YSRCP MLC Botsa Reacts on Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్నదానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న విషయంపై విచారణ జరిపించాలని, రుజువైందని తేలితే అప్పుడు మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు.
దేవుడితో రాజకీయాలు చేయడం అంటే.. దానికంటే సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది భక్తులు శ్రీవారికి ఉంటారని, అలాంటి దైవానికి సంబంధించిన ప్రసాదంపై ఇలాంటి చర్చ బాధాకరమన్నారు బొత్స సత్యనారాయణ. వైసీపీ హయాంలో 18 ట్యాంకర్లు కల్తీ ఉన్న కారణంగా రిజెక్ట్ అయ్యాయని, అలాంటిది ఇప్పుడెందుకు నెయ్యిలో కల్తీ జరుగుతుందని రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిజంగానే కల్తీ జరిగిందని తేలితే.. అందుకు కారణమైన బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని తెలిపారు. దేవుడికి అన్యాయం, అపచారం చేస్తే.. వాళ్లు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని బొత్స పేర్కొన్నారు. టీటీడీలో రాజకీయ ప్రమేయం తగ్గించాలని, ప్రతి దానికి రాజకీయ నేతలు ఇన్వాల్వ్ కాకూడదని అన్నారు.
Also Read: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ
ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డూ వివాదంతో కర్ణాటక సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో ప్రసాదం తయారీ, దీపాలకు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా నందిని నెయ్యినే వాడాలని ఆదేశించింది. దీంతో నందిని నెయ్యికి గిరాకీ ఏర్పడింది. ఆ సంస్థకు పాలను సరఫరా చేసేవారికి, వ్యాపారస్తుల పంట పండింది. కర్ణాటకలో ఒక లక్ష 80 వేల దేవాలయాలు ఉండగా.. 35,500 ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలో ఉన్నాయి. ఆయా ఆలయాల్లో వాడే నెయ్యి, ఇతర ముడి పదార్థాల్లో నాణ్యత టెస్టులు ఇకపై తప్పనిసరి కానున్నాయి.