YSRCP Party Plan for AP MP Elections 2024: వరుసగా ఇన్చార్జులను మారుస్తూ.. జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడా ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఇప్పకిటీ సీట్లు దక్కక పార్టీకి దూరం జరుగుతున్న వైసీపీ.. రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా.. అప్పటి వరకు మార్పులుచేర్పుల కసరత్తును పక్కన పెట్టాలని డిసైడ్ అయింది. రాజ్యసభ ఎన్నికలకు ఖరారైన వైసీపీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్టీలో అసంతృతో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడింది. ఎన్నిక అనివార్యమైతే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బడా వ్యూహమే రెడీ చేస్తోందంటున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు అంశం కొలిక్కి వస్తుండటంతో.. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీటు దక్కించుకునేంత బలం లేకపోయినప్పటికీ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే. ఈ సారి కూడా అమలు చేయాలని చూస్తోంది.
సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఈ మూడు ఎంపీ సీట్లను అసెంబ్లీలో పూర్తి మెజారిటీ కలిగిన వైసీపీ గెల్చుకోవడం సులభమే… అయితే సార్వత్రిక ఎన్నికల వేళ మారిన పరిస్ధితులతో వీటిపై ఉత్కంఠ నెలకొంది. మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల సడన్గా ఆమోదించారు. అలాగే పార్టీలు మారిన మరో టీడీపీ, వైసీపీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు.. అనర్హత వేటు ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. స్పీకర్ నిర్ణయం తెలిపిన తర్వాత దానికి అనుగుణంగా ఎమ్మెల్యేల లెక్క తేలనుంది.
Read More : పవన్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్.. పొత్తు ఖాయమైనట్టా ?లేనట్టా ?
వైసీపీకి తన అభ్యర్ధులను గెలిపించుకునే బలం ఉన్నప్పటికీ.. ఆ పార్టీలో టికెట్లు దక్కలేదన్న అసంతృప్తి కొందరు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ముగ్గురు నలుగురు ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మార్పులు చేర్పులు ఎఫెక్ట్తో మరికొందరు వారి బాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. తమను పక్కన పెట్టేస్తారని పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారంట.
అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. సీఎం అలాంటి అసంతృప్తి ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిని ఊరడించే ప్రయత్నం చేసినా.. మంత్రి గుమ్మనూరు జయరాం, కాపు రామచంద్రారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఆయనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదంట. సరిగ్గా ఎమ్మెల్యేలంతా ఇంత అసంతృప్తిగా ఉన్న తరుణంలోనే.. రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. ఖాళీ అయిన మూడు స్థానాలనూ దక్కించుకోవడాన్ని.. వైసీపీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముగ్గురు అభ్యర్థులనూ ప్రకటించేశారు. ఎప్పటిలాగే సామాజికవర్గ లెక్కలతో ఒకర్ని.. రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు బిగ్షాట్లను ఎంపిక చేశారు.
ఇప్పుడా ఇద్దరు బడా బాబులు.. అసంతృప్తి నేతలను బుజ్జగించడానికి.. నేరుగా రంగంలోకి దిగారు. అసంతృప్త ఎమ్మెల్యేలను నయానో భయానో తమకు అనుకూలంగా మలుచుకోనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు వచ్చిన పలువురు అసంతృప్తి ఎమ్మెల్యేలతో అభ్యర్థుల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి డైరెక్ట్గానే మాట్లాడారంట.. మరో అభ్యర్థి మేడా రఘునాథరెడ్డి తరఫున ఆయన సోదరుడు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మంతనాలు జరిపారంట.
Read More : ఏపీ కాంగ్రెస్లో ఫుల్ జోష్.. 175 సీట్లకు 793 దరఖాస్తులు!
అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందిని వ్యూహాత్మకంగా ఆ ఇద్దరు బడా బాబులకే కేటాయించింది వైసీపీ.. ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేలు అవసరం అవ్వడంతో.. వారిని అన్ని విధాలా సాటిస్ఫై చేయడానికి వారిద్దరు స్కెచ్ రెడీ చేసుకున్నారంట. అవసరమైతే ఫారిన్ టూర్కి తీసుకెళ్లి పోలింగ్ సమయానికి వెనక్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ టీడీపీ కూటమి ఈ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించితే.. వెంటనే సదరు ఎమ్మెల్యేలను సింగపూర్, థాయ్లాండ్ల ఫ్లైట్ ఎక్కించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంట. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.