Parliament : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలా సాగుతాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎందుకంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. బడ్జెట్ ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు ఏడాది మోదీ ప్రభుత్వం సామాన్యులకు వరాలు కురిపిస్తుందనే అంచనాలున్నాయి.
అటు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, ఆప్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి కేంద్రంతో యుద్ధానికి సిద్ధమయ్యాయి. అలాగే కాంగ్రెస్ సహా మిగతా విపక్ష పార్టీలు కేంద్రంపై పోరాటానికి పార్లమెంట్ సమావేశాలే సరైన వేదికగా భావిస్తున్నాయి. మరి విపక్షాలకు మోదీ సర్కార్ చెక్ పెడుతుందా ? ఈ సమావేశాలు సాఫీగా సాగుతాయా? కేంద్రం వ్యూహమేంటి? విపక్షాల ప్రతివ్యూహమేంటి? అనే ఆసక్తి నెలకొంది.
చైనా చొరబాట్లు, అదానీ వ్యవహారం , మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ కుల గణన, ధరల పెరుగుదల, నిరుద్యోగం అంశాలపై చర్చించాలని అభిపక్ష భేటీలో వివిధ పార్టీలు కోరాయి. నిబంధనల ప్రకారం ఏ అంశంపైనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని BJD డిమాండ్ చేసింది. రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై చర్చించాలని టీఎంసీ, బీఆర్ఎస్ , డీఎంకే కోరాయి. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని వైసీపీ కోరింది. చైనా చొరబాట్ల అంశం దేశభద్రతకు సంబంధించింది కాబట్టి ఈ అంశంపై చర్చ చేపట్టలేమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి ప్రతిపక్షాలు కోరిన ఇతర ముఖ్యఅంశాలపై పార్లమెంట్ లో చర్చ జరుగుతుందా? విపక్షాల దూకుడును కేంద్రం అడ్డుకోగలదా? చూడాలి.
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ తొలివిడత సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ సమావేశాలు తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెడతారు. గురువారం నుంచి ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. దీనిపై ప్రధాని మోదీ మాట్లాడతారు. ఆ తర్వాత బడ్జెట్పై చర్చ చేపడతారు. ఈ చర్చలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు.
బడ్జెట్ లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపులపై స్థాయీసంఘాలు అధ్యయనం జరుపుతాయి. ఆ తర్వాత నివేదికలు సమర్పిస్తాయి. ఇందుకోసం పార్లమెంట్ సమావేశాలకు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు విరామం ఇస్తారు. రెండో విడత సమావేశాల్లో శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు, ఆర్థికబిల్లుపై చర్చిస్తారు. మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారు.