Global Water Cycle: మానవ చరిత్రలో మొదటిసారిగా వాటర్ సైకిల్ బ్యాలెన్స్ ఆగిపోయింది. అవును భూమి పుట్టిన తర్వాత ఇలాంటి దారుణమైన పరిస్థితి ఇదే మొదటిసారి. ఈ ప్రభావం భారత్, చైనా, యూరప్లపైనే తీవ్రంగా ఉండబోతోందని ఓ నివేదిక వెల్లడించింది. “గ్లోబల్ కమీషన్ ఆన్ ది ఎకనామిక్స్ ఆఫ్ వాటర్”(Global Commission on the Economics of Water) రిపోర్టు సంచలన నిజాన్ని బయటపెట్టింది. రాబోయే కాలంలో తాగడానికి నీటి చుక్క కూడా మిగలదని హెచ్చరించింది. ఈ పరిస్థితి ఎందుకొస్తోంది..?
నీటి వనరుల కొరత వల్లే మూడో ప్రపంచ యుద్ధం
ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధాలను చూస్తున్నాం. ఈ యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని చాలా మంది భయపడుతున్నారు. అయితే, ఈ యుద్ధాల కంటే తీవ్రమైన సమస్య ఒకటి మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందని కొన్నేళ్లుగా కొందరు నిపుణులు, కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రాబోయే మూడో ప్రపంచ యుద్ధం వాతావరణ మార్పుల ప్రభావంతో ఏర్పడుతున్న నీటి వనరుల కొరత వల్ల జరగవచ్చని అంటున్నారు. నీటి కొరత, కరిగిపోతున్న హిమానీనదాలు, క్షీణించిన జలాశయాలు, నీటి కాలుష్యం, ఆనకట్టలు, నీటిపై వివాదాలు వంటివి ప్రపంచంలో నీటి సంఘర్షణకు దారితీస్తాయని కొన్ని సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి. అయితే, ఇవి ఊహల్లో నుండి వచ్చిన అభిప్రాయాలు కాదు.
నిర్థారించిన జాయింట్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం
ఈ నీటి కొరత తీవ్రమైన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందనే సిద్ధాంతానికి యూరోపియన్ కమీషన్కు చెందిన జాయింట్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం కూడా మద్దతు ఇచ్చింది. వాతావరణ మార్పు, నీటి వనరుల కొరత సామాజిక అశాంతికి, ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని అధ్యయనం పేర్కొంది. ప్రపంచ నీటి సంక్షోభం అదుపు తప్పకుండా నిరోధించడానికి, నీటిని సమంగా పంచుకోవడానికి, నీటిని స్థిరంగా నిర్వహించడానికి బలమైన అంతర్జాతీయ యంత్రాంగాలు అవసరమని సూచించింది. అయితే, ఈ సూచనలు పాటించకముందే నీరు నిండుకుపోతుందని తాజాగా ఓ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. సమయం దాటి పోయాము. నీటి చక్రం ఆగిపోయిందంటూ భయంకరమైన నిజాన్ని వెల్లడించింది.
మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా నీటి చక్రం ఆగింది
“మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా” హైడ్రోలాజికల్ సైకిల్ సమతుల్యత లేకుండా పోయిందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ నీటి విపత్తుకు చేరువలో ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా, భారత్, చైనా, యూరప్లోని కొన్ని ప్రాంతాలు ఇందులో తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ దేశాలు అధిక జనాభా, వ్యవసాయ సాంద్రత కలిగిన ప్రాంతాలు కాబట్టి, ఇక్కడ నీటి సంక్షోభం మరింత దారుణంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. గ్లోబల్ కమీషన్ ఆన్ ది ఎకనామిక్స్ ఆఫ్ వాటర్(Global Water Cycl).. అక్టోబర్ 16న ప్రచురించిన నివేదికలో ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల ఆర్థిక విధానాలు, చాలా ముఖ్యమైన మంచినీటి వనరులను విస్మరించాయని నివేదిక వెలుగులోకి తెచ్చింది. మన నేలలు, వృక్షసంపదలో నిల్వ చేయబడే “గ్రీన్ వాటర్” తీవ్రంగా ఒత్తిడి గురౌతుందనీ.. దీని వల్ల, ప్రపంచ నీటి చక్రం ఆగిపోతుందని నివేదిక పేర్కొంది.
Also Read: చలికాలానికి ముందే గజ గజ వణుకుతున్న ఢిల్లీ.. కారణం ఇదేనా?
గ్రీన్ వాటర్ ఫుట్ ప్రింట్కు ప్రధాన ఆధారం…
గ్రీన్ వాటర్ అనేది మట్టిలో నిల్వ చేయబడిన నీరు. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడటానికి అందుబాటులో ఉంటుంది. ఇది ఆహారం, ఫైబర్, కలప, బయోఎనర్జీ, ఫీడ్ను ఉత్పత్తి చేయడానికి నీటికి ప్రాథమిక వనరుగా ఉంటుంది. అలాంటి, నీరు ఇప్పుడు మట్టానికి ఆవిరిపోతుందని నివేదికలో వెల్లడించారు. మల్చింగ్, కాంటౌర్ క్రాపింగ్, నేల, నీటి సంరక్షణ, ప్రవాహాన్ని నియంత్రించడం, భూగర్భజలాల పునరుద్ధరణను ప్రోత్సహించడం వంటివి గ్రీన్ వాటర్నినిర్వహించే విధానాలు. ఇక, ఈ గ్రీన్ వాటర్ ప్రవాహాం గ్రీన్ వాటర్ ఫుట్ప్రింట్ అంటారు. ఈ గ్రీన్ వాటర్ ఫుట్ ప్రింట్కు ప్రధాన ఆధారాన్ని గమనిస్తే.. 58% పంట ఉత్పత్తి, 30% పశువుల మేత, 9% కలప ద్వారా ఉత్పత్తి అవుతుంటే.. 3% పట్టణ ప్రాంతాలతో వస్తుంది.
సరస్సులు, నదులు, జలాశయాల ద్వారా “బ్లూ వాటర్”
ఇక, మరో రకం నీరు “బ్లూ వాటర్”, అంటే సరస్సులు, నదులు, జలాశయాలు, రిజర్వాయర్లు నుండి వచ్చే నీరు. ఇది త్రాగడానికి తగినంత శుభ్రంగా ఉంటుంది. గృహా అవసరాలకు, వ్యాపారాల్లో ఉపయోగించవచ్చు. ఇంకొకటి, “గ్రే వాటర్”. ఇది ఉపయోగించిన నీరు. ఇది మలినాలతో నిండి ఉంటుంది. చేతులు కడుక్కోవడం, కూరగాయలు శుభ్రం చేయడం, పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా వస్తుంది. గ్రీన్ వాటర్ అనేది బ్లూ వాటర్, గ్రే వాటర్ కంటే భిన్నంగా ఉంటుంది. అయితే, రాను రానూ మనుషులు గ్రీన్ వాటర్ని విపరీతంగా నాశనం చేస్తూ.. బ్లూ వాటర్ని తీవ్రంగా కాలుష్యానికి గురిచేస్తూ.. సహజంగా వచ్చే నీటిని గ్రే వాటర్లా మారుస్తున్నారని పరిశోధకులు వాపోయారు. దీని వల్ల, జీవనానికి ఉపయోగపడే నీరు తగ్గిపోయి, నిరుపయోగమైన నీరు భూమిని మరింత విషపూరితంగా మారుస్తుందని పేర్కొన్నారు.
పంటలు పండే ప్రాంతాల్లో క్షీణిస్తున్న నీరు
ఇక, ఈ నీటి చక్రాలు ఇప్పుడు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, నీటి వనరులను ప్రపంచ ఉమ్మడి ప్రయోజనంగా మార్చాలని, తాజా నివేదిక ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఇలా నీటి చక్రంలో ఏర్పడే ఒత్తిడి వల్ల అధిక జన సాంద్రత ఉన్న ప్రాంతాల నుండి అధిక స్థాయి నీటిపారుదల ఉన్న ప్రాంతాల వరకు.. భూమి ఉపరితలంపైన, దిగువన నిల్వ చేయబడిన మొత్తం నీరు అస్థిరంగా ఉందని పరిశోధకులు తెలియజేశారు. అధిక జనాభా, ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమైన ప్రాంతాలు, పంటలు పండే ప్రాంతాల్లో నీరు క్షీణిస్తోంది అని నివేదిక చెబుతోంది. దీని వల్ల, వాయువ్య భారతదేశం, ఈశాన్య చైనా, దక్షిణ-తూర్పు ఐరోపా వంటి అధిక జనాభా సాంద్రత ఉన్న హాట్స్పాట్లు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరు?..అసలు, టాటా విల్లులో ఏముంది…?
అటవీ నిర్మూలన వల్ల మరింత ఎక్కువ ప్రభావం
ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచ జనాభాలో 10% మంది అత్యంత పేదలు.. తమ వార్షిక వర్షపాతంలో 70% పైగా భూమి ఆధారిత వనరులపై ఆధారపడుతున్నారు. అటవీ నిర్మూలన వల్ల మరింత ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. దీనికి తోడు, నీటిపారుదల ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా తరచుగా నీటి నిల్వలో గణనీయమైన క్షీణతను చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ క్షీణత రేటు రెండింతలు వేగంగా, ఎక్కువగా ఉంటుంది. ఈ పోకడలు ఇలాగే కొనసాగడం వల్ల, నీటి నిల్వ భారీగా తగ్గిపోయింది. ఇది నీటిపారుదలని అసాధ్యం చేస్తోంది. దీని వల్ల, ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో 23% తగ్గుదలకు దారితీయవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటికి సంబంధించిన కొత్త ఆర్థిక వనరులు అవసరం
ఇక, ప్రపంచవ్యాప్తంగా నీటి నిర్వహణ, దశాబ్ధాలుగా ఈ పరిస్థితిని తక్కువగా అంచనా వేసినట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచానికి అత్యంత అవసరమైన ఈ నీటికి సంబంధించిన కొత్త ఆర్థిక వనరులు అవసరమని పిలుపునిచ్చింది. ముందుగా, నీటి ప్రవాహ చక్రం ప్రపంచానికి సాధారణ ప్రయోజనంగా గుర్తించాలని సూచిందిం. మనం చూసే నీరు, వాతావరణ తేమ ప్రవాహం రెండూ ప్రపంచ దేశాలు, ప్రాంతాలను కలుపుతుందని అర్థం చేసుకోవాలని అన్నారు. అలాగే, నీటి చక్రం అనేది వాతావరణ మార్పులతో లోతుగా అనుసంధానించబడి ఉందనీ.. ఇది దెబ్బతింటే జీవవైవిధ్యం కోల్పోతామని హెచ్చరించారు. వాస్తవంగా, ఇది అన్ని రకాలకుగా మనిషి జీవితంపై ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది. అందుకే, రోజువారీ జీవితంలో నీటి అవసరాలను గుర్తించాలనీ… తగినంత నీరు మాత్రమే వాడాలని సూచించారు. అలా చేయడం వల్ల సహజంగా ఏర్పడే నీటి శాతం పెరిగి, అది భూమిని సుభిక్షంగా ఉంచుతుందని తెలిపారు.