Latest Viral News : మొన్న హైదరాబాద్ లో బాబుని కరిచి చంపిన కుక్క.. నిన్న చెన్నైలో పాపని కుమ్మేసిన ఆవు.. ఇవాళ తిరుమల నడక మార్గంలో చిన్నారిని చంపేసిన చిరుతపులి. మూడు ఘటనలు తల్లిదండ్రులకి తీరని విషాదం మిగిల్చాయి. రెండు ఘటనల్లో స్పష్టంగా నిర్లక్ష్యం.. ఒక ఘటనలో ఊహించని పరిణామం.
తిరుమల నడక మార్గం, చిరుతల దాడి కొత్తేమీ కాదు. కొద్దిరోజుల క్రితం కూడా చిరుత.. బాబుపై చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తూ బాబు బతికాడు. మళ్లీ అదే మెట్ల మార్గంలో మరోసారి చిరుత దాడిలో చిన్నారి చనిపోయింది. ఇక్కడ TTDని పూర్తిగా తప్పు పట్టలేం. ఎందుకంటే ఇరవై నాలుగు గంటలపాటు నడక మార్గంలో వచ్చే భక్తులందరికీ భద్రత కల్పించడం అసాధ్యం. కానీ రీసెంట్గా బాలుడి ఘటన తర్వాత ఒక చిరుతను బోనులో బంధించిన అధికారులు దాన్ని దూరంగా వదిలి పెట్టారు. నడకమార్గం, దిగువ, ఎగువ ఘాట్ రోడ్డు పరిసరాల్లో ఆరు చిరుతలు ఉన్నట్టు టీటీడీ ఫారెస్ట్ శాఖ గతంలో ప్రకటించింది. ఆ తర్వాత సంతానం పెరిగిందో లేదో సమాచారం లేదు. అయితే చిరుత మూమెంట్ ఎక్కువగా ఉన్న చోట భక్తులను విడివిడిగా కాకుండా గుంపులుగా పంపితే అవి ఎటాక్ చేయవు. కేవలం సింగిల్గా ఉంటేనే చిరుతలు దాడి చేస్తాయి. ఇప్పుడు జరిగిన రెండు ఘటనల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో గుంపులుగా కాకుండా విడిగా వస్తున్నప్పుడు జరిగాయి.
పెద్దపులి మనిషిపై దాడి చేసి మాంసం తింటాయి. కానీ చిరుతలు మనిషిని చంపి తినే గుణం తక్కువ. చిరుతలు సాధారణంగా పిరికివి అని చెబుతుంటారు. అవి మనుషులు గుంపులుగా ఉంటే ఆ దరిదాపుల్లోకి రావు. అలాంటిది తాజాగా చనిపోయిన చిన్నారి ఒంటిపై గాయాలు చూస్తుంటే దారుణంగా ఉన్నాయి. చిరుత గాయపర్చిన తీరు భయంకరంగా ఉంది.
ఇక చెన్నైలో స్కూల్కి వెళ్తున్న పాప ఆవు దాడిలో తీవ్రంగా గాయపడింది. అమ్మతో పాటు రోడ్డుపక్కన నడుస్తున్న పాపపై ఆవు కొమ్ములతో విరుచుకుపడింది. సహజంగా సాధు జంతువైన ఆవు.. ఇలా మనిషిపై దాడి చేయడం అరుదు. అప్పుడప్పుడు ఎద్దులు, ఆంబోతులు దాడులు చేస్తాయి. కానీ ఆవులు ఎప్పుడు దాడులు చేయవు. అలాంటిది సాధారణ ఆవు ఈ రకంగా దాడి చేయడం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం.
చెన్నై అయినా హైదరాబాద్ అయినా సరే.. వేలాది ఆవులు రోడ్లపై సంచరిస్తూ ఉంటాయి. వాటి యజమానులు అవుల్ని ఇలా వదిలేసి పాలు ఇచ్చే సమయానికి తీసుకెళ్తున్నారు. మార్కెట్ ఏరియాల్లో ఆవులు ఎక్కువగా కనిపిస్తాయి. కూరగాయలు తేవడానికి వెళ్లే వారు ఇకపై ఆవును చూస్తే వణికిపోయే పరిస్థితి వచ్చింది.
ఇక హైదరాబాద్ లో కుక్కల దాడులు ఘటనలు కామన్గా మారిపోయాయి. ఎక్కడో చోట పిల్లలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు.. మరికొన్ని చోట్ల తీవ్రంగా గాయపడుతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు కనిపించిన ప్రతి కుక్కని పట్టేస్తూ హడావిడి చేస్తారు. నిజానికి కుక్కలు అన్నింటినీ నగరాల నుంచి పంపించడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే సమాజంలో బతికే హక్కు వాటికి ఉందని బ్లూ క్రాస్ లాంటి సంస్థలు పోరాటం చేస్తుంటాయి.
అక్కడ ఆవు.. ఇక్కడ కుక్క .. మరోచోట చిరుత ఇలా జంతువులు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కొన్నిసార్లు ఆహారం దొరకని సందర్భంలో జంతువులు ఈ మాదిరి దాడులు చేస్తాయి. కుక్కలు సహజంగా వేసవి కాలంలో ఎక్కువగా దాడి చేస్తాయి.
మనం ఉండే చోటికి జంతువులు వచ్చి దాడులు చేస్తున్నాయా లేక అవి ఉండే చోటుని మనుషులు అక్రమించారా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే తిరుమల క్షేత్రం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం.. అలాంటి చోట అడవి జంతువులు ఉండటం సహజం. అవి ఉండే చోట మనం సంచరిస్తున్నాం. పొలాల్లో లేదా ఇళ్ళల్లో కట్టే యాల్సిన ఆవుల్ని రోడ్లమీద ఇష్టారాజ్యంగా వదిలేయడం తప్పు.. దీన్ని కచ్చితంగా నియంత్రించాలి. ఇక వీధి కుక్కల సంఖ్య విచ్చల విడిగా పెరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వాలదే.