Bhagavan Ramana Maharshi : ఆధ్యాత్మికత విషయంలో మనదేశం ప్రపంచానికే తలమానికం. ఇక్కడ జన్మించిన ఎందరో మునులు, రుషులు తమ ఆధ్యాత్మిక సాధనతో జీవన్ముక్తిని పొందటమే గాక.. భవిష్యత్ తరాల సాధకులకు దీపస్తంభాలుగా నిలిచారు. అలాంటివారిలో భగవాన్ రమణ మహర్షి ఒకరు. మౌనంతోనూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందటం సాధ్యమని నిరూపించిన అరుదైన యోగిపుంగవులు రమణులు. నేడు ఆయన అవతరించిన రోజు.
రమణులు చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. ఈ సృష్టిలో కంటికి కనిపించేదంతా పరమాత్మ స్వరూపమేననీ, తోటి మనుషులతో బాటు నోరు లేని మూగజీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడని రమణులు బోధించేవారు. ‘నీలో ఉన్నదే ఆ జీవుల్లోనూ ఉంది గనుక.. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో, అన్నిటినీ అలాగే ప్రేమించాలి. పూజించాలి’ అని చెప్పేవారు.
ఒకసారి ఆశ్రమ వంటశాలలో అరటిపూలతో కూర వండుతున్నారు. ఈ క్రమంలో అరటిపువ్వు పైభాగంలోని దొప్పలను తీసి పారేసేవారు. ఒకరోజు రమణులు.. గోశాల వద్ద ఆ దొప్పలను బుట్టలతో బయటపారేయటాన్ని గమనించి.. వీటిలోనూ పోషకాలుంటాయని సిబ్బందికి చెప్పి, ఆ దొప్పలను స్వయంగా తరిగి, ఇంగువ, ఎండు మిరపకాయల వంటి దినుసులతో రుచికరమైన వంటకాన్ని తయారుచేశారు. ఇకపై వీటిని వృధా చేయకుండా వండి, భక్తులకు వడ్డించమని సూచించారు. రమణుల మాటకు సరేనన్న వంటవాళ్లు.. ఆ దొప్పలతో కూర వండేవారు.
అయితే కొన్నాళ్లకు మహర్షి గిరి ప్రదక్షిణ చేసి వస్తూండగా, దూరంగా ఓ చోట అప్పుడే పూడ్చిన ఓ గుంట కనిపించి, కర్రతో దానిని కదిలించారు. దీంతో ఆ గుంత నుంచి అరటి దొప్పలు బయటపడ్డాయి. వాటిని వండే ఓపిక లేక, తాను చూస్తే బాధపడతానని వంటవాళ్లు ఇలా కప్పిపెట్టారని రమణులు అర్థం చేసుకున్నారు. ‘అయ్యో! మీరు వండకపోతే.. ఓ బుట్టలో తీసుకుపోయి పశువులకు వేసినా అవి తినేవి కదా’ అని చిన్నగా అనుకుంటూ ముందుకు సాగిపోయారు. అంతే! ఆ తర్వాత ఆయన ఎప్పుడూ వంటశాలలో అరటి దొప్పల మాటెత్తలేదు. రమణులు ఏదైనా ఒక్కసారే చెప్పేవారు. అవతలివారు ఆ మాటను ఆచరించకపోతే.. వదిలేసేవారు గానీ బలవంతపెట్టి చేయించే అలవాటు వారికి లేదు. ‘చెప్పటమే మన వంతు, వినటం, విని ఆచరణలో పెట్టటం ఎదుటివారి పని’ అనేదే రమణుల ఆంతర్యం!