YSR Family Disputes : అన్నాచెల్లెళ్ల మధ్య వార్ పీక్ స్టేజ్కు చేరింది. వారి మధ్య వివాదం కుటుంబంలో చీలిక తెచ్చింది. తమ కుటుంబంలో చీలకకు తన అన్న జగన్నే కారణమంటున్న షర్మిల వాదనలో నిజమెంత? కాంగ్రెస్ పార్టీయే తన కుటుంబంపై రాజకీయాలకు పాల్పడుతోందన్న వైసీపీ అధినేత మాటల్లో అర్థమేంటి? నాడు జగనన్న వదిలిన బాణం.. ఎటు నుంచి ఎటువైపునకు వెళ్తోంది.
YSR Family Dispute : అన్నాచెల్లెళ్ల మధ్య వార్ పీక్ స్టేజ్కు చేరింది. వారి మధ్య వివాదం కుటుంబంలో చీలిక తెచ్చింది. తమ కుటుంబంలో చీలకకు తన అన్న జగన్నే కారణమంటున్న షర్మిల వాదనలో నిజమెంత? కాంగ్రెస్ పార్టీయే తన కుటుంబంపై రాజకీయాలకు పాల్పడుతోందన్న వైసీపీ అధినేత మాటల్లో అర్థమేంటి? నాడు జగనన్న వదిలిన బాణం.. ఎటు నుంచి ఎటువైపునకు వెళ్తోంది.
APCC చీఫ్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీలో కాంగ్రెసేతర పార్టీలపై విమర్శలు చేస్తూనే వైసీపీపై విరుచుకుపడుతున్నారు. పార్టీల మధ్య సాగాల్సిన డైలాగ్ వార్ కాస్తా.. కుటుంబంలో చీలికల వివాదం మారింది.. ఎంతవరకూ అంటే స్వయానా అన్నయ్యను జగన్రెడ్డి అనే స్థాయికి వీరి గొడవ చేరింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసి.. జగన్ విజయంలో కీలకపాత్ర పోషించారు షర్మిల. కానీ.. రోజులు మారాయి. తర్వాత కాలంలో కుటుంబంలో వచ్చిన విభేదాలు కావొచ్చు.. ఇతర అంశాలు కారణం కావొచ్చు.. జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. తగ్గేదేలే అన్నట్లు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందని తిరుపతిలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఎదురు దాడి చేశారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ వల్లే తమ కుటుంబంలో చీలిక వచ్చిందని.. నాడు బాబాయ్ వివేక, నేడు చెల్లెలు షర్మిలను ఆ పార్టీ తనపై ఉసిగొల్పుతుందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా తీవ్రదుమారాన్నే రేపాయి.
జగన్ చేసిన వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించారు షర్మిల. అసలు YSR కుటుంబంలో చీలిక తెచ్చిందే జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న.. సీఎం కాకముందు.. ఒకలా ఉంటే.. సీఎం అయ్యాక మరోలా మారిపోయారని… YS పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచిన జగన్.. తర్వాత రాజశేఖర్రెడ్డి తరహాలో పాలన చేయలేదని ఆరోపించారు. తప్పంతా జగన్ అన్నదే అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలో విభేదాలకు జగనన్నే కారణమని.. అందుకు పైన దేవుడు, తన తల్లి విజయమ్మ సాక్ష్యమంటూ వివాదంలోకి తల్లిని కూడా లాగారని వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి YSRCP పార్టీలో ఉన్న నేతలంతా మాగ్జిమమ్.. కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చినవారే అని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్ విభజన తీరును జీర్ణించుకోలేని నేతలు.. ఆ పార్టీని వదలి.. రాజశేఖర్రెడ్డి కుమారుడు పెట్టిన పార్టీ అంటూ YSRCPలో చేరారు. ఇదే సూత్రాన్ని అమలు చేేసేందుకు షర్మిల సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో అసంతృప్త నేతలను.. టీడీపీ-జనసేన వైపునకు వెళ్లకుండా.. తిరిగి కాంగ్రెస్లోకి తీసుకొచ్చేనాలా ఆమె పావులు కదుపుతున్నారు. ఈ మేరకు కొందరు కాంగ్రెస్ సీనియర్లతోనూ షర్మిల నేరుగానే భేటీ అవుతున్నారు. ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తీసుకురావాలనే తపన ఓ వైపు.. గత ఎన్నికల్లో తనను పావుగా వాడుకున్న అన్నపై కక్ష సాధింపు మరోవైపు అంటూ రాజకీయవర్గాలు అంటున్నాయి. అందుకేనేమో.. బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి.. వరుస కార్యక్రమాల్లో షర్మిల దూసుకుపోతున్నారు.
జగన్, షర్మిల ఎపిసోడ్.. రాజకీయంగా రచ్చ జరుగుతుందే అనుకున్నారు కానీ తప్ప.. అది కుటుంబంలో కలహంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం షర్మిల జిల్లాల పర్యటనలో ఉన్నారు. అనేక అంశాలపైన ఆమె మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను చేస్తున్న కామెంట్స్ వైసీపీ క్యాడర్ నుంచి లీడర్స్ నుంచి విమర్శలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ.. డైరెక్ట్ గా అధినేత నుంచే మాటలు యుద్ధం స్టార్ట్ అయింది అంటే పరిస్థితి ఊహించవచ్చు. అయితే ఎన్నికల తరుణంలో ఇవన్నీ సహజమని కొందరు విశ్లేషకులు చెబుతున్నప్పటికీ.. కుటుంబ కలహాలు కుటుంబ నేపథ్యం కూడా తెరపైకి రావటం అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఓ వైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఖాతాల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. షర్మిల పేరును రకరకాలుగా మారుస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. PCC చీఫ్పై రకరకాలుగా దూషిస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె ఇంటి పేరుపై పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు YS షర్మిల పేరుపై రాని అభ్యంతరాలు ఒక్కరోజులోనే మారిపోవడం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. షర్మిల.. ఇకపై భర్త ఇంటి పేరును వాడుకోవాలని రకరకాల కామెంట్లు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో తనకు.. తన పార్టీ, కుటుంబానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన అనేక మందిపై కేసులు పెట్టి.. సీఐడీతో ఎంక్వైరీలు జరిపించిన జగన్..తన సొంత చెల్లిపై జరుగుతున్న ప్రచారంపై నోరు ఎందుకు మెదపకపోవటంపైనా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే.. ఇవి జగన్ టీంకి సంబంధం ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రాజకీయాలంటే ఇంత దిగజారాలా ఇంట్లో విషయాలు రోడ్డుమీద పెట్టుకోవాలా పెట్టుకుంటేనే ఓట్లు పడతాయా అనే విమర్శలున్నాయి.
ఎన్నికల తరుణం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న ఈ వివాదం ఎన్నికల వేళ మరింత రచ్చగా మారే అవకాశం లేకపోలేదు అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. చూద్దాం.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ప్రకారం.. ఏది ఏమైనా జరగొచ్చు అని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.