వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పయనం ఎటువైపు? రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది? గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. తెలంగాణ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు షర్మిల అడుగులు ఎటు వైపు అని వినిపించాయి. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా? కేవలం మద్దతిస్తారా? లేకపోతే పోటీలో ఉంటారా అని చాలా సందేహాలు ఉండేవి. కానీ.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు షర్మిల ప్రకటించారు.
ఎన్నికలు పూర్తయ్యాయి.. ఫలితాలు వచ్చాయి.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరింది. మరి ఇప్పుడు షర్మిల దారెటు? మళ్లీ ప్రశ్నలు మొదలైయ్యాయి. అయితే.. ఏపీలో కాంగ్రెస్ కోసం పని చేయాలని అధిష్టానం నుంచి ఆమెకు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. షర్మిల నుంచి కూడా హైకమాండ్ కు కూడా కొన్ని డిమాండ్స్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఏపీపీసీసీ చీఫ్ పదవిని తనకు ఇస్తూ.. ఎంపీగా రాజ్యసభకు కూడా పంపించాలని కోరినట్టు ఢిల్లీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ముందు ఏపీలో పార్టీ కోసం పని చేస్తే.. పదవులు ఆటోమేటిగ్ గా వస్తాయని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందని తెలుస్తోంది.
అయితే, ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల రాకపై ఏకాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. కొందరు కీలక నేతలు షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నారు. ద్వితియ శ్రేణి నాయకులు మాత్రం పార్టీలోకి షర్మిల వస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కూడా ఇదే తరహా పరిస్థితి షర్మిలకు ఎదురైంది. ఏపీ మూలాలు ఉన్న షర్మిల కాంగ్రెస్లో చేరితే కేసీఆర్ కు ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి లాంటి వారు ఆమె రాకను వ్యతిరేకించారు. కానీ.. మరికొందరు మాత్రం.. షర్మిల పార్టీలో చేరితే.. వైఎస్ఆర్ అభిమానులను ఆకర్షించవచ్చిన అభిప్రాయపడ్డారు. సేమ్ ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. కొందరు షర్మిల రాకను వ్యతిరేకిస్తే.. మరికొందరు మాత్రం మద్దతిస్తున్నారు. మరి షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.