BRS Leaders to join Congress: తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టుతో సతమతమవుతున్న పార్టీకి ఇప్పుడు వలసలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరగా, శనివారం ఉదయం గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ చేతుల మీదగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా, ఆదివారం మరికొందరు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
నేపథ్యం ఇదీ..
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు. వ్యాపార రంగంలో ఉంటూ, టీడీపీలో చేరి 2009లో గద్వాల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో బీఆర్ఎస్ టికెట్ సాధించి అదే స్థానంలో డీకే అరుణపై ఓటమి పాలైనా, 2018 ముందస్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి రెండవసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సరితకు సీఎం హామీ
కాగా, కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరటాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరితా తిరపతయ్య, ఆమె అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద నిరసన కూడా తెలిపారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి, మారుతున్న రాజకీయ పరిస్థితిలో అధిష్ఠానం సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, పార్టీ పరంగా తగిన గుర్తింపునిస్తామని ఆమెకు నచ్చజెప్పడంతో ఆమె అంగీకరించారు.
నేడు మరో నలుగురి చేరిక?
బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో చేరుతున్న వేళ.. మరో వార్త ఆ పార్టీని కలవరపెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగిందని, ఈ క్రమంలో నగర పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారనే వార్తలు గులాబీ పార్టీ అధిష్ఠానాన్ని కుదేలు చేస్తున్నాయి. వీరంతా ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని, అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వీరంతా నేరుగా సీఎం చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే వార్తలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
బుజ్జగింపులకు నో రెస్పాన్స్..
ఎమ్మెల్యేల వలసలను నివారించేందుకు గులాబీ బాస్ వారితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారి నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేదని, దీనిపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తులనూ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి భవిష్యత్ లేదని వారంతా ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో వారిని ఇక ఆపి లాభం లేదనే నిర్ణయానికి గులాబీ పార్టీ అధిష్ఠానం వచ్చినట్లు తెలుస్తోంది. తన కళ్లముందే శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ విలీనం జరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో బీఆర్ఎస్ అధినేత పడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.