బాపట్ల జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత వ్యవహారం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఏపిలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీలో ఆమె బెర్త్ సంపాదిస్తుందని టాక్ ఉంది. ఇన్నాళ్లు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆమె.. పదవికి, వైసీపీకి రాజీనామా చేసి జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. రాజీనామా లేఖను అసెంబ్లీ జనరల్ సెక్రటరీకి పంపారు. వ్యక్తికారణాల దృష్ట్యా వైసీపీని వీడుతున్నట్లు కేంద్ర వైసీపీ కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డికి అందజేశారు. నిన్నా మొన్నటి వరకు వైఎస్ జగన్ ను దేవుడు లెవెల్లో ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన ఆమె.. అనూహ్యంగా పార్టీని వీడడం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీత భవిష్యత్తు కార్యాచరణ హట్ టాపిక్ గా మారింది.
ఏపిలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీలో పోతుల సునీత బెర్త్ సంపాదిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టింది టీడీపీ నుంచే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సునీతకు చీరాల నుంచి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అక్కడ నవోదయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దీంతో అక్కడ వారి ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అప్పటి వరకు టీడీపీలో అధికారం తిప్పిన పోతుల సునీత వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరిగింది. అందుకు అనుగుణం గానే.. ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్ విషయంలో సునీత టీడీపీకి ఆమె షాకిచ్చారు. టీడీపీ విప్ కు వ్యతిరేకంగా పోతుల సునీత ఓటు వేసి.. వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన సునీతపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ కు అప్పట్లో టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది. కానీ తన పదవికి రాజీనామా చేసి సునీత ట్విస్ట్ ఇచ్చారు. 2020 జనవరి 22న టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
2019 తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం వైసీపీలో చేరడంతో.. చీరాల నియోజకవర్గంలో మూడు ముక్కలాటగా పంచాయితీ మారింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృషమోహన్ పర్చూరు వైసీపీ ఇంఛార్జ్గా నియమించగా.. పోతుల సునీతకు ఎమ్మెల్సీగా కల్పించారు. దీంతో ఆమె మూడో సారి ఎమ్మెల్సీ కొనసాగుతున్న క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆమె పదవికాలం 2029 వరకు ఉన్నప్పటికీ అనూహ్యంగా రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read: పిఠాపురం ఆడపడుచుల కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడో తెలుసా?
గత ఐదేళ్లలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఎమ్మెల్సీగా చక్రం తిప్పిన సునీత.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ లపై అనేక సార్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ మహిళ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ నెల 23న పోతుల సునీతను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా.. పక్కనపెట్టి.. మరో ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని అధ్యక్షురాలిగా నియమించారు. ఆ విషయంలో సునీత బాగా హర్ట్ అయ్యారని.. అందుకే రాజీనామా చేశారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునీత టీడీపీలో చేరతారని.. ఆమె రాజీనామాతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని బీటెక్ రవికి ఇస్తారనే చర్చ మొదలైంది.
మరోవైపు పోతుల సునీత ఎపిసోడ్ టీడీపీలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఆమెను పార్టీలోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష సునీత వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఆమెను పార్టీలోకి తీసుకోవద్దని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. టీడీపీ పార్టీ పెద్దలకు మనవి. దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు, అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్లని అవమానించినట్టే అంటూ ట్వీట్ చేశారు.
అటు వైసీపీలో మరో మహిళా నేత, ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఈ మధ్య రాజకీయపరంగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మార్చేయడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ గా మార్చుకున్నారు. అంతే కాకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్ను అన్ఫాలో చేశారు. జగన్తో ఉన్న ఫొటోను కూడా డిలీట్ చేశారు. దీంతో ఏదో జరగబోతోందని అంతా అనుకున్న టైంలో జగన్, భారతి పెళ్లి రోజు సందర్భంగా విషెస్ చెప్పడంతో ఊహాగానాలకు తెరపడింది. అయితే రోజా మాత్రం పార్టీ కార్యకలపాలకు పూర్తి దూరంగా ఉండడం అనుమానాలను రేకెత్తిస్తోంది. గత ఐదేళ్లలో నోటికి వచ్చినట్టు ఇష్టారాజ్యంగా విమర్శలు చేసి.. ఇప్పుడు నైతిక విలువ లేకుండా ఎలా పార్టీ లోకి వస్తారని టీడీపీ శ్రేణులు సైతం విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల్లో సునీత భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.