– బంగాళాఖాతంలో వాయుగుండం
– ఆంధ్రాలో కుంభవృష్టి వానలు
– తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్
– రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
– పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
– రెండు రోజులు ఇదే పరిస్థితి
– కొన్ని ఏరియాల్లో క్లౌడ్ బరస్ట్కు ఛాన్స్
– వరద నీటిలో నాగర్ కర్నూల్ కలెక్టరేట్
– మల్లెపల్లి వాగులో కొట్టుకుపోయిన కారు
– మహబూబ్నగర్లో నీటమునిగిన ప్రాంతాలు
– జల దిగ్బంధంలో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి
– ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద
– వర్షాల నేపథ్యంలో కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్య్సకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. వాయుగుండం కళింగపట్నం, విశాఖపట్నం, గోపాల్ పూర్ తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉంది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న జిల్లాలు
నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో తెలంగాణలో 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఎదురు గాలులు వీచే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అలాగే, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ప్రభుత్వం అప్రమత్తం
రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలను గుర్తుచేశారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. లోతట్టు, వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా నిఘా పెట్టాలని సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద ఓ స్పెషల్ ఆఫీసర్ను నియమించి పర్యవేక్షించేలా చూడాలన్నారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ సూచించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుండి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఇటు, భారీ వర్షాల నేపథ్యంలోని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమీషనర్ కార్యాలయాలు, ఎస్పీలను అలర్ట్ చేశామన్నారు డీజీపీ జితేందర్.
Also Read: Hyderabad Rains: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీలకు రెండు రోజులు సెలవు
మహబూబ్నగర్లో కుండపోత
భారీ వర్షాలతో మహబూబ్నగర్ జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జడ్చర్ల ప్రభుత్వ హాస్పటల్ జల దిగ్భందంలో చిక్కుకుంది. భారీ వర్షానికి హాస్పిటల్ ప్రాంగణం నీట మునిగింది. ప్రధాన ద్వారం దగ్గర వదర నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. దేవరకద్రలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్నే, ముత్యాలపల్లి, పేరూరు, గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చిన్న చింతకుంట మండలం బండర్ పల్లి గ్రామం సమీపంలోని ఊక చెట్టువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వైపు వెళ్లొదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వాగులో చిక్కుకున్న కారు
నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలో వాగులు, వంకలు భయంకరంగా పొంగి పొర్లుతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జడ్చర్ల దుందుభి వాగు ప్రవహిస్తోంది. మక్తల్ దగ్గర వాగులో ఓ కారు చిక్కుకుంది. సోమేశ్వర బండ నుంచి మక్తల్ వెళ్తుండగా ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించి కారులోని వారిని బయటకు దింపి కారును ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రమాదం తప్పింది. నారాయణపేట జిల్లాలో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్కూరు మండలం మల్లెపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
నిలిచిపోయిన రాకపోకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆలపల్లి మండలాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలోని ఏడు మెలికల వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. జిల్లా అధికారులందరూ సమైక్యంగా పనిచేసి ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు.
Also Read: Harish Rao: ఇదేం ప్రభుత్వం?.. అటు చదువు లేదు.. ఇటు భోజనం లేదు
చెరువుల్ని తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పురపాలక పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షం వచ్చిన ప్రతిసారి మురుగు నీటితో కలిసి వర్షపు నీరు ఇండ్లలోకి చేరి ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. తిరుమలగిరి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు తిరుమలగిరి మోత్కూర్ రోడ్డు పూర్తిగా నిండి చెరువుని తలపిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హుజూర్ నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి, పాలకీడు, నేరేడుచర్ల మండల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రాజెక్టులకు వరద
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 3 లక్షల 30వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 3 లక్షల 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగంబండ రిజర్వాయర్లో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు అధికారులు. వర్షాలు, వరదలు భారీగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, సంగంబండ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇతర ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.