AP Politics : ఏపీ రాజకీయాలు ఇప్పుడు విశాఖ కేంద్రంగా నడుస్తున్నాయి. ఉత్తరాంధ్రపైనే వైఎస్ఆర్ సీపీ, టీడీపీ, జనసేన ఫోకస్ పెట్టాయి. అసలు ఈ ప్రాంతంపై పార్టీలన్నీ దృష్టి పెట్టడానికి కారణాలేంటి? అక్కడ రాజకీయ పరిస్థితులేంటి? పార్టీల బలబలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
2014 ఎన్నికల ఫలితాలు
ఉత్తరాంధ్రలో 34 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 24 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. బీజేపీ ఒక చోట గెలిచింది. ఆ ఎన్నికల్లో వైఎస్ ఆర్ సీపీ 9 స్థానాలకే పరిమితమైంది. శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాల్లో 7 చోట్ల టీడీపీ విజయఢంకా మోగించింది. వైఎస్ఆర్ సీపీ 3 స్థానాలు దక్కించుకుంది. విజయనగరం జిల్లాలో టీడీపీ 6, వైఎస్ఆర్ సీపీ 3 స్థానాల్లో గెలిచాయి. ఇక విశాఖ జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీ 11 , బీజేపీ 1, వైఎస్ఆర్ సీపీ 3 చోట్ల గెలిచాయి. ఆ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో దాదాపు 75 శాతం సీట్లను టీడీపీ కైవసం చేసుకుది. ఆ ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు.
2019 ఎన్నికల్లో బలాబలాలు
ఇక 2019 ఎన్నికల్లో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం కొనసాగింది. ఉత్తరాంధ్రలో ఆ పార్టీ 28 స్థానాల్లో విజయం సాధించింది. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి కంచకోటగా ఉన్న సిక్కోలులో టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. విజయనగరంలో ఒక్కస్థానాన్ని కూడా టీడీపీ దక్కించుకోలేకపోయింది. విజయనగరంలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక విశాఖలో వైఎస్ఆర్ సీపీ 11 చోట్ల విజయభేరి మోగించింది. టీడీపీ 4 చోట్ల విజయం సాధించింది. ఈ నాలుగు స్థానాలు కూడా విశాఖ నగర పరిధిలోనివే. కానీ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా చతికిల పడింది. మొత్తంగా పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి సాధించిన సీట్ల కంటే 3 స్థానాలు ఎక్కువే గెలిచింది వైఎస్ఆర్ సీపీ. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన జనసేన ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాజువాకలో ఓడిపోయారు. గత రెండు ఎన్నికల్లో పార్టీ బలాలు ఇలా ఉన్నాయి. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఏక పక్షంగా తీర్పు నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో విశాఖ ప్రజలు వైఎస్ జగన్ తల్లి విజయమ్మను ఓడిస్తే.. 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఓటమి చవిచూశారు. ఇదే స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగిన బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఓటమిని మూటగట్టుకున్నారు. భరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ నుంచే గతంలో ఎంపీగా గెలిచారు.
2024 ఎన్నికలకు పార్టీల వ్యూహాలేంటి?
విశాఖను పాలనా రాజధానిని చేస్తామని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ వేదికగా గర్జన నిర్వహించి తన వ్యూహమేంటో స్పష్టం చేసింది. విశాఖ పాలనా రాజధానిగా టీడీపీ, జనసేన ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే నినాదంతో ఆ పార్టీ 2024 ఎన్నికలకు వెళుతుందనేది స్పష్టమైంది. ఉత్తరాంధ్ర పరిరక్షణ పేరుతో టీడీపీ ఉద్యమాలకు సిద్ధమైంది. అందుభాగంగానే విశాఖలో పోరుబాట కార్యక్రమాన్ని చేపడితే ప్రభుత్వం ఆంక్షలతో అడ్డుకుంది. పాలనా రాజధాని పేరుతో ఉత్తరాంధ్రను దోచుకునేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. మరి జనం విశాఖ పాలనా రాజధానిగా ఉండాలన్నదానికి ఓటేస్తారా? ఉత్తరాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇస్తారో చూడాలి మరి.