YS Sharmila: ఏపీలో రాజకీయాలు తారుమారైనట్టు కనిపిస్తున్నాయి. ప్రశ్నించాల్సిన ఫ్యాన్ పార్టీ పత్తా లేకుండా పోతోంది. ఆ రోల్ను కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు చంద్రబాబు సర్కార్ని ప్రశ్నిస్తూ.. మరోవైపు జగనన్నపై బాణాలు వదులుతోంది ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
వైసీపీ సర్కార్లో ప్రకృతి సంపద దోపిడీకి దారులు పరిచిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఎట్టకేలకు ఏపీ సర్కార్ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జైలులో ఉన్నారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న సమయంలో ప్రభుత్వ ఖజానాకు 2500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నది అధికారుల ఆరోపణ. రేపో మాపో న్యాయస్థానం అనుమతితో ఆయనను కస్టడీకి తీసుకోనుంది ఏసీబీ.
మైనింగ్ దోపిడీ వెనుక ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదలడ ఖాయమని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆ డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారణ జరపాల్సిందేనని అంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
ఈ వ్యవహారంలో ఘనుడు వెంకటరెడ్డి అయితే, తెరవెనుకున్న ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఐదేళ్లగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారని ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని దుయ్యబట్టారు.
ALSO READ: పవన్కు ఏం తెలీదు.. బాబుకు బుద్ది లేదు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన రోజా, మదురైలో పూజలు
టెండర్లు, ఒప్పందాల పేరిట నిబంధనలన్ని బేఖాతరు చేశారని విమర్శించారు. చివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం తుంగలో తొక్కారని, ప్రభుత్వానికి రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారని బాణాలు సంధించారామె.
వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు, సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి వక్కానించారు కాంగ్రెస్ చీఫ్. పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కూటమి సర్కార్ను డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. వీలైతే సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
సింపుల్గా చెప్పాలంటే అధికార పార్టీ టీడీపీ, విపక్ష వైసీపీని వదల్లేదు వైఎస్ షర్మిల. వైసీపీ అధినేత జగన్ మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ షర్మిల కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఏపీలో వైసీపీ కంటే కాంగ్రెస్ ప్రతిపక్ష రోల్ పోషిస్తుందని నేతలు చెప్పుకోవడం కొసమెరుపు.
YCP @YSRCParty ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు… పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా..విచారణ జరపాలి. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే…తెరవెనుక ఉండి,సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి…
— YS Sharmila (@realyssharmila) September 28, 2024