వైఎస్ కుటుంబం నుంచి మరో లీడర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్లో చేరాలంటూ సునీతను ఆహ్వానించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కడప ఎంపీగా పోటీ చేయాలని కూడా కోరారు. వైఎస్ సునీతను ఇప్పటికే తమ పార్టీలో చేరాలని టీడీపీ సైతం ఆహ్వానించింది. ఈ క్రమంలో తన రాజకీయ రంగప్రవేశంపై కుటుంబ సభ్యులతో సునీత మంతనాలు జరుపుతున్నారు.
వైఎస్ వివేకా హత్య జరిగే వరకు సునీత పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. వృత్తిపరంగా డాక్టర్. తన పని తాను చేసుకునేవారు. అయితే తన తండ్రి హత్య కేసు దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసి వార్తల్లోకి ఎక్కారామె. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపైనే కోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో సునీతకు షర్మిల సైతం మద్దతుగా నిలిచారు. అప్పుడు సపోర్ట్ చేసిన షర్మిల.. ఇప్పుడు పొలిటికల్గాను అండగా నిలుస్తానంటూ ఆఫర్ ఇచ్చారు.
మరి షర్మిల ఆఫర్కు సునీత ఓకే చెబుతారా..? కడప నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారా..? మరోవైపు.. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జరుపుతున్నట్టు చెప్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ, కాంగ్రెస్ మద్దతు కోరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.