YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఇద్దరి నేతల మధ్య ఉన్న ముసుగు మరోసారి తొలగిపోయిందన్నారు. కొద్ది నెలల వ్యవధిలో రెండోసారి భేటీకావడం పొత్తుల కోసమేనని అంటున్నారు.
సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. అందుకోసమే దత్త తండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతే పవన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికి వెళ్లడం పవన్కు సిగ్గుగా అనిపించడం లేదా? అని నిలదీశారు. టీడీపీ, జనసేన కలిసినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంగుళం కూడా కదపలేరని స్పష్టం చేశారు.
జనసేనను టీడీపీలో విలీనం చేయాలని మరో మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబు వద్ద పవన్ ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేనానికి నైతిక విలువలు లేవన్నారు. చంద్రబాబు, పవన్ కలిసినా వైసీపీకి నష్టం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లకు 175 వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్టు ఆడతాడు కాబట్టే పవన్ దత్తపుత్రుడు అయ్యారని అన్నారు. ఇప్పుడు చెప్పు తీసుకుని ఎవరిని కొట్టాలో పవన్ చెప్పాలి? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1పై చర్చించడమేంటి? అని నిలదీశారు. ప్యాకేజీకి లొంగిపోయారు కాబట్టే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని ఆరోపించారు. మొత్తంమీద చంద్రబాబు, పవన్ భేటీపై యథావిధిగా వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. మరి వైసీపీ నేతల విమర్శలకు జనసేనాని ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.