Ex Minister Kakani Govardhan Reddy: ఏపీలో తాజా రాజకీయ స్థితిగతులు చూస్తే.. పొలిటికల్ వార్ వేడెక్కిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన మద్యం నూతన పాలసీ విధానం ప్రక్రియను టార్గెట్ చేస్తూ కూటమిపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అంతేకాకుండా ఇసుక విధానం కూడా పేరుకే ఉచితం అంతా దోచేస్తున్నారంటూ.. సీఎం చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ నేతలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అయితే తాజాగా ఈ అంశాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు లక్ష్యంగా రెచ్చిపోయారని చెప్పవచ్చు.
అసలు కాకాణి ఏమన్నారంటే…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక అలవాటు ఉందని, చంద్రబాబు ఎక్కడైనా దోచుకోవాలంటే.. మరోచోట దొంగతనం జరుగుతుందని ప్రచారం చేస్తారన్నారు. అందరూ అటుచూసే లోగానే.. ఇటు దోచేయడం బాబు నైజం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కాకాణి. అలాగే రాష్ట్రంలో నూతన మద్యం విధానం వల్ల కూటమి నేతలకు మాత్రమే మేలు జరుగుతుందని, రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశాలకు గండి పడిందన్నారు.
రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు ప్రణాళిక వేసి, ఆ నెపం ఇతరుల మీదకు నెట్టడం బాబు నైజమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే అన్ని చంద్రబాబు సిండికేట్లుగా తయారయ్యాయని, విద్య, వైద్యం, లిక్కర్ షాపులు, ఇసుక, కేబుల్ టీవీ లతో సహా మొత్తం సిండికేట్ వాతావరణం కనిపిస్తుందన్నారు.
దీనితో ధరలు పెరిగిపోయి ప్రజలకు ఆర్థిక భారం కలిగే అవకాశం ఉందని, ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపితే ధరలపై నియంత్రణ ఉంటుందన్నారు. ఇప్పుడు అవలంబిస్తున్న మద్యం విధానం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాక, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తథ్యమన్నారు.
రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగడం లేదని, ప్రజలు నమ్మి ఓట్లేస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరచిపోయిందన్నారు. ఆరు గ్యారంటీలు అంటూ.. ఎన్నికల సమయంలో కూటమి విస్తృత ప్రచారం నిర్వహించిందని, అధికారంలోకి వచ్చాక వాటి ఊసే లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.
అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన కామెంట్స్ పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పరిపాలన సమయంలో మద్యం వ్యాపారంతో వారి జేబులు నింపుకున్నారని, కొత్త విధానం ద్వారా ఎటువంటి అవినీతి జరిగే ఆస్కారం లేదంటూ ట్వీట్ ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనా వైసీపీ నేతల్లో ఎటువంటి మార్పు రావడం లేదని ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.