Jumping Japan Politics : గోపి’. గోడ మీద పిల్లి. ఛాన్స్ దొరికితే ఎటువైపు అయినా గోడ దూకుతారు. మునుగోడు ఎలక్షన్ తో రాజకీయ గోపీల గోల మరింత పెరిగింది. నియోజకవర్గంలో చిన్నాచితక నేతలు రోజుకో పార్టీ మారుతున్నారు. ఉదయం ఓ పార్టీ కండువా కప్పుకుంటే.. అదే నేత సాయంత్రానికల్లా మళ్లీ మరో పార్టీలో చేరిపోతున్నారు. ఎటు మారినా ముట్టాల్సింది ముడుతోందని అంటున్నారు. చోటామోటా లీడర్లతో రావాల్సినంత ప్రమోషన్ రావట్లేదనుకున్నారో ఏమో.. పెద్ద నేతలకు గాలం వేస్తున్నాయి పెద్ద పార్టీలు.
ఇటీవలే మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ కారు దిగి కాషాయం కప్పుకోవడంతో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. వెళ్తూ వెళ్తూ అధికార పార్టీపై, కేసీఆర్ నియంత్రుత్వంపై.. బూర పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బీసీలంతా బీజేపీ వైపే అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లడంతో గులాబీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. కౌంటర్ పాలిటిక్స్ లో భాగంగా, లేటెస్ట్ గా బీజేపీ నుంచి ఓ బిగ్ ఫిష్ బయటకు రావడం ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కమలం పార్టీని వీడటం సంచలనం. కొంతకాలంగా నేతలంతా బీజేపీకి క్యూ కడుతుంటే.. ఈయనేమో బీజేపీకి రాజీనామా చేయడం.. పార్టీలో బీసీలకు సరైన గుర్తింపు లేదంటూ కామెంట్లు చేయడం ఆసక్తికరం. భిక్షమయ్య గౌడ్ వెనుక టీఆర్ఎస్ ఉందని.. త్వరలోనే ఆయన మళ్లీ కారు ఎక్కుతారని టాక్.
బూర నర్సయ్య గౌడ్ చేసిన డ్యామేజ్ ను కవర్ చేసుకునేలా కేసీఆర్ వేగంగా పావులు కదిపారని తెలుస్తోంది. బూర పార్టీని వీడిన వెంటనే.. అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీపీ పల్లె రవికుమార్ గౌడ్, కళ్యాణి దంపతులకు కేటీఆర్ గులాబీ కండువా కప్పేసి.. గౌడ వర్గం తమవెంటే ఉందనేలా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, పల్లె రవి మండల స్థాయి నేత మాత్రమే కావడంతో పెద్దగా మైలేజ్ రాలేదు. దీంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తో బీజేపీకి రాజీనామా చేయించి.. కమలదళాన్ని డిఫెన్స్ లో పడేలా చేశారని అంటున్నారు. మునుగోడులో గెలుపు ఓటములు ప్రభావితం చేసే సత్తా ఉన్న గౌడ సామాజిక వర్గం కేంద్రంగా జరుగుతున్న జంపింగ్ జపాంగ్ రాజకీయం రంజుగా సాగుతోంది.