హైటెన్షన్ .. కడప జిల్లా పాలిటిక్స్లో ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. యావత్తు జిల్లాను తమ ఇలాకాగా మార్చుకున్న వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు రెండు పార్టీల అధ్యక్షులుగా .. ఎన్నికల పోరులో సై అంటే సై అంటుండటంతో .. ఆ ఫ్యామిలీ వార్ ఉత్కంఠ రేపుతోంది. అన్న జగన్ను డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… కాంగ్రెస్ను గాడిలో పెట్టడంతో పాటు వైసీపీ ప్రాబల్యం తగ్గించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో షర్మిలతో వైఎస్ సునీత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.. పొలిటికల్ ఎంట్రీపై సునీత నిర్ణయం ఎలా ఉంటుందో అని వైసీపీ తెగ టెన్షన్ పడిపోతున్నాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్ర పాలిటిక్స్లో తనదైన బ్రాండ్ వేసుకున్నారు ఆ దివంగత నేత ఆ బ్రాండ్కు ఇప్పుడు ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తండ్రి సెంటిమెంట్ను సమర్ధంగా వాడుకుని … ఒక్క చాన్స్ అంటూ .. సీఎం సీటులో కూర్చోగలిగారు. అన్న జగన్తో విభేదించి తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లిన వైఎస్ షర్మిల.. ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చి.. పీసీసీ అధ్యక్షురాలిగా జగన్పై సమర శంఖం పూరిస్తున్నారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూనే వైఎస్ మరణించారు. అదే కాంగ్రెస్తో విభేదించి ఆయన కొడుకు జగన్ వైసీపీ స్థాపించారు. వైఎస్ షర్మిల మాత్రం తన తండ్రి నమ్ముకున్న పార్టీ అధ్యక్షురాలిగా నియమితులై .. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న వైఎస్ కలలను నిజం చేస్తానంటున్నారు.
దాంతో వైఎస్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడంలో ఆమె సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తున్నారు. వైసీపీ వర్గాలు ఆమె పేరు ముందు వైఎస్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నా .. సంప్రదాయ కాంగ్రెస్ వాదులు ఆమెను వైఎస్ కూతురిగా.. ఆయనకు నిజమైన వారసులిగానే చూస్తున్నారు. అలాగే ఇంత కాలం జగన్ వెంట నడిచిన వైఎస్ అభిమానుల్లో కూడా ఊగిసిలాట కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే ఇప్పుడు అధికారపక్షానికి మింగుడు పడకుండా తయారైనట్లు కనిపిస్తోంది.
వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయ సమీకరణాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో? అర్ధం కాకుండా తయారవుతోంది. వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత నుంచి వైఎస్ కుటుంబానికి పూర్తిగా దూరమైన వివేక కూతురు డాక్టర్ సునీత పొలిటికల్ ఎంట్రీపై ప్రచారంతో జిల్లా రాజకీయాలు హాట్ హాట్గా తయారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తన అక్క షర్మిలను వైఎస్ సునీత కలిసి మంతనాలు సాగించడం ప్రాధ్యాన్యత సంతరించుకుంది.
పీసీసీ చీఫ్గా మొదటి సారి కడప జిల్లాకు వచ్చిన షర్మిలను ..ఇడుపులపాయ గెస్ట్ హౌస్లో వివేకా కుమార్తె సునీత కలిసి చర్చలు జరపటం.. ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఆ క్రమంలో షర్మిలతో భేటీ అయిన సునీత ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. అన్నకు వ్యతిరేకంగా షర్మిలతో కలిసి పోరాడుతారా? .. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తాను కూడా కడప జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా?.. లేకపోతే వివేకా సెంటిమెంట్తో పులివెందుల బరిలో దిగుతారా?.. అన్న చర్చలు మొదలయ్యాయి.
సునీత పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వివేకా హత్యకేసులో జగన్కు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న న్యాయపోరాటం వెనుక టీడీపీ హస్తం ఉందని విమర్శిస్తూ వచ్చారు వైసీపీ నేతలు .. దాంతో సునీత టిడిపి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే అది జరగలేదు.. జగన్ సర్కారుపై సునీత చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా నిలిచిన షర్మిల .. ఇప్పటికే ఆమెకు పొలిటికల్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజాగా జరిగిన అక్కాచెల్లెల్ల భేటీతో.. సునీత కాంగ్రెస్లో చేరడం ఖాయమైనట్లే కనిపిస్తోందంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా సునీత తమ పార్టీ టికెట్తో పోటీ చేస్తారని నమ్మకంగా చెప్తున్నాయి.
YSR Family, divided, politics, Sharmila Vs Jagan, Kadapa, AP news,