వైసీపీ ప్రభుత్వ పెద్దలు గత ఐదేళ్లలో సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి అండగా నిలిచి.. సర్వం తానై వ్యవహరించిన గనులశాఖ మజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీఎట్టకేలకు అరెస్టు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత పరారై మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గనుల శాఖలో టెండర్లు, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు అందివ్వటానికి ప్రయత్నించినా వెంకటరెడ్డి ఆచూకీ లభించలేదు.
గత ప్రభుత్వ హయాంలో రూ. 2,566 కోట్ల దోపిడీ
మరోవైపు గనుల శాఖాధికారుల ఫిర్యాదు మేరకు వెంకటరెడ్డిపై ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ బృందాలు.. ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశాయి. జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2 వేల 566 కోట్లు దోచేసినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. ఈ దోపిడీకి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని తేల్చింది. ఇసుక కాంట్రాక్ట్ సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన కుట్రకు పాల్పడ్డారని తేల్చింది.
కోస్ట్గార్డ్ నుంచి ఏపీకి డిప్యుటేషన్పై వచ్చిన వెంకటరెడ్డి
ప్రభుత్వానికి బకాయిపడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల కాంట్రాక్టర్లు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వెంకటరెడ్డి వెనక్కి ఇచ్చేశారంట. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఏసీబీ తేల్చింది. వాటన్నటిపై కీలక ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్టు చేసింది. ఇండియన్ కోస్ట్గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసరైన వెంకటరెడ్డి 2019లో ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో కొనసాగారు. 2020 ప్రారంభంలో గనులశాఖ సంచాలకుడిగా నియమితులయ్యారు .. తర్వాత కొద్ది రోజులకే ఏపీఎండీసీ ఎండీగానూ అదనపు బాధ్యతలు చేపట్టారు.
గనులశాఖ సంచాలకుడిగా, ఏపీఎండీసీ ఎండీగా బాధ్యతలు
రెండు పోస్టులను అడ్డం పెట్టుకుని.. వైసీపీ పెద్దలు చేసిన గనుల, ఖనిజ, ఇసుక దోపిడీకి సహకరించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని, దీనికి చంద్రబాబు బాధ్యుడు అంటూ తప్పుడు ఫిర్యాదు చేసి.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై సీఐడీలో అక్రమంగా కేసు నమోదు చేయించారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా నియమితులయ్యాకే ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం తీసుకొచ్చారు. వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నవారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికే టెండరు దక్కేలా నిబంధనలు మార్చారు.
Also Read: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?
జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయింది. అయినా నవంబరు వరకూ ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు. గనుల లీజులు ఆన్లైన్ ద్వారా కేటాయించే విధానాన్ని వెంకటరెడ్డి 2022లో తెచ్చారు. అప్పటి వరకు లీజులు మంజూరయ్యే దశలో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారు. వైసీపీ నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం.. ఆన్లైన్ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు. గనులశాఖ నిర్వహించిన సీనరేజ్ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారు. వైసీపీపెద్దల సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారు.
ప్రైవేటు సంస్థలకు గనులశాఖ నిర్వహించిన సీనరేజ్ వసూళ్లు
అంత భారీ దోపిడీలో కీలక పాత్ర పోషించిన వీజీ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కకుండా ఉండటానికి పెద్ద స్కెచ్చే గీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నాళ్లపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తిరిగారు. తర్వాత ఢిల్లీలోని మిలటరీ కంటోన్మెంట్లో దాదాపు రెండున్నర నెలలు తలదాచుకున్నారంట … తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు సిమ్ కార్డులు తీసేసి, ఫోన్లు స్విచాఫ్ చేసేశారంటున్నారు .. ఇండియన్ కోస్ట్గార్డు సర్వీసు అధికారైన ఆయన గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంటోన్మెంట్కు చేరినట్టు తెలిసింది. తాను అక్కడ ఉంటే ఏసీబీ సహా ఎవరూ పట్టుకోలేరని భావించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన వెంకటరెడ్డి
అయితే వెంకటరెడ్డి, ఆయన సన్నిహితుల కదలికలపై కొన్నాళ్లుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు.. ఆయన ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లడానికి ఢిల్లీ పోలీసులు, కంటోన్మెంట్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండటంతో వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి హైదరాబాద్ వచ్చేసి.. శంషాబాద్ సమీపం సుల్తాన్పల్లిలోని అత్యంత విలాసవంతమైన రిసార్ట్స్లో మకాం వేశారు. ఏసీబీ బృందాలు హైదరాబాద్కు చేరుకుని వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నాయి.
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని, ఆరోగ్యసమస్యలు ఉన్నాయని వెంకటరెడ్డి కథలు చెప్పారంట .. ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చి అన్ని రకాల వైద్యపరీక్షలు చేయిస్తే అంతా అబద్దమే అని తేలిందంట. ఆ క్రమంలో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన జైలుపాలయ్యారు. వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుండటంతో.. ఇసుక, మైనింగ్ కుంభకోణాల్లో మిగిలిన పాత్రధారుల భాగోతాలు బయటపడనున్నాయి.
అసలు డొంక ఏ ప్యాలెస్లో ఉందో అంటున్న షర్మిల
గనుల దోపిడీలో వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు. పెద్ద డొంకలు కూడా కదలాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారించాలని ఎక్స్ వేదికగా ఆమె డిమాండు చేశారు. మైనింగ్ కుంభకోణంలో చిన్న చేపల్ని ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు చేయాలని రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకటరెడ్డి అయితే తెరవెనుక ఉండి, రూ.వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో ప్రజలందరికీ తెలుసంటూ.. ప్యాలెస్ పేరెత్తి పరోక్షంగా మాజీ సీఎం జగన్ని టార్గెట్ చేయడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది.