MLC Kavitha: మాజీ సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఐదు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ల ద్విసభ్య ధర్మాసనం కల్వకుంట్ల కవితకు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. జైలులో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవిత ట్రయల్ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు మొదలు.. సుప్రీంకోర్టు వరకు ఎన్నోసార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఒక ఏజెన్సీ తర్వాత మరో ఏజెన్సీ అన్నట్టుగా విచారణ సాగింది. ఈడీ, సీబీఐలు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమెపై పలుమార్లు ప్రశ్నలు కురిపించారు. చాలా కష్టంగా గడిపిన ఈ 166 రోజుల్లో కవిత అనారోగ్యంపాలయ్యారు కూడా. రెండు సార్లు ఢిల్లీలోని హాస్పిటళ్లకు తీసుకెళ్లారు.
హైదరాబాద్లోని కవిత నివాసంలో మార్చి 15న ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆమె తిహార్ జైలులో ఉన్నారు. ఆమె జైలుకు వెళ్లేటప్పుడూ కొన్ని ఆరోగ్య సమస్యలతోనే ఉన్నారు. తనకు హైపర్టెన్షన్ ఉన్నదని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించేటప్పుడు వెల్లడించారు. జైలులోకి ఆమె వెంట కొన్ని మాత్రలను అనుమతించినట్టు జైలు అధికారులు తెలిపారు. తొలి రోజు ఆమె జైలులో అందరికీ వడ్డించే పప్పు భోజనం వడ్డించారు. తనకు ఇంటి భోజనం కావాలని, జపమాల, పుస్తకాలు, పెన్, పేపర్లు, ఇంటి దుప్పటి కావాలని కోర్టులో పిటిషన్ వేయగా అనుమతి లభించింది. తిహార్ జైలులో మహళలకు ఉండే ప్రత్యేకమైన సెల్ నెంబర్ 6లో ఆమె ఉన్నారు.
తిహార్ జైలులో ఆమె పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. రెండు సార్లు మాత్రం హాస్పిటల్కు తీసుకెళ్లే స్థాయిలో అనారోగ్యంపాలయ్యారు. గత నెల 16వ తేదీన ఆమెను ఢిల్లీలోని ప్రఖ్యాత దీన్ దయాల్ హాస్పిటల్ తరలించారు. హై ఫీవర్, గొంతు నొప్పి, గైనకాలజికల్ సమస్యతో ఆమె బాధపడ్డారు. దీంతో ఆహెను దీన్ దయాల్ హాస్పిటల్ తరలించారు. అక్కడ టెస్టులు నిర్వహించి సుమారు రెండు గంటల్లోనే తిరిగి తిహార్ జైలుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత మెడిసిన్ వాడటంతో ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది.
Also Read: N Convention Centre: లేకులను కేకుల్లా తినేశారు.. చివరికి ఆ నగరానికి ఏమైందో తెలుసా.. నాగార్జున గారు!
మళ్లీ ఈ నెలలోనూ ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు వైరల్ ఫీవర్, గైనకాలజికల్ సమస్యలతో బాధపడుతుండగా.. జైలు వైద్యులు చికిత్స అందించారు. కానీ, అక్కడ ఫీవర్ తగ్గకపోవడంతో జైలు అధికారులు ఎయిమ్స్ తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. ఈ నెల 22వ తేదీన ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ఎయిమ్స్లో చికిత్స తర్వాత తిరిగి తిహార్ జైలుకు తరలించారు. గతేడాది నవంబర్ నెలలో ఆమె ఓ రోడ్ షోలో స్పృహ కోల్పోయి పడిపోయిన సంగతి తెలిసిందే.
అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లడానికి ముందు చేసిన వైద్య పరీక్షల్లో లో బ్లడ్ ప్రెషర్ (లోబీపీ) ఉన్నట్టు తేలింది. అయితే, కొంత సమయం తర్వాత నార్మల్ అయ్యాక జైలుకు తీసుకెళ్లారు. ఇలా అనారోగ్యంతోనే ఆమె జైలులో ఎక్కువగా గడిపినట్టు తెలుస్తున్నది. ఈ ఐదు నెలల జైలు జీవిత కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుమారు పది కిలోల బరువు తగ్గినట్టు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆమెకు ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో తిరిగి జైలు నుంచి బయటకు రానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఫ్లైట్ టికెట్ బుక్ చేసినట్టు తెలుస్తున్నది. ఆమె నేరుగా హైదరాబాద్లో నందినగర్లోని ఆమె నివాసానికి రాత్రికల్లా చేరే అవకాశం ఉన్నది.