AP News: అధికార వైసీపీ నేతలు చుక్కల దుప్పిని చంపి విందు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దారి తప్పి జనారణ్యంలోకి వచ్చిన ఓ దుప్పి నేతలకు ఆహారమైంది.
అరుదైన చుక్కల దుప్పిని చంపి ఆరగించిన సంఘటన యర్రవారిపాలెం మండలం వీఆర్ అగ్రహారంలో చోటుచేసుకుంది. శేషాచల అటవీ ప్రాంతం నుంచి దుప్పి గ్రామంలోకి వచ్చి చేరింది. పంటపొలాల్లో సంచరిస్తుండగా గమనించిన వైసీపీ కార్యకర్తలు.. కుక్కతో దాడి చేయించి చంపేశారు. ఆ తర్వాత దుప్పి మాంసంతో విందు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దుప్పిని పట్టుకుంటున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఆ వీడియో ఆధారంగా నిందితులను తేల్చే పనిలో పడ్డారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితులు వైసీపీకి చెందిన మాజీ సర్పంచి చంద్ర, కృష్ణయ్య, నాగేశ్వరరావు, చిన్నబ్బ లతో పాటు పలువురు మహిళలు కూడా ఉన్నట్టు గుర్తించారు.