Expenses: దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వేతన జీవుల పొదుపు గణనీయంగా తగ్గుతోంది. పేరుకు ఎంత వేతనం వస్తున్నా నెలాఖరుకి ఖర్చులకు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అలాగని వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటూ పొతే రిటైర్మెంట్ తర్వాత ఇబ్బందులు తప్పవు. కనుక వేతన జీవులంతా వాస్తవిక దృక్పథంతో ఆలోచించి పొదుపు చేసుకోగలిగితే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఇదీ పద్దతి..!
ముందుగా నెలకు మొత్తం ఎంత ఖర్చు ఉంది? వీటిలో అవసరాలు, సౌకర్యాలు, విలాసాలకు సంబంధించిన ఖర్చులేమిటో అంచనా వేసుకోవాలి. వీటికి తోడు భవిష్యత్ బాధ్యతలు ఏమున్నాయి? అనేదీ ఆలోచించాలి. ఆ తర్వాత మీకు చేతికొచ్చే వేతనం ఎంత? దీనిలో దేనికెంత ఖర్చు పెట్టాలో నిర్ణయించుకోవాలి.
50-20-20-10 సూత్రం..
వేతన జీవుల కోసం ఆర్థిక నిపుణులు ‘50-20-20-10’ పేరుతో ఒక సరికొత్త సూత్రాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఆదాయంలో మీ గృహావసరాల కోసం 50 శాతం వినియోగించాలి. తర్వాత 20 శాతం స్వల్ప, మధ్యకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టాలి. మరో 20 శాతం పదవీ విరమణ తర్వాతి అవసరాలు, బాధ్యతలకు కేటాయించాలి. చివరగా ఆ మిగిలిన 10 శాతం మొత్తాన్ని మీ ఇష్టానికి వాడుకోవచ్చు.
ఆచరణ ముఖ్యం
పొదుపును వీలున్నంత చిన్న వయసులో మొదలుపెట్టాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. ఒక పథకంలో పొదుపు చేయటం మొదలుపెట్టాక మీ వ్యక్తిగత ఖర్చులు మానుకొనైనా సరే దానిని కొనసాగించాలి. పొదుపు సొమ్మునంతా ఒకే పథకంలో కాకుండా కొంత భూమి మీద, కొంత బంగారంపై, కొంత నష్ట భయం లేని ప్రభుత్వ పథకాల్లో, కొంచెం స్టాక్స్లో పెట్టుకోవచ్చు. దీనివల్ల ఒక పెట్టుబడిలో నష్టం వచ్చినా మిగతావి ఆదుకుంటాయి.