మాటకు ముందు నమో వెంకటేశాయ. మాటకు తర్వాత శ్రీనివాసుని స్మరించుకునే వ్యక్తి చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఏకంగా శ్రీనివాసునికి తన సొంత ఉర్లో అతిపెద్ద దేవాలయం నిర్మింపచేసి.. పూజాదికాలతో అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. ఆ ఆలయ నిర్మాణానికి విరాళాల పేరుతో భారీగా నిధులు సేకరించారనే ఆరోపణలున్నాయి. మరో వైపు తాడేపల్లి ప్యాలెస్ వద్ద జగన్ కోసం ఏకంగా తిరుమల సెట్ వేయించి హిందు ధార్మిక సంస్థల విమర్శలు మూటగట్టుకున్న చరిత్ర ఆయనది.
రాష్ట్ర రాజకీయాల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు చాలా డిపరెంట్.. వైసీపీ అవిర్భావం నుంచి ఏదో ఓక వివాదంలో వార్తలలోకి ఎక్కుతూ.. చంద్రగిరిలో వైసీపీ జెండాను ఎగరేయగలిగారు. వరుసగా రెండుసార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన చెవిరెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా తన స్థానంలో కుమారుడుని బరిలోకి దింపితే ఇక్కడ కూడా పరాజయమే మిగిలింది. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాల్లో అసలు కనిపించడమే మానేశారు.
ఎన్నికల ముందు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పై జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు బెంగళూరు నుండి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. దాంతో కొడుకుని అరెస్ట్ చేస్తారన్న భయంతో పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చుని ధర్నా చేసి హడావుడి చేశారు. తర్వాత ర్యాలీ చేపట్టి తప్పు చేయకుండా అక్రమ కేసులు పెట్టారని నానా రచ్చ చేశారు. అయితే పోలీసులు ఆ కేసులో మోహిత్ రెడ్డికి 41 నోటీసు మాత్రమే ఇచ్చి పంపారు. అప్పట్లో చెవిరెడ్డి చేసిందంతా పబ్లిసిటీ స్టంట్ అని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని.. అధికారంలో ఉన్నప్పుడు తనకు సహకరించిన అధికారులను కాపాడడానికి చెవిరెడ్డి డ్రామాలాడుతున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగిరి దొంగ ఓట్ల కేసులో అధికారులు అందరూ సస్పెండ్ అవుతారని హెచ్చరికలు జారీ చేశారు.
ఆ ఎపిసోడ్ తర్వాత చెవిరెడ్డి పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ పూర్తిగా డిఫెన్స్లో పడినట్లు కనిపిస్తుంది. జగన్ సహా పార్టీ కీలక నేతలంతా ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చి తమను తాము డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదే జిల్లాలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాత్రం నోరెత్తడం లేదు. అంతకు ముందే ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. తర్వాత పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిధున్రెడ్డిపై పుంగనూరు పర్యటన సందర్భంగా దాడి ప్రయత్నం జరిగింది. ఆ ఇష్యూలపై చెవిరెడ్డి అసలు రియాక్ట్ కాలేదు.
Also Read: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?
విజయవాడ వరదల పై పార్టీ నేతలు అందరూ పెద్ద ఎత్తున స్పందించినా చెవిరెడ్డి మాత్రం సైలెంట్ మోడ్ లోనే ఉండిపోయారు. అసలు అలాంటివి జరిగినట్టుగా కూడా తెలియనట్టు ఆయన వ్యవహరించడంపై జిల్లా పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇన్ని జరుగుతున్నా చెవిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఇటు సొంత పార్టీ నేతల్లోనే కాకుండా అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. తాజాగా తిరుమల లడ్డు వివాదం రాజుకుంటుండటంతో అందరి చూపు చెవిరెడ్డిపై పడుతోంది.
చెవిరెడ్డికి అమితమైన భక్తి ఉందనేది అందరికీ తెలిసిన విషయమే అలాంటిది తిరుమల లడ్డు వ్యవహారం ఇంత వివాదం అవుతున్నా పట్టించుకోకుండా ఉండడం వైసీపీలోనే హాట్టాపిక్గా మారింది. అధినేతపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకునే నేతల్లో ముందుండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. లడ్డు వివాదంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ.. కూటమి నేతలంతా జగన్ను టార్గెట్ చేస్తున్నా స్పందించకపోవడం వైసీపీ నేతలకే అంతుపట్టడం లేదంట.
అటు జగన్తో పాటు టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైతం కూటమి నేతలకు టార్గెట్ అవుతున్నారు. చెవిరెడ్డికి భూమన రాజకీయ గురువు అన్న పేరుంది.. అలాంటి భువన కరుణాకరరెడ్డి చుట్టూ వివాదం నడుస్తున్నా చెవిరెడ్డి నోరెత్తడం లేదు. ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చెవిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత స్దానిక సంస్దల ఎన్నికల సమయంలో ఇంటింటికి వేలాది తిరుమల లడ్డూలను చెవిరెడ్డి పంచారని సామాన్య భక్తులకు ఒకటి దొరకడమే గగనంగా ఉండే కళ్యాణోత్సవం లడ్డూను నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ పంచారని అంతలా స్వామివారిని రాజకీయం కోసం చెవిరెడ్డి వాడుకున్నారంటూ ఘాటుగా విమర్శించారు. అయినా చెవిరెడ్డి రియాక్ట్ అవ్వలేదు.
రెండు సార్లు టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా పనిచేసినా చెవిరెడ్డి స్వామిపై భక్తితో తన ఇంటి వద్దె వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మింపచేసి.. తిరుమల తరహాలోనే ఎటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాంటాయన లడ్డు వివాదంపై మాట్లాడక పోతుండటం ఆయన అనుచరవర్గానికే మింగుడు పడటం లేదంట. త ఐదేళ్లలో చెవిరెడ్డి సైతం తిరుమల కేంద్రంగా అక్రమాలకు పాల్పడ్డారని అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని భయంతోనే మాట్లాడకుండా ఉంటున్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.
దానికి తోడు చెవిరెడ్డి తన స్వగ్రామంలోని తుమ్మలగుంట చెరువులో ఎన్జిటి నిబంధనలు అతిక్రమించి మరీ చెరువును పూడ్చి.. క్రీ డా మైదానం ఏర్పాటు చేశారు. దానికి తుడా నిధులు 60 కోట్లు వ్యవయం చేసారని అంటున్నారు. దీనిపై విచారణకు పులివర్తి నాని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చెవిరెడ్డికి అన్ని విధాల సహకరించిన తిరుపతి అర్డీఓ అయిన నిషాంత్ రెడ్డి ప్రస్తుతం లంచం కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ అధికారి దొంగ ఓట్లపై విచారణలో సిఐడికి సహాకరించడం లేదనే విమర్శులున్నాయి.
తుడా చైర్మన్గా వ్యవహరించిన చెవిరెడ్డికి టీటీడీ పాలకమండలిలో సైతం సభ్యత్వం ఉండటంతో.. కొండపై నిధుల దుర్వినియోగంలో కూడా పాత్ర ఉందంటున్నారు. ప్రస్తుతం దానిపై కూడా కూడా విచారణలు జరగుతున్నాయి. మొత్తం ఈ వ్యవహారాలతో తన భాగోతాలన్నీ ఎక్కడ బయటపడతాయనే భయంతోనే చెవిరెడ్డి మౌనదీక్షలోకి వెళ్లిపోయారంటున్నారు. మరి చెవిరెడ్డి ఎప్పుడు సైలెన్స్ బ్రేక్ చేస్తారో? ఆయన ఫ్యచర్ ఎలా ఉండబోతుందో? చూడాలి.