YV Subba Reddy : కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం ఖరారైన వేళ.. షర్మిలపై వైసీపీ నాయకులు ఎదురుదాడి మొదలుపెట్టారు. షర్మిలతో చర్చలు జరిపారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఎవరి కోసమూ తాను షర్మిలతో రాయబారం చేయలేదన్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం వల్ల ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి నీరాజనం పలుకుతున్నారని స్పష్టం చేశారు. ఓర్వలేకే ఎల్లోమీడియా వారిష్టం వచ్చినట్టు రాస్తున్నారని విమర్శించారు. తాను రెండు మూడు వారాలకొకసారి హైదరాబాద్ వెళతానని తెలిపారు. ఆ సమయంలో బంధువులను కలుస్తుంటానన్నారు. విజయమ్మ అమెరికా నుంచి వచ్చాక వెళ్లి కలిశానని వెల్లడించారు. కానీ ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కలిసి కుట్రలతో ఇలాంటి వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు.
షర్మిల మూడేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టారని కాంగ్రెస్ లో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయని ఆ విషయంపై తమకు క్లారిటీ లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి. అయితే షర్మిల కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా వైసీపీకి ఎలాంటి ఇబ్బందిలేదని స్పష్టం చేశారు. ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల మద్దదు వైసీపీకి ఉందన్నారు.జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల బతుకుల్లో మార్పు తెచ్చాయన్నారు.
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలవాలన్నదే తమ లక్ష్యమని వైవీ స్పష్టంచేశారు. సీట్ల విషయంలో నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు.వైసీపీకి దాడి వీరభద్రం రాజీనామాపై సుబ్బారెడ్డి స్పందించారు. ఓపిక పట్టాలని దాడి వీరభద్రంతో చెప్పామన్నారు. అయినా సరే ఆయన రాజీనామా చేశారన్నారు. చాలా సీట్లు విషయంలో మార్పులు ఉంటాయని వైవీ స్పష్టం చేశారు.