Kolusu Parthasarathy news(Andhra pradesh political news today): మరో వైసీపీ నేత టీడీపీ గూటికి చేరారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పసుపు కండువా కప్పుకున్నారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో ఆయన సైకిలెక్కారు.
వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. టీడీపీ చేరిన తర్వాత పార్థసారథి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలతో ఏపీకి భవిష్యత్ ఉండదన్నారు. అందువల్లే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ భావితరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు పార్థసారథి. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడి తరగతుల వారికి వైసీపీలో ఏ మాత్రం గౌరవం లేదన్నారు. ఈ వర్గాల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల వారు వైసీపీలో అవమానాలే ఎదుర్కొవాలన్నారు.
Read More: “టీడీపీలో చేరతా”.. వసంత కృష్ణప్రసాద్ ప్రకటన..
ఇప్పటికే నూజివీడు ఎమ్మెల్యే టిక్కెట్ ను కొలుసు పార్థసారథికి టీడీపీ ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు బొప్పన భవ కుమార్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ కూడా టీడీపీలో చేరారు. కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు.