SeetaRama: రాజా రవి వర్మ భారతదేశ గొప్ప చిత్రకారుడు. రామాయణం,మహాభారతం లాంటి పురాణ ఇతిహాసాలను పండితులు చదువుతూ ఆ సన్నివేశాలను తలుచుకుంటూ దేవుళ్లు ,దేవతల రూపాలను ఊహించుకునేవారు.
వాస్తవానికి శివుడు, రాముడు, ఆంజనేయుడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు.కానీ రాజా రవి వర్మ పురాణ ఇతిహాస గ్రంథాల్లోని దేవతామూర్తుల రూపాలను ఊహించుకొని ,సృజనాత్మకంగా ఆలోచించి తన ఊహకు కుంచె ద్వారా ప్రాణం పోశారు. అలా ఆయన ఊహల్లో నుంచి గీసిన చిత్రాలే మనం నిత్యం పూజించే దేవుళ్లు, దేవతల చిత్ర పటాలు.
కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో రెండు ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో క్రియేట్ చేసిన శ్రీరాముడు, సీత ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి. దీంతో అన్ని సోషల్ మీడియా వేదికలపై ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 21 ఏళ్ల వయసులో ఉన్న యవ్వన రాముడిని రూపం చూసి భక్తులు మురిసిపోయారు. సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేశారు.
వాల్మికీ రామాయణంతో సహా రాముడికి సంబంధించి ఏ గ్రంథం తీసుకున్నాఅందులో రాముడి వర్ణన ఆజానుబాహుడు, నీల మేఘ శ్యాముడు అనే ఉంటుంది.నీల మేఘ శ్యాముడు అంటే నలుపు లేద నీలం రంగు వర్ణంలో ఉండేవాడని అర్థం. కానీ ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలో రాముడు పసిడి ఛాయతో మెరిసిపోతున్నాడు.
వాల్మికీ రామాయణం ప్రకారం రాముడి ఎత్తు 9 అడుగులు. అరణ్యకాండలో హనుమంతుడు లంకలో సీతాదేవిని కలిసిన సమయంలో రాముడి ఎలా ఉంటాడో కళ్లకు కట్టినట్లు వర్ణించాడు.హనుమంతుడు చెప్పిన దాని ప్రకారం రాముడు విశాలమైన భుజాలు, పొడవైన చేతులు,శంఖం లాంటి కంఠం,కాంతితో వెలిగిపోయే ముఖం,గంభీరమైన స్వరం,నిగనిగలాడే చర్మంతో మేఘశ్యామవర్ణంలో ఉంటాడు. కొనదేలిన ముక్కు, విశాలమైన కళ్లు, బలమైన పాదాలు, నల్లగా నిగనిగలాడే జుట్టుతో రామచంద్రమూర్తి ఉంటాడు.
ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫొటోలో రాముడు.. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన సుకుమారుడిగా ఉన్నాడు. కష్టం తెలయని రాకుమారుడిలా ఉన్నాడు. కానీ వాల్మికీ రామాయణం ప్రకారం.. రాముడు.. వివాహానికి ముందే యుద్ధం చేసి రాక్షసులను సంహరించాడు.ఆయన శరీరం ఓ యోధుడి మాదిరిగా ఉంటుంది.21 ఏళ్లు అంటే యువరాజుగా పట్టాభిషేకానికి సిద్ధమయ్యే వయస్సు కాబట్టి రాముడు అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరిపోయాడు. యోధుడిగా మారాడు. ఏఐ టెక్నాలజీ మాత్రం బాల్య ఛాయలు పోని పసివాడిగా రాముడిని చూపించింది. మన పురాణాలు వర్ణంచిన రాముడి రూపానికి ఇది సరిపోలలేదనే చాలా మంది అంటున్నారు. ఇదే విషయాన్ని పండితులు చెబుతున్నారు.