YS Viveka daughter Sunitha | వైఎస్ కుటుంబం నుంచి మరో లీడర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్లో చేరాలంటూ సునీతను ఆహ్వానించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కడప ఎంపీగా పోటీ చేయాలని కూడా కోరారు.
వైఎస్ కుటుంబం నుంచి మరో లీడర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్లో చేరాలంటూ సునీతను ఆహ్వానించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కడప ఎంపీగా పోటీ చేయాలని కూడా కోరారు. వైఎస్ సునీతను ఇప్పటికే తమ పార్టీలో చేరాలని టీడీపీ సైతం ఆహ్వానించింది. ఆ క్రమంలో తన రాజకీయ రంగప్రవేశంపై కుటుంబ సభ్యులతో సునీత మంతనాలు జరుపుతున్నారంట.
ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్కు మరో షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన బాబాయ్ వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగుపెట్టే ప్రయత్నాల్లో పడ్డారంట. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో.. సునీత కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతారన్న ప్రచారం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ వార్తలతో వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారంట.
వైఎస్ వివేకా హత్య జరిగే వరకు పెద్దగా ఫోకస్ కాని వైఎస్ సునీత పేరు.. తండ్రి హత్య తరువాత రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమైంది. వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు సునీత కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాదు.. కోర్టు కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు . తన తండ్రిని చంపినవారికి శిక్ష పడాలని న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ విషయంలో సునీతకు షర్మిల సైతం మద్దతుగా నిలిచారు. అప్పుడు సపోర్ట్ చేసిన షర్మిల.. ఇప్పుడు పొలిటికల్గాను అండగా నిలుస్తానంటూ ఆఫర్ ఇచ్చారంట. దాంతో సునీత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎంట్రీకి మంతనాలు సాగిస్తున్నారంట. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వివేకా హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని గాని, సీఎం జగన్ని కాని ఎన్నికల బరిలో సునీత నేరుగా ఢీ కొట్టే అవకాశం ఉందంటున్నారు. వివేకా హత్య తర్వాత జగన్ కు డాక్టర్ సునీత మధ్య విభేదాలు తలెత్తాయి. తన తండ్రి హత్యపై జగన్ కు, ఆయన భార్య భారతికి ముందే సమాచారం ఉందనీ.. హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ హత్య అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి చేయించారని ఆరోపిస్తున్నారు. తన తండ్రి కేసు విచారణలో ఆలస్యంపై సునీతారెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. ఆ విషయంలో బంధువులతో పాటు వైసీపీ పెద్దల నుంచి ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె వెనక్కి తగ్గలేదు.
వివేక హత్య తర్వాత జగన్, సునీత కుటుంబాలు విడిపోయాయి. వివేకా హత్య.. సునీత న్యాయపోరాటం జగన్ని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టింది. సునీత వాదన టీడీపీ, జనసేన పార్టీలకు ప్రచారాస్త్రమైంది. దాంతో వైసీపీ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి ఈ హత్య వెనక ఉన్నారని.. ఆస్తి కోసమే కుటుంబ సభ్యులే చంపేశారన్న ప్రచారం ప్రారంభించింది. సునీత వెనుకుండి చంద్రబాబు ఇదంతా నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదాల నేపధ్యంలో సునీత ఇప్పుడు తన భవిష్యత్తును పొలిటికల్ బరిలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారంటున్నారు. షర్మిల కు జగన్కు మధ్య విభేదాలు తీవ్రతరం అవ్వడంతో .. అక్కా, చెల్లెళ్లు అయిన షర్మిల, సునీత ఒకటయ్యారు. ఆ క్రమంలోనే పీసీసీ ప్రెసిడెంట్ అయిన షర్మిల పార్టీలో చేరడానికి సునీతకు ఆఫర్ ఇచ్చారంట .. మరి షర్మిల ఆఫర్కు సునీత ఓకే చెబుతారా? కడప నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారా..? పులివెందుల బరిలో ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా సునీత తన కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు చెప్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ, కాంగ్రెస్ మద్దతు కోరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో .. జగన్కు బయటి పోరు కంటే ఇంటి పోరే ఎక్కువైనట్లు కనిపిస్తోంది. తల్లి విజయలక్ష్మి, సొంత చెల్లెలు షర్మిల ఇప్పటికే రాజకీయ ప్రత్యర్ధులుగా మారారు. ఇప్పుడు చిన్నాన్న కూతురు సునీత కూడా వారితో కలిస్తే.. వైసీపీపై ఆ ఎఫెక్ట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.