26/11 Terrorist Attack : ముంబయి తాజ్ హోటల్ 26/11 ఉగ్రదాడికి నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు అక్రమంగా భారత్లో చొరబడి మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది సామాన్యులు, పోలీసులు, ఎన్ఎస్జీ కమాండోస్ ప్రాణాలు కోల్పోయారు.
నాలుగు రోజులు జరిగిన ఈ మారణకాండలో 140 మందికి పైగా భారతీయులు, 26 మంది విదేశీయులు మృతిచెందారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. 1 నిమిషం, 36 సెకండ్ల ఈ వీడియోలో ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు గురించి వివరించారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎప్పటికీ వెనక్కు తగ్గదని, రాజీ పడదని అన్నారు.
ఒక్క ప్రాణం పోయినా సహించమని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేవరకు విశ్రమించమని తేల్చి చెప్పారు జయశంకర్. అయితే 26/11 దాడుల సూత్రధారుల వివరాలను భారత్ ఐక్యరాజ్యసమితికి అందించింది. వారిని బ్లాక్లిస్ట్లో చేర్చమని అభ్యర్ధించింది. పాకిస్థాన్, చైనా కలిసి ఈ ప్రతిపాదనను హోల్డ్లో పెట్టాయి. భారత్ అందించిన సూత్రధారులు పాకిస్థాన్కు చెందిన హఫీజ్ సయీద్, లష్కర్ ఎ తొయిబా నేత సాజిద్ మీర్, సీనియర్ జెయిషే మహ్మద్ నాయకుడు అబ్దుల్ రఫూఫ్, అబ్దుల్ రెహ్మాన్ మక్కి.