Fire Accident: అనకాపల్లిలో అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలోని ఓ రియాక్టర్ పేలుడుతో సుమారు 15 మంది కార్మికులు మరణించారు. దాదాపు 50 మంది వరకు గాయాలపాలయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేశ్ సహా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయింది. ప్రమాదం గురించి కనీసం సమాచారాన్ని కూడా తీసుకోలేని అలసత్వంతో టీడీపీ ప్రభుత్వం ఉన్నదని విమర్శించింది. ఇది పాలనలో చంద్రబాబు నాయుడి బేలాతనానికి నిదర్శనం అని.. 45 ఏళ్ల అనుభవంలో కనిపించిన డొల్లతనం అని ఫైర్ అయింది.
అచ్యుతాపురం అగ్నిప్రమాదంపై ప్రభుత్వం అలసత్వానికి నిదర్శనమని మండిపడింది. ఘటన జరిగిన సుమారు 5 గంటల తర్వాత సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ పెట్టారని వివరించింది. ముగ్గురు మాత్రమే చనిపోయారని, 25 మందికి మాత్రమే గాయాలు అయ్యాయని ఘటనను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నదనే క్లారిటీ లేని కామెంట్ చేశారని వివరించింది. ఆ స్థాయిలో ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి సమాచారం లేకపోవడం దారుణం అని ట్వీట్ చేసింది. అదే ప్రెస్ మీట్లో జగన్ ప్రభుత్వంపై పనికిమాలిన ఆరోపణలు చేయడం మరీ దారుణమని మండిపడింది.
Also Read: Minister Tummala: రుణమాఫీ ఆంక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల..
30 కిలోమీటర్ల దూరంలోని విశాఖకు కాకుండా అనకాపల్లిలోని ఆస్పత్రికి బాధితులను తరలించడం.. క్రైసిస్ మేనేజ్మెంట్లోని డొల్లతనాన్ని వెల్లడిస్తున్నదని వైసీపీ ఫైర్ అయింది. తమను విశాఖపట్నం తీసుకెళ్లాలని బాధితులు వేడుకున్నారని, అనకాపల్లిలో ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపించారని బాధితులు అధికారుల ముందు గగ్గోలు పెడుతున్నారని పేర్కొంది.