోని స్వర్ణకారుడితో రాజదండం చేయించారు. వెండితో చేసి బంగారు పూత పూశారు. దీని పొడవు 5 అడుగులు .పై భాగంలో న్యాయానికి ప్రతీకగా నంది చిహ్నాన్ని అమర్చారు. తిరువడుత్తురై మఠానికి చెందిన ఒక స్వామీజీ ఆ దండాన్ని 1947 ఆగస్టు 14 రాత్రి మొదట మౌంట్బాటన్కు అందించి తర్వాత తిరిగి వెనక్కి తీసుకున్నారట. అనంతరం గంగాజలంతో శుద్ధిచేశారని చెబుతారు. నెహ్రూ వద్దకు ఊరేగింపుగా రాజదండాన్ని తీసుకెళ్లారు. అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్ర ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నెహ్రూకి అందజేశారని అంటారు. ఆ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారు.
సెంగోల్ శబ్దం తమిళంలోని సెమ్మై నుంచి వచ్చింది. 8వ శతాబ్దంలో చోళుల కాలంనాటి నుంచి రాజదండం చేతుల మారడం ద్వారా అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. సెంగోల్ ఎవరు అందుకుంటారో వారి నుంచి న్యాయ, నిష్పాక్షిక పాలనను ప్రజలు ఆశిస్తారు. స్వాతంత్య్ర ప్రకటన సమయంలో సెంగోల్ స్వీకరణ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రచురించింది. టైమ్ మేగజైన్ తోపాటు, పలు దేశాల్లో పత్రికలు కథనాలు ప్రచురించాయి.
1947 ఆగస్టు తర్వాత సెంగోల్ అందరి కళ్ల నుంచి మాయమైంది. స్వాతంత్య్రానంతరం 31 ఏళ్ల తర్వాత 1978 ఆగస్టు 15న కంచి మఠాధిపతి చంద్రశేఖర్ సరస్వతి స్వామి తన అనుచరుడు డాక్టర్ బీఆర్ సుబ్రహ్మణ్యంకు సెంగోల్ గురించి చెప్పారు. ఆ విషయాన్ని సుబ్రహ్మణ్యం తన పుస్తకంలో ప్రస్తావించారు. తమిళ మీడియా కూడా దాని గురించి ప్రముఖంగా ప్రచురించింది.
Leave a Comment