ఏలూరులో ఏడేళ్ల క్రితం లీజుకు తీసుకున్న స్థలంలో కట్టిన వైసీపీ జిల్లా కార్యాలయం తాజాగా నేల మట్టమైంది. 2019లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత నైరాశ్యంతో కనిపిస్తున్నారు. 1999లో కాంగ్రెస్తో రాజాకీయల్లో ప్రవేశించి అప్పటి నుంచి వరుసగా ఏలూరులో పోటీ చేస్తున్న ఆయన ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమితో షాక్ తిన్న ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించేశారు.
ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మీడియాకు కనిపించడమే మానేశారు. దాదాపు వారం క్రితమే ఆళ్లనాని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షపదవికి, ఏలూరు వైసీపీ ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు కూడా ప్రెస్నోట్ రిలీజ్ చేసి తన నిర్ణయం వెల్లడించారు. ఇక తాజాగా వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని .. ఓటమి తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చి వెల్లడించారు.
ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన రోజుల వ్యవధిలోనే ఏలూరులో వైసీపీ జిల్లా కార్యాలయం కూల్చివేతకు గురైంది. నాని నేతృత్వంలోనే ఆ పార్టీ ఆఫీసును నిర్మించారు .. దాంతో నాని రాజీనామాకు, ఆఫీసు కూల్చివేతకు సంబంధం ఉందన్న ప్రచారం మొదలైంది. ఏలూరు వైసీపీ శ్రేణులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. దాంతో వివరణ ఇచ్చుకోవడానికి ఆయన మీడియా మీటింగ్ పెట్టాల్సి వచ్చింది.
Also Read: చెయ్యెత్తి.. సార్ అంటే.. జగన్కి అయ్యన్నపాత్రుడు సాలిడ్ రిప్లై..
కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని వైసీపీకి రాజీనామా ఆళ్ల నాని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయ భవనాన్ని పడగొట్టిన ఘటనపై కేడర్కు వివరణ ఇచ్చుకున్నారు. ఆ స్థలాన్ని ఏడేళ్ల కిందట లీజుకు తీసుకున్నామని, సమయం పూర్తి కావడంతో యజమానికి అప్పగించామని స్పష్టం చేశారు. .. ఆగస్టు ఒకటినే స్థలాన్ని అప్పగించామని, 15న స్వాతంత్య్ర వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నందున ఇప్పటివరకు ఆగారని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేశాను కనుక కార్యాలయ భవనాన్ని పడగొట్టారనడం వాస్తవం కాదని పేర్కొన్నారు.
వాస్తవానికి శ్రుక్రవారం పూట జరిగిన కూల్చివేత వైసీపీ శ్రేణుల్లో పెద్ద కలకలమే రేపింది. దాని వెనుక రాజకీయ కారణాలు వున్నాయని కొంతమంది అనుకున్నారు. కానీ, అలాంటివేమీ లేంటున్న నాని వైసీపీ కార్యాలయం కూల్చివేత వెనుక వున్న అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 2017లో ఆ స్థలాన్ని తన స్నేహితుడైన ఎన్నారై దగ్గర లీజుకు తీసుకున్నామని.. ఆ తర్వాత దాంట్లోనే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టామన్నారు. కానీ గత ఏడాదిగా ఆ స్థలం తిరిగి ఇవ్వాలని, దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాం అని స్థల యజమాని కోరారని వివరించారు. ఎన్నికలకు 3 నెలల ముందే స్థలం యజమానికి ఇచ్చేయాలని నిర్ణయించినా.. ఎన్నికల వేళ కార్యాలయం తీసేస్తే మంచి విధానం కాదు అని సమయం తీసుకోవటం జరిగిందన్నారు.
తన అనుచరులకు, పార్టీ కేడర్కు ఇదే విషయమై ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని … వివరణ ఇచ్చకున్న మాజీ డిప్యూటీ సీఎం ఇప్పటికైతే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్తున్నారు. అయితే తన తదుపరి కార్యాచరణ మాత్రం ఆళ్లనాని వెల్లడించలేదు. కొంతకాలం పాటు సైలెంట్ గా ఉండి భవిష్యత్తులో కూటమిలో భాగమైన జనసేనలో ఆయన చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.