YS Sharmila vs YS Jagan: ఏపీలో అన్నా, చెల్లెలి ఆస్తి పంచాయితీ ఇప్పుడు హాట్ టాపిక్. ప్రతి ఇంట్లో ఉండే సమస్యే అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంతో.. చెల్లెలు షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ఏది సాధారణ సమస్య అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చడం సాధారణ సమస్యనా.. బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారని చెప్పడం సాధారణమా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఇంతకీ ఆస్తి పంచాయితీపై జగన్ ఏమన్నారు? దానికి షర్మిల ఇచ్చిన కౌంటర్ ఏంటో చూద్దాం.
ఆస్తుల వివాదంపై గొడవలు పెట్టుకోవాలని తమ ఉద్దేశం కాదంటున్నారు షర్మిల. సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని తెలుసన్నారు. అంతేకాదు చెల్లిపై ప్రేమతోనే జగన్ షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు అనేది పచ్చి అబద్ధమని షర్మిల తెలిపారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకే ఈ కుట్ర చేశారు అని అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అంటూ సెటైర్ వేశారు షర్మిల. రాజశేఖర్ రెడ్డికి, వైసీపీ పార్టీకి అసలు సంబంధం లేదని వైయస్ షర్మిళ జగన్ పై ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన పార్టీవైసీపీ పార్టీ అని షర్మిళ జగన్ పై మండిపడ్డారు. ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధం, అనుబంధాలను మార్చారని.. కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని మండిపడ్డారు. ఈడీ కేసులు, బెయిల్ రద్దవుతుందని కారణాలు చెబుతున్నారు కానీ.. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదని షర్మిల వెల్లడించారు.
సర్వసతీ కంపెనీకి చెందిన 32 కోట్ల విలువైన భూమిని ఈడీ అటాచ్ చేసింది కానీ.. కంపెనీ షేర్లను ఎప్పుడూ అటాచ్ చేయలేదంటున్నారు షర్మిల. ఏ కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసినా.. ఏ సమయంలోనైనా షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చన్నారు. 2016లో ఈడీ అటాచ్ చేసినందున షేర్ల బదిలీ చేయకూడదని.. ఒకవేళ షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తే బెయిల్ రద్దవుతుందని జగన్ వాదిస్తున్నారని తెలిపిన షర్మిల.. 2019లో 100శాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూపై ఎలా సంతకం చేశారని ప్రశ్నించారు. అప్పుడు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. మొత్తానికి ఆస్తి వివాదంపై జగన్ స్పందించడం.. దానికి షర్మిల కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు ఏపీలో మరింత హాట్ టాపిక్గా మారింది ఈ ఆస్తి పంచాయితీ.
Also Read: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్లో వైసీపీ విలీనం
మరోవైపు.. వైసీపీ అధినేత జగన్.. కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంచాయితీ ఇప్పుడు వైసీపీ, టీడీపీల మధ్య డైలాగ్ వార్కు కారణమైంది. జగన్ చేసిందే కరెక్ట్ అంటూ వైసీపీ నేతలు వాదిస్తుంటే.. సొంత చెల్లికే న్యాయం చేయలేదు.. మిగిలిన వారికి ఏం న్యాయం చేస్తాడు అంటూ టీడీపీ నేతలు విరుచుకపడుతున్నారు. ప్రస్తుతం ఇరు పార్టీల నేతల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తోంది. జగన్, షర్మిల పంచాయితీ ఏమైనా రాష్ట్ర సమస్యనా.. దేశ సమస్యనా..? అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరిని అక్కాచెల్లెమ్మలు అనే జగన్.. సొంత చెల్లికే న్యాయం చేయడం లేదు.. ఇక మిగిలిన వారికి ఏం చేస్తారంటూ నిలదీస్తున్నారు. అంతేకాదు హోంమంత్రి అనిత అయితే షర్మిల, విజయమ్మ రక్షణ బాధ్యతలు తీసుకుంటామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం టీడీపీ, వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఎన్నికల హీట్ మళ్లీ కనిపిస్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా టీమ్లు పెట్టిన పోస్టర్లు ఉత్కంఠ రేపాయి. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో ఏం జరగబోతోంది.? అధికార, ప్రతిపక్షాలు ఏం చెప్పబోతున్నాయన్నట్లుగా ఎక్స్ వార్తో హీట్ క్రియేట్ చేశారు. ఏదో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందన్న టెన్షన్ సృష్టించారు. టీడీపీ వాళ్లకు సంబంధించిన కుంభకోణం అంటూ వైసీపీ.. జగన్ ఫ్యామిలీ రచ్చ అంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భంలో ఇరుపార్టీలు ఈ ఇష్యూపై మాట్లాడుతూనే ఉన్నాయి.