YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. గురువారం ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారు. బుధవారం లేదా గురువారం ఆమె ఢిల్లీకి వెళతారని సమాచారం. జనవరి 4న ఢిల్లీలో YSRTPని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని అంటు ఏఐసీసీ, ఇటు షర్మిల సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.
షర్మిల పార్టీ విలీనంపై ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఆమె పార్టీలో చేరతారని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చెప్పారని ఇప్పటికే ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. ఆమె చేరితే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై ఇటీవల ఏపీ నేతలను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అడిగి తెలుసుకున్నారు.
షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఆమె రాకతో ఏపీలో పార్టీ పునరుజ్జీవం అవుతుందనే నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలున్నారు. ఇప్పటికే షర్మిలతో టచ్ లో పలువురు వైసీపీ నేతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోటస్పాండ్ కార్యాలయంలో భేటీ అయ్యారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై చర్చించారు. షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరతారని వైఎస్ఆర్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీలో కీలక పదవి ఆమెకు దక్కే అవకాశం ఉందన్నారు. తన పార్టీలో ఇన్నాళ్లూ పని చేసిన నేతలకు కీలక పదవులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చారన్నారు.
ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో కలిసి నడుస్తానని ప్రకటించారు. ఆర్కే వ్యాఖ్యలపైనా షర్మిల స్పందించారని సమాచారం. తనతో కలిసి నడుస్తానని చెప్పినందకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారని తెలుస్తోంది.
మరోవైపు షర్మిల సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడప వెళ్లనున్నారు. ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి సమాధి వద్దకు వెళుతున్నారు. నూతన వధూవరులు రాజారెడ్డి, ప్రియతో కలిసి ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఇలా ఒకవైపు పార్టీ విలీనం, మరోవైపు కుమారుడి వివాహ కార్యక్రమాలతో షర్మిల బిజీబిజీగా ఉన్నారు.