Atal Bihar Vajpayee Love Story | భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు చాలా భిన్నమైనవి. అటల్ బిహారీ వాజ్పేయీ కూడా ఈ కోవలోకే వస్తారు. ఆయన జీవితంలో రాజ్కుమారి కౌల్కు ప్రత్యేక స్థానముంది. గ్వాలియర్ లోని విక్టోరియా కాలేజీ (ప్రస్తుతం మహారాణి లక్ష్మీబాయి కాలేజీ)లో చదువుకునేటప్పుడు రాజ్కుమారి హక్షర్ కౌల్ పట్ల వాజ్పేయీ ఆకర్షితులయ్యారు.
Atal Bihari Vajpayee Love Story | భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు చాలా భిన్నమైనవి. అటల్ బిహారీ వాజ్పేయీ కూడా ఈ కోవలోకే వస్తారు. ఆయన జీవితంలో రాజ్కుమారి కౌల్కు ప్రత్యేక స్థానముంది. గ్వాలియర్ లోని విక్టోరియా కాలేజీ (ప్రస్తుతం మహారాణి లక్ష్మీబాయి కాలేజీ)లో చదువుకునేటప్పుడు రాజ్కుమారి హక్షర్ కౌల్ పట్ల వాజ్పేయీ ఆకర్షితులయ్యారు. అమె అసలు పేరు రాజ్కుమారి హక్షర్. కౌల్ అనేది ఆమె భర్త ఇంటి పేరు.
ఇటీవల ప్రచురితమైన వాజ్పేయీ జీవితచరిత్ర ‘‘అటల్ బిహారీ వాజ్పేయీ’’ పుస్తకంలో ప్రముఖ జర్నలిస్టు సాగరికా ఘోష్ ఈ విషయాలను రాసుకొచ్చారు. ‘‘అప్పట్లో ఆ కాలేజీలో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉండేవారు. వారిలో కౌల్ చాలా అందంగా ఉండేవారు. ఆమెను వాజ్పేయీ అమితంగా ఇష్టపడేవారు. కౌల్కు కూడా ఆయన అంటే చాలా ఇష్టం’’అని పుస్తకంలో రాశారు.
‘‘మొదట కౌల్ సోదరుడు చంద్ హక్షర్తో వాజ్పేయీకి పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే కౌల్ను ఆయన కలుసుకున్నారు. కానీ పెళ్లి విషయంలో కౌల్ కుటుంబం వాజ్పేయీని అంగీకరించలేదు. కౌల్ తల్లిదండ్రులు.. దిల్లీలోని రామ్జస్ కాలేజీలో ఫిలాసఫీ బోధించే బ్రజ్ నారాయణ్తో ఆమె వివాహం చేశారు.’’
వాజ్పేయీతో తనకున్న అనుంబంధాన్ని కౌల్ కూడా బహిరంగంగానే అంగీకరించేవారు. ఈ విషయాన్ని వాజ్పేయీ మరో జీవితచరిత్ర ‘‘అటల్ బిహారీ వాజ్పేయీ: ద మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్’’లో కింగ్షుక్ నాగ్ వివరించారు. ‘‘లైబ్రరీ పుస్తకంలో ప్రేమ లేఖను పెట్టి కౌల్కు వాజ్పేయీ ఇచ్చారు. కానీ ఆయనకు ఎలాంటి సమాధానం రాలేదు. నిజానికి కౌల్ దీనికి అంగీకారం తెలుపుతూ ప్రత్యుత్తరం ఇచ్చారు. కానీ, ఆ లేఖ వాజ్పేయీకి చేరలేదు.’’
ఎంపీగా దిల్లీకి వచ్చిన తర్వాత మళ్లీ కౌల్ను కలవడం వాజ్పేయీ మొదలుపెట్టారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న హర్దీప్ సింగ్ పూరీకి బ్రజ్ నారాయణ్ కౌల్ మార్గదర్శిగా ఉండేవారు. బ్రజ్ నారాయణ్ ఇంట్లోనే వాజ్పేయీని హర్దీప్ సింగ్ పూరి తొలిసారి కలుసుకున్నారు. 1980ల్లో సావి మ్యాగజైన్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాజ్పేయీకి తనకు మధ్య మంచి అనుబంధముందని రాజ్కుమారి కౌల్ అంగీకరించారు. ఆ బంధాన్ని కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరని ఆమె చెప్పారు.
‘‘వాజ్పేయీతో నా అనుబంధం గురించి నా భర్తకు వివరణ ఇవ్వాల్సిన సమయం ఎప్పుడూ రాలేదు. నిజానికి వాజ్పేయీకి నాతోపాటు నా భర్తతోనూ మంచి అనుబంధముంది’’అని ఆ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. ‘‘వారి మధ్య అనుబంధాన్ని ప్రేమ అని పిలవాలా లేదా స్నేహం అని పిలవాలా నాకు తెలియదు. నిజానికి దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు’’అని వాజ్పేయీ ఆప్త మిత్రుడు అప్పా ఘటాటే.. సాగరికా ఘోష్తో చెప్పారు. ‘వారి సంబంధాన్ని ప్రపంచం వింతగా చూడొచ్చు. దాన్ని మనం స్నేహానికి మరో మెట్టుగా చెప్పుకోవచ్చు. అది గ్వాలియర్లో చదువుకుంటున్నప్పుడే మొదలైంది.’’
భర్తతో కలిసి వాజ్పేయీ ఇంటికి
వాజ్పేయీకి దిల్లీలోని పెద్ద ప్రభుత్వ వసతి గృహం కేటాయించినప్పుడు, కుమార్తెలు, భర్తతోపాటు కౌల్ ఆ ఇంటికి వెళ్లిపోయారు. వీరందరికీ అక్కడ విడివిడిగా బెడ్రూమ్లు ఉండేవి. ‘‘వాజ్పేయీకి అత్యంత ఆప్తుల్లో బల్బీర్ పుంజ్ ఒకరు. తొలిసారి ఆయన దిల్లీలోని వాజ్పేయీ ఇంటికి వెళ్లినప్పుడు కాస్త వింతగా అనిపించిందని నాతో చెప్పారు. కానీ వారికది చాలా సాధారణంగా ఉండేదని, ఆ తర్వాత తాను కూడా వారి మధ్య సంబంధం గురించి ఆలోచించడం మానేశానని వివరించారు’’అని వాజ్పేయీ ఆత్మకథలో సాగరికా ఘోష్ రాసుకొచ్చారు.
‘‘వాజ్పేయీని తన ఆప్తమిత్రుడైన అప్పా ఘటాటే ఇంటికి రమ్మని పిలిచినప్పుడు.. భర్తతోపాటు కౌల్ కూడా వెళ్లేవారు. నారాయణ్ కౌల్ను వాజ్పేయీ చాలా గౌరవించేవారు. మరోవైపు రాజ్కుమారి కౌల్, వాజ్పేయీల మధ్య సంబంధాన్ని నారాయణ్ కౌల్ కూడా అంగీకరించేవారు. వాజ్పేయీ భోజనం చేశారా? లేదా? ఆయన ప్రసంగాన్ని ప్రజలు ఎలా వింటున్నారని భార్యను నారాయణ్ కౌల్ అడిగేవారు.’’
కౌల్ సిఫార్సుతో వాజ్పేయీ ఇంటర్వ్యూ చేసిన కరణ్ థాపర్
ఒకసారి వాజ్పేయీని ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలని ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ ప్రయత్నించారు. రైసీనా హిల్స్లోని వాజ్పేయీ నివాసానికి చాలాసార్లు కాల్చేసి నేను బాగా అలసిపోయాను. చాలాసార్లు కాల్ చేసిన తర్వాత ఫోన్లో కౌల్ మాట్లాడారు. దీంతో నేను వాజ్పేయీ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పాను. ఆమె సమస్యను అర్థం చేసుకున్నారు. తాను వాజ్పేయీతో మాట్లాడతానని చెప్పారు.’’ ‘‘మరుసటి రోజు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వాజ్పేయీ అంగీకరించారు. అప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం చాలా ప్రయత్నించానని చెప్పారు. దీనికి స్పందనగా మీరు హైకమాండ్ సిఫార్సుతో వచ్చారు.. ఇంటర్వ్యూ ఎలా కాదని చెప్పగలనని వాజ్పేయీ వ్యాఖ్యానించారు’’అని కరణ్ థాపర్ గుర్తుచేసుకున్నారు.
‘‘బ్యాచ్లర్నే.. బ్రహ్మచారిని కాదు’’
1960ల్లో భర్తకు విడాకులు ఇచ్చి వాజ్పేయీని కౌల్ పెళ్లిచేసుకోవాలని అనుకున్నారని చాలా కథనాలు వచ్చాయి. అయితే, ఈ వివాహంతో వాజ్పేయీ రాజకీయ జీవితం, తమ పార్టీపై ప్రభావం పడుతుందని ఆరెస్సెస్ భావించేదని రాజకీయ ప్రముఖులు విశ్లేషించేవారు.
వాజ్పేయీ పెళ్లి చేసుకోలేదు. అయితే, రాజ్ కుమరి కౌల్కి మాత్రం ఆయన జీవితంలో ప్రత్యేక స్థానముంది. ‘బ్యాచ్లర్నే.. బ్రహ్మచారిని కాదు’’అని వాజ్పేయీ ఓ కార్యక్రమంలో అంగీకరించారు కూడా. వాజ్పేయీ మరో జీవితచరిత్ర ‘‘హార్ నహీ మానూంగా(ఓటమిని అంగీకరించను)’’లోనూ ఈ ప్రేమ కథ గురించి ప్రస్తావించారు. ‘‘ఈ ప్రేమ కథ దాదాపు ఐదు దశాబ్దాలు కొనసాగింది. బహుశా మన భారత రాజకీయాల్లో ఇలాంటి పేరు లేని ప్రేమ కథ మరొకటి ఉండదు కాబోలు’’అని రచయిత విజయ్ త్రివేది రాసుకొచ్చారు. 2014లో 86ఏళ్ల వయసులో రాజ్ కుమరి కౌల్ మరణించారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించారని వాజ్పేయీ కుటుంబం నుంచి ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. వాజ్పేయీలో ఆమె సగమని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆమెను అభివర్ణించింది.‘‘కౌల్ మృతితో భారత రాజకీయాల్లో అతిగొప్ప ప్రేమకథకు ముగింపు పడింది. ఈ ప్రేమ కథ దశాబ్దాలపాటు కొనసాగింది’’అని కింగ్షుక్ నాగ్ వివరించారు.అన్నీ ఆమె చూసుకునేది..
రాజ్ కుమరి కౌల్ను.. కౌల్ అంటూ వాజ్పేయీ సంబోధించేవారు. ఇంట్లో వాజ్పేయీకి కావాల్సినవి అన్నీ ఆమెనే దెగ్గరుండి చూసుకునేవారు. వాజ్పేయీ ఆహారం, ఔషధాలు, ఇతర పనులు అన్నీ ఆమె దగ్గరుండి చూసుకునేవారు. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ రోడ్లో ఉండేటప్పుడు వాజ్పేయీని చూడటానికి కౌల్ వచ్చారు. ‘‘తన ఒంటిని శుభ్రం చేసుకోవడానికి వాజ్పేయీ బట్టల సబ్బును ఉపయోగిస్తున్నారని తెలిసి ఆమె షాక్కు గురయ్యారు’’అని సాగరిక ఘోష్ తన పుస్తకంలో వివరించారు.
‘‘ఒకసారి బల్బీర్ పుంజ్.. వాజ్పేయీ ఇంటికి వెళ్లారు. అప్పుడు కౌల్ ఇంట్లో లేరు. వాజ్పేయీ కోసం ఆహారం టేబుల్పై ఉంది. రోటీలు, కూరను చూసిన వాజ్పేయీ.. వంటగదిలోకి వెళ్లి నెయ్యిలో పూరీలు వేయించుకుని తెచ్చుకున్నారు.’’ ‘‘కౌల్ వచ్చి చూసేసరికి టేబుల్పై పూరీలు చూశారు. వెంటనే మీరు మళ్లీ నెయ్యిలో పూరీలు వేయించుకొని తిన్నారా? మీరు నెయ్యి ఎలా తింటారని ఆమె కోపంగా అన్నారు.’’
అటల్ బిహారీ వాజ్ పేయి కన్నా ముందే రాజ్ కుమారి కౌల్ మరణించారు. 2014లో ఆమె అంతక్రియలకు వాజ్ పేయి అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. ఆ తరువాత 2018లో వాజ్ పేయి కూడా మృతిచెందారు. అలా వారిద్దరి ప్రేమ కథ 2018లో ముగిసింది. కానీ ఇప్పటికీ అటల్ బిహారీ వాజ్ పేయి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ గొప్ప ప్రేమ కథ గుర్తొస్తుంది.